రక్షా బంధన్ (Rakhi) కి కొత్త అర్ధం చెబుతున్నారు మధ్యప్రదేశ్ వాసులు.. రేపు రాఖీ పండగ సందర్భంగా గిన్నిస్ రికార్డులకెక్కే విధంగా రాఖీని తయారు చేసారు ఆ రాష్ట్రంలోని భిండ్ ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ. ప్రపంచంలోకే అతిపెద్ద రాఖీని తయారు చేసిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ గిన్నిస్ రికార్డులకు ఎక్కనుంది. మెహగాన్ నియోజక వర్గానికి చెందిన అశోక్ భరద్వాజ్ అనే బీజేపీ ఎంపీ తన ఫామ్ హౌస్ లో దీనిని తయారు చేయిస్తున్నాడు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అమలు చేస్తున్నలాడ్లీ బెహన్ పథకం పట్ల ఆకర్షితుడై ఈ రాఖీని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.
సహజంగా వ్యాపార వేత్త, దాత కూడా అయిన భరద్వాజ్ గతంలో కూడా ఎన్నో సమాజ హిత కార్యక్రమాలు చేపట్టాడు. రాఖీలో గిన్నస్ వాల్డ్ రికార్డుల వివరాలను రికార్డుల్లో చూసిన ఆయన అనుచరులు ఆ రికార్డును బ్రేక్ చేసే విధంగా రాఖీని తయారు చేద్దామని ఎంపీకి చెప్పడంతో భరద్వాజ్ అందుకు సరేనన్నాడు.
వెయ్యి అడుగుల పొడవైన రాఖీ! (Rakhi)
రాఖీ పొడవు దాదాపు వెయ్యి అడుగులు ఉంటుందని తయారీ దార్లు అంటున్నారు. రాఖీ తయారీ పనులను ఓ ఏజెన్సీకి అప్పగించారు.క్లాత్,కార్డుబోర్డు, థెర్మోకోల్ షీట్లు, కలపతో రాఖీ తయారీకోసం 10 మంది పనివాళ్లు కష్టపడుతున్నారు.గుండ్రని షేప్ లో తయారుచేసే రాఖీలో వ్రుత్తాకార వ్యాసార్ధం 25 అడుగులు కాగా దీనికి అదనపు ఆకర్షణగా రెండు చిన్నచిన్న బాల్స్ ను అటాచ్ చేస్తున్నారు.అవి ఒక్కోటి 15 అడుగుల వెడల్పు ఉన్నాయి. రేపే రాఖీ పండగ కావడంతో ఈ అతిపెద్ద రాఖీని వేగంగా పూర్తిచేసే పనిలో పడ్డారు తయారీదార్లు. రాఖీకి సంబంధించిన చిన్నచిన్న భాగాలను వేరుగా తీసుకెళ్లి రంగులు, డిజైన్లు వేయడం లాంటివి చేస్తున్నారు. దానిని రకరకాలుగా డెకరేట్ చేస్తున్నారు.
ఈరాఖీ గతంలో ఉన్న అన్ని రికార్డులను బీట్ చేస్తుందని భరద్వాజ్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే రాఖీ (Rakhi) పొడవు ఎంత ఉండాలన్నది ఇంకా నిర్ణయించలేదు. ఇంత భారీ ఎత్తున కష్టపడి చేస్తున్న ఈ ప్రాజెక్టును ఒకేసారి ఐదు రికార్డుల్లో నమోదు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్,లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వాల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా ఐదు చోట్ల దీనిని నమోదు చేస్తారు.గిన్నిస్ బుక్ రికార్డు నిర్వాహకులు గురువారం భిండ్ చేరుకుని ఈ ప్రాజెక్ట్ వివరాలు పరిశీలించి రికార్డు చేస్తారు. ఆతర్వాత దానిని ప్రపంచంలోకే అతిపెద్ద రాఖీగా ప్రకటిస్తారు.
రికార్డుతోనైనా గుర్తింపు మారుతుందని…
అయితే భరద్వాజ్ ఈ రాఖీ తయారు చేయడం వెనక మరో కారణం కూడా ఉంది.. మధ్యప్రదేశ్ లోని భిండ్ ఏరియా మాన్ సింగ్ లాంటి బందిపోటు దొంగలు, గజదొంగలకు పేరుపడిన ప్రాంతం. తమ ప్రాంతానికి ఇంత చెత్త గుర్తింపు రావడం పట్ల ఆవేదనతో ఉన్న భరద్వాజ్ ఈ వాల్డ్ ఈవెంట్ తోనైనా గిన్నిస్ రికార్డులకెక్కడం ద్వారా ఆ చెడ్డ పేరు పోతుందని ఆశపడుతున్నాడు. ఇప్పటి వరకూ 808 అడుగుల పొడవైన రాఖీయే గిన్నిస్ రికార్డులకెక్కింది. ఇప్పుడు భిండ్ లో తయారవుతున్న రాఖీ దీనికంటే 200అడుగులు అదనంగా పొడవైనది.