తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు CBN ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఆయన హస్తిన పర్యటన పార్టీ శ్రేణుల్లో ఊపు తెప్పించడమే కాకుండా అభిమానుల్లో కూడా ఉత్సాహం నింపుతుంది. అలా సాగుతుంది ఆయన పర్యటన. గతంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీతో కరచాలనం చేశారు. ఇరువురూ ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు. ఇక రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్లేనని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. నాలుగేళ్ల తర్వాత మోదీని నేరుగా చంద్రబాబు కలవడం అప్పట్లో తెలుగునాట చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారంటూ సోషల్ మీడియాలో పసుపు పార్టీ నేతలు ఉత్సాహం ఊరకలేసింది.
నడ్డాతో భేటీలో… CBN
ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల సందర్భంగా కూడా చంద్రబాబు జేపీ నడ్డాతో కలసి కూర్చుని మాట్లాడారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కుదిరినట్లేనని కామెంట్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ ఫొటోను కూడా ఒక బీజేపీ నేత మీడియాకు అందచేసినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల సూచనల మేరకే సదరు బీజేపీ నేత ఫొటోను మీడియాకు ప్రత్యేకంగా పంపినట్లు అంటున్నారు. జేపీనడ్డాతో చంద్రబాబు CBN ఈ సందర్భంగా ఏం చర్చించిందీ బయటకు రానప్పటికీ, పొత్తులపై ఆయనతో మాట్లాడినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. జగన్ ను గద్దె దించాలంటే మూడు పార్టీలూ ఏకమవ్వాలన్న చంద్రబాబు సూచనకు జేపీ నడ్డా కూడా కొంత సానుకూలత వ్యక్తం చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇది మోదీ, అమిత్ షాల స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం పట్టే అవకాశముందని కూడా వారు అంటున్నారు.
పొత్తు చర్చలా?
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా టీడీపీని కూడా కలుపుకుని పోయేందుకు ప్రయత్నాలుచేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే పొత్తులపై చర్చిద్దామని పార్టీ హైకమాండ్ చెప్పిందని తేలింది.ముందుగా ఏపీలో టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నా ఆ ప్రభావం ముందుగా జరిగే తెలంగాణ ఎన్నికలపై పడుతుందని తెలంగాణ కమలం పార్టీ నేతలు చేసిన సూచనను ఢిల్లీ నాయకత్వం పరిగణనలోకి తీసుకుంది. అందుకే తెలంగాణలోనూ టీడీపీతో పొత్తు లేకుండా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే మరోసారి కేసీఆర్ సెంటిమెంట్ రగిల్చే ప్రమాదముందని గ్రహించిన కాషాయ పార్టీ నేతలు అందుకు అభ్యంతరం చెబుతూ వచ్చారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో కూడా వారు అభ్యంతరం చెప్పడంతో ఆయనను ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేసిందంటారు.
అండాదండా…
బీజేపీ అండ చంద్రబాబు CBN కు అవసరం. కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ అండ ఉంటే తప్ప జగన్ ను ఎదుర్కొనలేని పరిస్థితి. అందుకే ఆయన చివరి నిమిషం వరకూ తన ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఢిల్లీ వెళ్లినప్పుడు కమలం పార్టీ అగ్రనేతలను కలసి పొత్తులపై నేరుగా కాకున్నా రాజకీయాల ప్రస్తావన తెస్తూ కొంత వారిని తన వైపునకు తిప్పుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యూహాలను అమలు చేస్తారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేరు.తనకు ఓటింగ్ శాతం పెరిగిందని భావిస్తున్న చంద్రబాబు అందుకు తగిన ఎలక్షనీరంగ్ కూడా చేయాలంటే కమలం పార్టీతో కలవడం అవసరం.అందుకే ఆయన పొత్తుల కోసం పరితపిస్తున్నారు. జేపీ నడ్డా, చంద్రబాబుల మధ్య చర్చ ఏం జరిగిందో తెలియదు కానీ పొత్తులపైనే ప్రధానంగా టీడీపీ అధినేత మాట్లాడినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఢిల్లీ వెళుతున్నప్పుడల్లా ఇలాంటి రూమర్స్ మామూలేనంటున్నాయి వైసీపీ వర్గాలు.