(ycp)
ఎవరు అవునన్నా కాదన్నా ఒక్కటి మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్ లో జగన్ రాజకీయ నేతలను నిద్రపోనివ్వడం లేదు. సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ గత ప్రభుత్వాలకు భిన్నంగా పాలన సాగిస్తుండటంతో జనం సానుకూలతతో ఉన్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం ద్వారా లక్షల రూాపాయల లబ్ది చేకూరుతుంది. దాదాపు మూడున్నర కోట్ల మందికి ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లకు పైగా వివిధ పథకాల ద్వారా నగదును అందించింది. దీంతో పాజిటివ్ ఓటు ద్వారానే మరోసారి గెలవడం గ్యారంటీ అన్న నమ్మకం వైసీపీ నేతల్లో కలుగుతుంది. జగన్ సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ ను ఎంచుకుని మరీ ఆ డేట్ కు నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా చూస్తున్నారు.
ప్రతి ఇంటికీ…
అప్పులు తెచ్చారా? అభివృద్ధిని పక్కన పెట్టారా? అన్నది వారికి అనవసరం. మనకు.. మన ఇంటికి లబ్ది చేకూరుతుందా? లేదా? అన్నదే చూస్తారు. గత ప్రభుత్వాలతో బేరీజు వేసుకుంటే ఎంతో కొంత లబ్ది ఈ ప్రభుత్వంలో తమకు చేకూరుతుందని భావిస్తున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఇప్పటికీ పటిష్టంగా ఉందంటే అందుకు కారణం జగన్ అమలు చేసే సంక్షేమ పథకాలే.
బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తుండటంతో పాటు తమ గ్రామాలకే అన్ని సేవలను అందించడం, వాలంటీర్ల ద్వారా పింఛనుతో పాటు ప్రభుత్వ పథకాలను చేరవేయడం కూడా ఒక రకంగా జగన్ కు వచ్చే ఎన్నికల్లో సానుకూల వాతావరణం తెచ్చి పెట్టిందని చెప్పాలి. ఎన్నికలకు ముందు విపక్షాలు ఎన్ని తాయిలాలు ప్రకటించినా, ఉచిత హామీలిచ్చినా తమ విజయానికి ఢోకా లేదన్న నమ్మకంతో వైసీపీ నేతలున్నారు.
గత ఎన్నికల్లో… (ycp)
2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలలో విజయం సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. దేశ రాజకీయాల్లోనే అత్యధికంగా యాభై శాతం ఓట్లకు పైగా సాధించడమంటే ఆషామాషీ కాదు. ఇందులో జగన్ కష్టం లేకపోలేదు. జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేయడం ఒక కారణమయితే.. వైఎస్ కుటుంబానికి జరిగిన అన్యాయం పైనకూడా సానుభూతి వెల్లువలా పెల్లుబికింది. అందువల్లనే అంతటి విజయం సాధ్యమయింది. జగన్ ఫొటో పెట్టుకునే గత ఎన్నికల్లో 80 శాతం మంది అభ్యర్థులు గెలిచారంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సొంతబలం ఉన్న నేతలు కొందరున్నప్పటికీ, వారికి జగన్ ఫొటో తోడు కావడంతో అత్యధిక ఓట్లు ఈవీఎంలలో వచ్చి పడ్డాయి. అనేక మంది కొత్తవారికి టిక్కెెట్లు ఇచ్చినా గెలిచారంటే అది జగన్ ఏకైక కారణమని చెప్పక తప్పదు.
ఈసారి కూడా…
సాధారణంగా ఒకసారి ప్రభుత్వ పాలన చూసిన తర్వాత రెండోసారి సానుభూతి, ఇమేజ్ పెద్దగా వర్క్ అవుట్ కాదు. పాలనను మాత్రమే ప్రజలు చూస్తారు. ఎన్టీఆర్ అంతటి నేతను కూడా రెండో దఫా జనం దూరం పెట్టారు. అయితే వైసీపీ మాత్రం జగన్ ఫొటోతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని దాదాపుగా డిసైడ్ అయింది. ఎన్నికయిన మరుసటి రోజు నుంచి జగన్ జనం దృష్టిని తన వైపు పడేలా జాగ్రత్తలు పడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎటువంటి భాగస్వామ్యం లేకుండా నేరుగా నగదును లబ్దిదారులకు అందిస్తూ తానే ఫోకస్ అయ్యారు.
తన తండ్రి వైఎస్ ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా సంక్షేమంలో నెంబరు వన్ లా ఉంటానని ఆయన పదే పదే చెప్పిన ప్రకారమే చేసి చూపించారు. దీంతో ఈసారి కూడా జగన్ ఫొటోతోనే వైసీపీ ఎన్నికలకు వెళ్లనుంది. జగన్ ఫేస్ చూసే ఓట్లు పడేలా ఈసారి కూడా కదనరంగంలోకి దిగుతున్నారు. మరి ఈసారి ఫొటో వర్క్ అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. (ycp)