PK
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావాలని ఆయన ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. అందుకోసం తాము పోరాటం చేస్తామంటున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి పవన్ కల్యాణ్ పార్టీకి కొంత గ్రాఫ్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఆ విషయాన్ని కూడా ఆయన పదే పదే చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు సంపాదించిన జనసేన పార్టీ ఇప్పుడు బాగా బలపడిందని అంటున్నారు. గత కొంతకాలంగా జరుపుతున్న వారాహి యాత్రకు జనం పోటెత్తుతున్నారు. మూడు జిల్లాల్లోనూ పవన్ యాత్రకు ఊహించని రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే చంద్రబాబు, జగన్ పరిపాలనను చూసిన జనం ఒక్కసారి పవన్ పాలన ఎలా ఉంటుందో చూస్తే పోలా? అని అనుకుంటున్నారన్నది ఆ పార్టీ అగ్రనేతల భావనగా వినిపిస్తుంది.
వచ్చే ఎన్నికల్లో?
దీంతో పాటు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ సైకిల్ పార్టీతోనూ కలసి నడవాలనుకుంటున్నారు. అయితే పొత్తుల ప్రకటనకు ఇంకా సమయం ఉండటంతో ఎవరికి వారే రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ గతంలో మాదిరి ఈసారి రెండు సీట్లలో కాకుండా ఒక్క సీటులోనే పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. రెండు చోట్ల పోటీ చేస్తే జనం కూడా లైట్ గా తీసుకునే అవకాశముందని భావించి ఈసారి ఒక్క స్థానంలోనే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
అచ్చిరాని జిల్లాలో… PK
గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభావం ఎక్కువగా ఉండటం, విడివిడిగా పోటీ చేయడంతో పవన్ రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారన్న విశ్లేషణలో నిజం లేకపోలేదు.కానీ ఈసారి అలా కాదు. పొత్తులతో వెళుతున్నందున ఖచ్చితంగా గెలిచి తీరుతానన్న నమ్మకం ఆయనతో పాటు ప్రధాన నేతల్లోనూ కనిపిస్తుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని 2009లో పెట్టినప్పుడు పాలకొల్లు, తిరుపతిలో పోటీ చేస్తే తిరుపతిలో గెలిచి, పాలకొల్లులో ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో పవన్ తో పాటు ఆయన మరో సోదరుడు నాగబాబు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మెగా కుటుంబానికి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అచ్చిరాలేదన్న సెంటిమెంట్ ఎటూ ఉండనే ఉంది. దీంతో ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పవన్ పోటీ చేసే అవకాశం మాత్రం లేదంటున్నాయి పార్టీ వర్గాలు.
ఈ రెండింటిలో…
అందుకోసమే ఆయన మరోసారి విశాఖ జిల్లాలో పోటీ చేసి తన లక్ను పరీక్షించుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది.వారాహి యాత్రలో భాగంగా కొంతకాలం క్రితం గాజువాకలో పర్యటించినప్పుడు కూడా పవన్ ఈసారి ఇక్కడ గెలిచేది జనసేన జెండాయేనని చెప్పడం చూస్తే మరోసారి ఆయన గాజువాక నుంచి పోటీ చేస్తారా? అన్న అనుమానం కలగక మానదు. పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెత ప్రకారం పవన్ మరోసారి గాజువాక నుంచి పోటీ చేసినా ఆశ్యర్యం లేకపోవచ్చు. అయితే ఈసారి పవన్ గాజువాక నుంచి పోటీ చేస్తే ప్రత్యర్థి పార్టీ వైసీపీ తన అభ్యర్థిని మార్చే అవకాశముందంటున్నారు. నాగిరెడ్డికి మరోసారి అవకాశమివ్వరన్నది ఆ పార్టీ నుంచి వినిపిస్తున్న టాక్. మరో విషయం ఏంటంటే ఈసారి పిఠాపురం నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మొత్తం మీద పవన్ పిఠాపురం లేదా గాజువాక నుంచి ఏదో ఒకదానిలో పోటీకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది పార్టీ నేతల ద్వారా అందుతున్న సమాచారం. చివరి నిమిషంలో మార్పులు జరిగితే చెప్పలేం కాని.. ఇప్పటి వరకూ అయితే ఇదే చర్చ పార్టీలో నడుస్తుంది. PK