మనం కొన్ని ఆలయాలలో శ్రీమహావిష్ణువుని పడుకుని ఉన్న రూపంలో దర్శించి ఉండవచ్చు కానీ శివున్ని ఎప్పుడైనా అలా పడుకుని ఉన్న రూపంలో చూశారా..! మహాశివుని దర్శనం సాధారణంగా లింగ రూపంలోనే ఉంటుందని మనందరికీ తెలుసు, కాకపోతే కొన్ని చోట్ల విగ్రహాల రూపం కూడా ఉండవచ్చు కానీ పడుకున్న శివుడిని(Lord Shiva) ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా అయితే ఇలాంటి పడుకుని ఉన్న శివుని ఆలయం ఎక్కడ ఉందా అనుకుంటున్నారు కదూ..
ఇలాంటి అపురూప ఆలయం యొక్క ప్రత్యేకత ఇప్పుడు మనం తెలుసుకుందాం..పడుకుని ఉన్న శివుని ఆలయం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని సురుటుపల్లిలో ఉంది. ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది మరియు ఈ ఆలయానికి గల స్థల పురాణం కూడా చాలా గొప్పదనే చెప్పవచ్చు.
స్థల పురాణం
మనలో చాలామందికి పురాణాల గురించి కొంత తెలిసే ఉంటుంది. అందులో ముఖ్యమైనది క్షీరసాగరం మధనం అనే కథ. ఈ క్షీరసాగర మధన సమయంలో ఎన్నో అద్భుతాలు సముద్రం నుండి ఉద్భవించాయి. వాటితో పాటుగా హాలాహలం కూడా ఉద్భవించిది అని చెబుతుంటారు కదా. హాలహలం అంటే విషం అని మనందరికీ తెలుసు అయితే ఈ విషానికి హాలాహలం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
మందర పర్వతానికి తాడులా కట్టిన వాసుకి సర్పం యొక్క బాధలో నుంచి వచ్చిందట. అంటే వాసుకి సర్పం నొప్పి భరించలేక బాధతో హాలం అనే విషాన్ని కక్కిందట అప్పుడు సముద్రంలోంచి ఈ హలం అనే విషం ఉద్భవించి ఇవి రెండూ కలిసి హాలాహలం అనే పేరు ఆ విషానికి వచ్చిందని చెబుతున్నారు. ఆ విషాన్ని చూసి దేవతలందరూ భయపడి అసలు ఈ విషం ఎవరు స్వీకరించాలో తెలియక సందిగ్ధంలో పడి ఈశ్వరుడిని ప్రార్థించారట అయితే ఈశ్వరుడు సర్వ జగద్రక్షకుడు కాబట్టి ఆ విషయాన్ని స్వీకరించాడట.
పార్వతీదేవి ఆ విషం స్వామి(Lord Shiva) గొంతులోకి దిగకుండా ఆపడం వలన ఆ విషం కంఠంలోనే నిలిచిపోయి గరళ కంటడు అనే పేరు కూడా ఈశ్వరుడికి వచ్చిందని మనందరికీ తెలుసు. ఆ విధంగా గరళమును స్వీకరించి సర్వ జగత్తును కాపాడిన రోజు “శనివారం, తిధి: త్రయోదశి ” ప్రదోష వేళలో. సర్వ జగత్తుని కాపాడిన సంతోషంలో ఈశ్వరుడు నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్య ఆనందతాండవం చేశాడట. అందుకే ప్రదోష వేళ లో నందీశ్వరునికి నమస్కరిస్తే శివుని ఆశీస్సులు పొందవచ్చని పండితులు చెబుతుంటారు.
హాలాహలం స్వీకరించిన తర్వాత గౌరీదేవితో కలిసి కైలాసానికి బయలుదేరాడట ఆ పరమశివుడు(Lord Shiva) మార్గమధ్యంలో ఈ సూరుటుపల్లి వచ్చేటప్పటికీ ఈశ్వరుడికి విషం వల్ల కొద్దిగా కళ్ళు తిరిగినట్లు అనిపించడంతో లోకమాత అయిన పార్వతీదేవి ఓడిలో తల పెట్టుకుని ఆ స్వామి విశ్రాంతి తీసుకున్నారట. సకల జీవులకు సర్వ మంగళాన్ని ప్రసాదించే జగజ్జనని అయిన పార్వతీదేవి ఇక్కడ సర్వ మంగళి ,మరగదంబిక గా పిలవబడుతోంది పడుకున్న ఈశ్వరుడు కనుక ఆ స్వామిని “పల్లికొండేశ్వర స్వామి“గా పిలవబడుతున్నారని స్థల పురాణం.
ఆ పరమశివుడు లోకమాత అయిన పార్వతి దేవి ఓడి లో తల పెట్టుకుని శయనించినట్లు దర్శనమిచ్చేది ప్రపంచంలో బహుశా ఈ ఒక్క ఆలయంలోనే ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. 19 అడుగుల పొడుగునా సర్వమంగళ దేవి ఒడిలో తల పెట్టుకుని ఉన్న ఈ శయన శివుడు అమ్మవారు అత్యద్భుతమైన సౌందర్యంతో విలసిల్లుతుంటారు. చుట్టూ శ్రీ మహా విష్ణువు, బ్రహ్మ, తుంబురుడు, పులస్త్యుడు, నారదుడు, భృగు మహర్షి, సూర్యచంద్రులు, ఇంద్రుడు, మార్కండేయుడు, కుబేరుడు, అగస్త్యుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, వీరంతా ఓ పరివారంలా కనిపిస్తూ స్వామి అమ్మవార్లకు నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తుంది.
ఇక్కడ హాలాహలం నుంచి సర్వజగతులను రక్షించాడు కనుక శివుడు ప్రదోష సమయంలో ఆనందంతో నందీశ్వరుని కొమ్ముల మధ్య ఆనందతాండవం చేశారు. అందువలన ఇక్కడ ప్రదోష సమయానికి గొప్ప విశిష్టత ఉంది . ఆ ప్రదోష సమయంలో చేసేదే ప్రదోష పూజ. ప్రదోష వేళ లో శివ ఆరాధనా సర్వ పాపా హరణం అంటారు పెద్దలు. నిజానికి ప్రదోష సమయంలో పూజలు ముందుగా స్వామికి ఇక్కడే ప్రారంభమయ్యాయని ఆ తర్వాతే ఈ ప్రదోష వేళ లో ప్రదోష పూజ మిగతా శివాలయాలకు విస్తరించిందని పండితులు చెప్తున్నారు. ప్రదోష వేళ లో నందీశ్వరునికి కూడా ప్రాముఖ్యత ఇస్తూ నందీశ్వరునికి కూడా అభిషేకం చేస్తారట ఈ “పల్లికొండేశ్వర స్వామి” ఆలయంలో.