UK-814
పసి పిల్లలతో ప్రయాణాలంటే భయపడాల్సిందే.. ఆరోగ్యంగా ఉంటే పర్లేదు.. కానీ ఏవైనా అనారోగ్య సమస్యలుంటే మాత్రం కష్టం..విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పసిపిల్లలకు ప్రాణాపాయమే సంభవిస్తే దానినుంచి బయటపడటం చాలా చాలాకష్టం.బెంగుళూరు, ఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న విస్తారా విమానం గాల్లో ఉండగా ఓ ఏడాదిన్నర వయసున్న చిన్నారి శ్వాస తీసుకోలేక సతమతమైంది.
చిన్నారి పరిస్థితి చూసి తల్లి దండ్రులు తల్లడిల్లి పోయారు. అయితే అదే విమానంలో వస్తున్న కొందరు డాక్టర్లు ఆ ప్రమాదం నుంచి చిన్నారిని సురక్షితంగా బయటపడేశారు.విమానం బయల్దేరిన అరగంటకు ఆ పసిపిల్ల ఊపిరి ఆడక సతమతమైంది. ఏం చేయాలో పాలుపోని తల్లిదండ్రులు విమాన సిబ్బందికి పరిస్థితి వివరించారు. అయితే విమానంలో వైద్యులు ఎవరైనా ఉన్నారా అని సిబ్బంది అనౌన్స్మెంట్ చేశారు.
విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిఉంటుందని అంతా భావించారు. అయితే అదే విమానంలో ఎయిమ్స్ కు చెందిన నలుగురుసీనియర్ వైద్యులు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ కు చెందిన మరో డాక్టర్ ఈఅనౌన్స్ మెంట్ కు స్పందించారు. చిన్నారి సైనోటిక్ డిజార్డర్ తో బాధపడుతోందని గుర్తించారు. రక్తంలో తగినంత ఆక్సిజన్ లేక ఆమె చర్మం నీలిరంగులోకి మారిపోవడాన్ని గమనించారు.
విమానంలోనే వైద్యుల బ్రుందం! UK-814
బెంగళూరులో జరుగుతున్న వ్యాస్కులార్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజి రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు ఈ డాక్టర్ల బ్రుందం బెంగళూరు వచ్చింది.తిరుగు ప్రయాణంలోఈ వింత పరిస్థితి ఎదురైంది.ఎమర్జెన్సీ కండిషన్ ను గుర్తించిన వైద్యులు చిన్నారిని ప్రాణాపాయం నుంచి రక్షించడానికి మూడు ముఖ్యమైన చర్యలు తీసుకున్నారు. చిన్నారి తలను తల్లకిందులుగా ఉంచడం,దవడలపై ఒత్తిడి ఉంచి గడ్డాన్ని ఎత్తిపట్టుకుని ఫేస్ మాస్క్ ఉపయోగించి వెంటిలేషన్ కల్పించారు.
విమానంలో వనరులే వైద్య పరికరాలు!
పిడియాట్రిక్ లైఫ్ సపోర్ట్ ప్రోటోకాల్ ప్రకారం ఛాతీపై ఒత్తిడి కలిగించారు. ఆక్సిజన్ సిలిండర్ ను ఆంబు బ్యాగ్ కు తగిలించి, విమానంలో దొరికే ఆక్సిజన్ మాస్క్ నుంచి తీసిన ట్యూబ్ ను ఈ సిలిండర్ ద్వారా చిన్నారికి అందించేలా ఏర్పాటు చేశారు.
మొత్తంమీద విమానంలో అందుబాటులో ఉన్నవనరులతోనే ఆ పసిపాపకు ట్రీట్ మెంట్ మొదలు పెట్టారు. ఐవీ లైన్ ను ఏర్పాటు చేసి ఆ పసిపాప బరువును లెక్కించి ప్రాధమికంగా ఇవ్వాల్సిన ఎమర్జెన్సీ డ్రగ్స్ శరీరానికి అందించారు.ప్రతీ అయిదు నిమిషాలకు ఇదే ట్రీట్మెంట్ కొనసాగించారు.
విమానంలో అందుబాటులో ఉన్న ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీ ఫెబ్రిలేటర్ ద్వారా సీపీఆర్ అందిస్తూనే కార్డియాక్ షాక్స్ కూడా ఇచ్చారు.45 నిమిషాల సీపీఆర్ తర్వాత రక్తప్రసరణ వేగం పుంజుకుంది. అయితే ఈసీజీ/ ఆక్సిజన్ వివరాలను తెలుసుకునే వీలు లేకపోవడంతో హార్ట్ రేట్ ను మానిటర్ చేసే వీలు లేకపోయింది. సమీపంలోని ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిందిగా వైద్య సిబ్బంది పైలట్ ను కోరారు.దాంతో 20 నిమిషాల దూరంలో ఉన్న నాగ్ పూర్ ఎయిర్ పోర్టులో రాత్రి పదిన్నరకి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.టర్మాక్ పై అంబులెన్స్ తో సిద్ధంగా ఉన్న పిడియాట్రీషియన్ కు స్థిరమైన హ్రుదయ స్పందనలు, రక్తప్రసరణ తో కూడిన ఆ బుల్లి పేషెంట్ ను అందచేశారు. దాంతో ప్రాణాపాయం తప్పింది. ఆదివారం రాత్రి9 గంటలకు బెంగళూరు నుంచి ఢిల్లీకి బయల్దేరిన UK-814 విమానంలోఈసంఘటన చోటు చేసుకుంది. ఈవిమానం 11.45కి ఢిల్లీ చేరాల్సి ఉంది. అనుకోని ఈ సంఘటనతో విమానం కాస్త ఆలస్యంగా ఢిల్లీకి చేరుకుంది. అయితేనేం చిన్నారి మాత్రం సంపూర్ణ ఆరోగ్యవంతురాలై కోలుకోవడం అందరికీ సంతోషాన్ని పంచింది. ప్రాణంపోవాల్సిన ఆ పసిదాని ఆయుష్షును ఫ్లైట్ లో ఉన్న డాక్టర్లే నిలబెట్టారు..ఆయుష్షుగట్టిదైతే ఒక్కోసారి ఇలాంటి మిరాకిల్సే జరుగుతాయి.. మొత్తానికి ఏడాదిన్నర వయసున్న ఈ బుల్లి పాప గట్టి పిండమే మరి!