TS
తెలంంగాణ కాంగ్రెస్ లో చేరికలు ఊపందుకునేలా ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ లో టిక్కెట్లు దక్కని నేతలంతా ఇప్పుడు గాంధీభవన్ వైపు చూస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు,జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేఖానాయక్.. మైనంపల్లి హన్మంతరావు.. ఇలా అనేక మంది నేతలు క్యూ కట్టే అవకాశముందని తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న పార్టీ హైకమాండ్ చేరికలను కూడా ప్రోత్సహిస్తుంది.
ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కండువా కప్పేయడానికి రెడీ అయిపోయింది. ధీటైన అభ్యర్థి అయితే గెలిచి తీరుతాడన్న నమ్మకం కావచ్చు. మూడోసారి కేసీఆర్ ను అధికారంలోకి రానివ్వకుండా ఏదో ఒకటి చేయాలన్న తపన కావచ్చు. చేరతామంటే చాలు.. వెంటనే రా.. రమ్మంటూ రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతున్నారు.
పారాచూట్ నేతలకు…
పారాచూట్ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మరో వైపు కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం నుంచి ఉన్న నేతలు లబోదిబో మంటున్నా గెలుపు గుర్రాలకే అవకాశమంటూ జాయినింగ్స్ గేట్లు లేపేశారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న వారు తీవ్ర నిరాశలకు గురవుతున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు చేరికతో ఇప్పటికే కొందరు నేతలు బీఆర్ఎస్ బాట పట్టారు.
గత నాలుగేళ్లుగా తాము ప్రభుత్వంపై పోరాటం చేసినా ఎన్నికలకు ముందు వచ్చిన వారికి ప్రయారిటీ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేతలు హస్తం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మరికొన్ని చోట్ల రెబల్ గా పోటీ చేస్తామంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. అవసరమైతే తమను పార్టీనుంచి సస్పెండ్ చేయవచ్చని కూడా గట్టిగానే సంకేతాలు పంపుతున్నారు. TS
సీనియర్ నేతలు మాత్రం…
అయితే సీనియర్ నేతలు మాత్రం కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోవర్టులకు అవకాశం ఇవ్వవద్దంటూ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళుతున్నారు. ఇప్పుడు చేరుతున్ననేతలు కాంగ్రెస్ గుర్తు మీద గెలిచినా చివరకు పార్టీలో ఉంటారన్న గ్యారంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ ఇలాగే నమ్మకంగా కాంగ్రెస్ సీట్లు పొంది గెలిచిన వారు బీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
రెండు దఫాలు హస్తం గుర్తు మీద గెలిచిన నేతలు పోలోమంటూ పదవుల కోసం అధికార పార్టీలో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అందుకే కేసీఆర్ కూడా పార్టీ మారిన నేతలందరికీ టిక్కెట్లు ఇచ్చింది ఎన్నికల తర్వాత చేరికలను ప్రోత్సహించడానికేనని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపికతో పాటు చేరికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నది సీనియర్ నేతల సూచన.
కేసీఆర్ కాదనుకున్నవారికి… TS
నిజంగానే అలాగే అనిపిస్తుంది. కేసీఆర్ కొన్ని కారణాల వల్ల టిక్కెట్ నిరాకరించినా వారు తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ తో అనుబంధం ఉన్నవాళ్లు.వాళ్లను ఇప్పుడు చేర్చుకుని టిక్కెట్ ఇచ్చి ఒకవేళ గెలిచినా ఉపయోగం ఉండదనే సీనియర్ నేతల వాదనలో నిజం లేకపోలేదు. ఇప్పుడు టిక్కెట్ పొంది గెలిచినా కూడా తర్వాత ప్రయోజనం ఉండదని వాపోతున్నారు.గత అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతున్నారు. వచ్చే వారిని చేర్చుకోవచ్చు. కానీ వారికి టిక్కెట్లు ఇవ్వకుండా తాము నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకుని రావాలని పంపితే బాగుంటుందని, అప్పుడే పార్టీకి ప్రయోజనమని పలువురు చెబుతున్నారు. మొత్తంమీద ఎన్నికలకు ముందు చేరికలను చూసి సంతోషపడే కంటే తర్వాత జరిగే పరిణామాలను ముందుగానే ఊహించడం బెటర్ అన్న కామెంట్స్ లో వాస్తవం వంద శాతం ఉందనే చెప్పాలి.