(Rice)
ధరలు మండిపోతున్నాయి. కూరగాయల నుంచి అన్ని ధరలకు రెక్కలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. మొన్నటి వరకూ టమాటా వంటింటిలో కనిపించకుండా పోయింది. ఇక ఉల్లి ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఏవీ నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో సామాన్య, నిరుపేద, మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు టమాటా ధరలు దిగి వచ్చాయని సంతోషించేలోగా ఉల్లి ధరలు పెరుగుతుండటం కూడా ఆందోళన కల్గిస్తుంది. ఇలా ఉంటే బియ్యం ధరలు కూడా మరింత పెరిగాయి. ఇంకా పెరగనున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
దక్షిణ భారతదేశంలోనే…
దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరి (Rice) పంట ఉంటుంది. ఇక్కడ పండే ధాన్యాన్ని దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన పంటగా వరిని వేస్తారు. ఇక్కడి నుంచే ఎక్కువగా ఎగుమతులుంటాయి. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఉత్తర భారత దేశంలో ఎక్కువగా గోధుములు వాడినా తమ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయమ మేరకు బియ్యంతోనే ఎక్కువ కడుపునింపుకోవడం ఆనవాయితీగా మారింది. కనీసం ఒకపూట రైస్ తో భోజనం చేయకపోతే కడుపు నిండినట్లు ఉండదు. అందుకే బియ్యం ఇక్కడ అధికంగా పండినా.. ఇక్కడే వినియోగం కూడా ఎక్కువగా ఉండటం కూడా గమనించాల్సిన అంశం.
నిషేధం విధించినా…
సోనా మసూరి బియ్యాన్ని ఎక్కువగా దక్షిణ భారతదేశం ప్రజలు వినియోగిస్తారు. గతంలో 25 కిలోల బస్తాను తూకం వేసి ఇచ్చేవారు. అయితే జీఎస్టీ వచ్చిన తర్వాత వ్యాపారులు 26కేజీల బస్తాను వినియోగదారులకు అందిస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకూ 26కేజీల మేలురకం బియ్యం బస్తా పన్నెండు వందల రూపాయలుండగా, ప్రస్తుతం పదిహేను వందల రూపాయలకు చేరుకుంది. ముందుగానే కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. తాజాగా బాస్మతి, ఉప్పుడు బియ్యం ఎగుమతలుపై కూడా ఆంక్షలు పెట్టింది. ఈ కారణంగా ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నప్పటికీ వ్యాపారులు మాత్రం ధరలు పెంచుతూ వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు. బియ్యం ధరలు పెరుగుతాయని ముందుగానే పసిగట్టిన వ్యాపారులు వాటిని బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
వీటి ధరలు కూడా… (Rice)
బియ్యం ధరలతో పాటు నిత్యం వంటింట్లో వినియోగించే కందిపప్పు, నూనె ధరల్లో కూడా పెరుగుదల కనిపిస్తోంది. నిన్నటి వరకూ మేలురకం కందిపప్పు కిలో 130 రూపాయలు పలుకగా ఇప్పుడు అది 160 రూపాయలకు చేరుకుంది. ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో బియ్యం ధరలు మరింత పెరగకుండా అదుపు చేయవచ్చన్న సర్కార్ ఆలోచన మాత్రం ఆచరణలో సాధ్యం కావడం లేదు. మిల్లర్లు, వ్యాపారులు ఇప్పటికే బియ్యాన్ని నల్లబజారుకు తరలించడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చక్కెర ధర కూడా నిన్న మొన్నటి వరకూ నలభై నుంచి నలభై నాలుగు రూపాయలు ఉండేది. ఇప్పుడు యాభై రూపాయలు చేరుకోవడంతో వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దళారులతో పాటు బ్లాక్ మార్కెటింగ్ పైన కూడా దృష్టి పెట్టాలని ప్రజలను కోరుతున్నారు.