(AP CM)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తమ ప్రాంతానికి వస్తున్నారంటే సమస్యలు చెప్పుకోవడానికి జనం బారులు తీరతారు. తమ సమస్య వింటే చాలు పరిష్కారం అవుతుందని భావించి గంటలకొద్దీ జగన్ కోసం నిరీక్షిస్తారు. గత కొద్ది సంవత్సరాలుగా జగన్ జిల్లాల పర్యటనల్లో జరుగుతున్నదిదే. జగన్ తన వద్దకు వచ్చిన వారి బాధలు విని వెంటనే అందుకు పరిష్కారం కూడా చెబుతారు. అధికారులను ఆదేశిస్తారు. తక్షణ సాయం అందించాలని ఉన్నతాధికారులకు చెబుతారు. తాను చేయాల్సిన సాయం అయితే వెంటనే వారిచ్చిన వినతిపత్రాలను తన వ్యక్తిగత సిబ్బందికి ఇచ్చి తాడేపల్లికి వెళ్లిన వెంటనే వాటి పరిష్కారం చేయాలని అక్కడి సీఎంఓ అధికారులను కూడా ఆదేశించిన ఘటనలు అనేకం ఉన్నాయి.
జగన్ పర్యటనల్లో…
పర్యటనలో జగన్ ఆయన దృష్టిలో పడటమే లక్ గా చెప్పాలి. ఒకసారి జగన్ బాధితులను చూశాడంటే వెళుతున్న కాన్వాయ్ ను కూడా ఆపేసి మరీ వారి గోడు వింటారు. చెప్పుకోవడానికి వచ్చిన వారికి భరోసా ఇస్తారు. అందుకే జగన్ ఎక్కడ పర్యటించినా వివిధ రకాలుగా బాధపడుతున్న వారు తాము జగన్ దృష్టిలో పడాలని పరితపిస్తుంటారు.
మానవత్వంతో చేయాల్సిన పనులను సాంకేతిక కారణాలు చూపి నిరాకరించవద్దని కూడా జగన్ అధికారులకు పదే పదే ఆదేశిస్తారు. ఇలా అనేక మంది జగన్ జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు తమ బాధలు చెప్పుకుని సత్వరం ఉపశమనం పొందిన వారు అనేక మంది ఉన్నారు.
కోనసీమ జిల్లాలో… (AP CM)
తాజాగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు జగన్ అక్కడకు వచ్చారు. అది పూర్తిగా వ్యక్తిగత కార్యక్రమమే. వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వెళ్లే సమయంలో ఒక మహిళ తన బాధను చెప్పుకుంది. వెంటనే మూడు గంటల్లో అధికారులు ఆమె సమస్యకు పరిష్కారం చూపారు.
అయినివిల్లి మండలం తొత్తరమూడి గ్రామానికి చెందిన గన్నవరపు ఝాన్సీరాణి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె వయసు 32 ఏళ్లు. ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త కూలీ పనిచేస్తాడు. అయితే ఆదాయం పెద్దగా లేకపోవడం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. జగన్ తమ జిల్లాకు వస్తున్నారని తెలుసుకున్న ఝాన్సీరాణి జగన్ కంట్లో పడేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం సఫలమయింది.
ఉద్యోగం.. ఉచిత వైద్యం…
దీనంగా ఉన్న ఝాన్సీరాణిని చూసి ఆమె వద్దకు వచ్చిన జగన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన పరిస్థితిని ఝాన్సీరాణి వివరించారు. తనను ఆదుకోవాలని, ఉద్యోగం ఇప్పిస్తే తమ కుటుంబం గట్టున పడుతుందని ఆమె చెప్పుకొచ్చారు. అది విన్న జగన్ తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
వెంటనే ఆమె విద్యార్హతల ఆధారంగా ఉద్యోగం ఇవ్వాలని జగన్ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను ఆదేశించారు. జగన్ అలా తన పర్యటనను ముగించుకుని వెళ్లిన వెంటనే జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఝాన్సీ రాణిని తన క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్లి ఆమె విద్యార్హతలను పరిశీలించారు. డిగ్రీతో పాటు డీఈడీ చదివిన ఝాన్సీరాణి పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా చేశారు. వీటిని పరిశీలించిన కలెక్టర్ వెంటనే వికాస సంస్థ సహకారంతో కోజెట్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ లో ఉద్యోగం కల్పించారు.
నెలకు పథ్నాలుగు వేల రూపాయల జీతం అందుకోనున్నారు. ఇది ప్రారంభ వేతనమేనని కలెక్టర్ ఆమెకు వివరించారు. దీంతో పాటు ఉచిత వైద్య పరీక్షలు కూడా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఝాన్సీరాణి కుటుంబం ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. (AP CM)