(Tirumala) తిరుమల కాలినడక మార్గంలో చిరుత సంచారం భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. శ్రీవారి మెట్లు, అలిపిరి మార్గాల ద్వారా కాలినడకన వెళ్లాలంటేనే భక్తులు భయపడిపోతున్నారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు శ్రీవారి చెంతకు చేరుకునేందుకు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. అయితే వరస సంఘటనలతో కాలినడకన వెళ్లే భక్తులు ఏ వన్యప్రాణి వచ్చి ఎప్పుడు దాడి చేస్తుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నడుస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ భక్తులపై వన్యప్రాణుల దాడులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల చిన్నారి లక్షిత మరణించడంతో అప్రమత్తమయిన టీటీడీ అధికారులు కాలినడకన వచ్చే భక్తులకు చేతికర్రలను కూడా ఇచ్చారు. దీనికి తోడు గుంపులుగా వెళ్లాలని, వారితో ఒక సెక్యూరిటీ గార్డును కూడా పంపుతున్నారు. దీంతో పాటు గోవింద నామ స్మరణ చేసుకుంటూ వెళ్లాలన్న సూచనలు టీటీడీ నుంచి వెలువడుతున్నాయి.
కాలినడకన వెళ్లే… (Tirumala)
తిరుపతి నుంచే అనేక మంది భక్తులకు సెక్యూరిటీ సిబ్బంది తగిన జాగ్రత్తలు చెప్పి పంపుతున్నారు. గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తుల సంరక్షణ కోసం సెక్యురిటీ గార్డులు అన్ని వేళలా పహరా కాస్తున్నారు. రాత్రి వేళ చిన్నారులను అనుమతించకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంది. చిన్నారుల విషయంలో ట్యాగ్ లు కూడా కడుతూ వారు తప్పిపోయినా వెంటనే గుర్తు పట్టగలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల మీద వన్య ప్రాణులు దాడులు చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకూ కాలినడక మార్గంలో నాలుగు చిరుత పులులు, ఇక ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా బోనులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా నిఘాను కూడా ఉంచారు.
అన్నీచిక్కినట్లేనా?
నిన్న మొన్నటి వరకూ మూడు చిరుతలు మాత్రమే అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కాయి. నాలుగో చిరుత కోసం అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు అటవీ శాఖ అధికారుల శ్రమ ఫలించింది. నాలుగో చిరుత కూడా చిక్కింది. దీంతో కాలి నడక మార్గంలో మొత్తం నాలుగు చిరుతలను అధికారులు బంధించగలిగారు. వాటిని తిరుపతి జూకు తరలించారు. వన్యప్రాణుల నుంచి రక్షణ కల్పించేందుకు తాము చేయగలిగినదంతా చేస్తున్నామని, భక్తులు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ఈ ఆపరేషన్ ను పూర్తి చేశారు.
భక్తులు కూడా… (Tirumala)
భక్తులు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వన్యప్రాణులు దాడులు చేయవచ్చని చెబుతున్నారు.తమ పహారా నిరంతరం ఉంటుందని, అయినా భక్తులు కూడా తమ జాగ్రత్తలు తాము తీసుకుంటే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. మూడు చిరుతలను తిరుపతి జూకు అప్పగించామని, ఒక దానిని మాత్రం అడవిలో వదిలేశామని సీసీఎఫ్ నాగేశ్వరరావు మీడియాకు వివరించారు.ఇప్పటి వరకూ గుర్తించిన నాలుగు చిరుతలు దొరకడంతో అటవీ శాఖ అధికారులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు.భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, టీటీడీ సూచనలు పాటిస్తూ కాలినడకన స్వామి వారి చెంతకు వెళ్లాలన్న సూచనలు ఇంకా పాటించాల్సి ఉంటుంది.