(UP)
తరగతి గదుల్లో పిల్లలకు సమానత్వం, ప్రేమ, కలుపుగోలు తనం, ఐకమత్యం, సాటి మనిషి పట్ల దయ, ప్రేమను నేర్పాల్సిన టీచర్ విద్వేష బీజాలను నాటితే? మత పరమైన విద్వేషాలను రేపితే.. అమాయకమైన ఆ పిల్లల మనసుల్లో ఎంత ద్వేషం నాటుకుంటుంది? పిల్లలకు సత్ ప్రవర్తన నేర్పాల్సిన టీచర్ మత విద్వేషాలను రెచ్చగొట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది యూపీలో జరగడంతో మరింత సంచలనంగా మారింది.
ఇదేం పనిష్మెంట్?
యూపీలో ఓ ముస్లిం విద్యార్ధిని క్లాస్ రూమ్ లో సహా విద్యార్ధులతోనే చెంప దెబ్బలు కొట్టించిన సంఘటన పై విమర్శలు పెరుగుతున్నాయి. ఎక్కాలు అడిగితే చెప్పలేదన్న కోపంతో క్లాస్ టీచర్ ఆ ముస్లిం కుర్రాడికి వెరైటీ పనిష్మెంట్ ఇచ్చింది. ముక్కు పచ్చలారని చిన్నారి చెంపలపై కొట్టమని ఇతర విద్యార్ధులను ఆదేశించింది. టీచర్ చెప్పడంతో మరేం చేయలేక పిల్లలు ఒకరి తర్వాత ఒకరు ఆపసివాడి చెంపలపై కొట్టారు.. సగం క్లాస్ పూర్తయ్యేసరికి పిల్లవాడి చెంపలు కందిపోయాయి. దిక్కు తోచని స్థితిలో ఏడుస్తుంటే.. చెంపలపై కన్నీళ్లు కారుతున్నా ఆ టీచర్ కి కనికరం కలగలేదు. పైగా మరింత గట్టిగా కొట్టమంటూ పిల్లలను ఆదేశించింది. ముఖం ఎర్రబడిపోయింది. ఇక వీపుపై కొట్టండి అని కూడా టీచర్ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. యూపీలోని ముజఫర్ నగర్లోని నేహా పబ్లిక్ స్కూల్ లో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం స్రుష్టించింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీచర్ వివాదాస్పద కామెంట్లు
త్రుప్తి త్యాగి అనే ఆ టీచర్ ముస్లిం లను గట్టిగా కొట్టాలంటూ మతపరమైన కామెంట్లు కూడా చేయడం సంచలనం గా మారింది. కుర్రవాడి వీడియో వైరల్ కావడంతో అప్రమత్తమైన పోలీసులు టీచర్ పై కేసు పెట్టారు. వీడియో చూసిన వారికి మాత్రం కన్నీళ్లు ఆగవు.. ఆవిద్యార్ధి ఏడుస్తుంటే.. ఇంకా గట్టిగా కొట్టండి.. ఇప్పుడు ఎవరి వంతు అని టీచర్ అనడం చూపరుల గుండె పిండేస్తుంది. పనిష్మెంట్ పేరుతో గంటల తరబడి నిలబెట్టడమే కాక ఇంత దారుణంగా కొట్టించిన టీచర్ పై విమర్శలు రేగుతున్నాయి.
లైట్ తీసుకున్న టీచర్ (UP)
ఇంత జరిగినా ఆ టీచర్ తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా.. పిల్లలన్నాక ఆ మాత్రం కంట్రోల్ చేయకపోతే ఎలా అంటూ కామెంట్ చేయడం విడ్డూరం. దీనిలో మతపరమైన కోణం ఏదీ లేదంటూనే.. ఇందులో ఏముందని ఇంత అల్లరల్లరి చేస్తున్నారు ? అంటూ ఎదర ప్రశ్నించడం విచిత్రం. తీరా పోలీసులు మందలించే సరికి తాను దివ్యాంగురాలినని కుర్చీలోంచి లేవలేక దూరంగా ఉన్న పిల్లవాడిని శిక్షించేందుకు పిల్లలతో చెంప దెబ్బలు కొట్టించినట్లు వివరణ ఇచ్చింది. దెబ్బలతో అల్లాడిపోయిన ఆ పిల్లవాడిని మీరట్ లోని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆ బాలుని పరిస్థితి నిలకడగా ఉంది. ఇక ఆ స్కూల్ కి పసివాడిని పంపేది లేదని మరో స్కూల్ లో చేర్చాలని బాలుడి తల్లిదండ్రులు నిర్ణయించారు.
స్పందించిన బాలల హక్కుల సంఘం (UP)
దీనిపై బాలల హక్కుల సంఘం కూడా స్పందించింది. టీచర్ పై కేసు నమోదు చేసింది. బాలలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసేటప్పుడు పాటించాల్సిన నియమావళిని ఉల్లంఘించిన ఆల్ట్ న్యూస్ అనే ఫ్యాక్ట్ చెక్ సైట్ కు చెందిన జర్నలిస్ట్ జుబేర్ పై కేసు నమోదు చేసింది. ఈ వార్తలను ప్రసారం చేసేటప్పుడు బాధితుల ముఖాన్ని మాస్క్ చేయాలన్న నియమాన్ని జుబేర్ ఉల్లంఘించారని విమర్శించింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 లోని సెక్షన్74 ప్రకారం బాధితుల ఐడెంటిటీ వెల్లడించకూడదు.. అయితే ఆల్ట్ సంస్థ ఈ నియమాన్ని ఉల్లంఘించడంతో అతనిపై కేసులు నమోదయ్యాయి. తరగతి గదిలో సోదర భావాన్ని, ప్రేమను నేర్పాల్సిన టీచర్ ఇలా విద్వేషాలను నూరిపోస్తూ పిల్లలను ట్రీట్ చేయడం పసిపిల్లల్లో మత బీజాలను నాటడమేనంటూ పౌర హక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి.