(TTD)
ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఎప్పుడు చూసినా తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మార్మోగిపోతాయి. సాధారణ రోజులకు, సెలవు దినాలకు తేడా లేకుండా పోయింది. ప్రతి రోజూ యాభై వేల మందికి పైగానే భక్తులు స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇక సెలవు రోజుల్లో అయితే చెప్పడానికి వీలు లేదు. వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూ లైన్ లు ఎక్కడి వరకూ వెళతాయో చెప్పలేని పరిస్థితి. ప్రతి భక్తుడికి దర్శనం కల్పించడంతో పాటు స్వామి వారి అన్నప్రసాదాలు అందేలా చర్యలు తీసుకోవడం, వసతి సౌకర్యాన్ని కల్పించడం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సవాల్ గా మారింది.
క్రమంగా పెరుగుతూ…
కరోనా సమయంలో కొద్ది రోజుల పాటు మందగించిన తిరుమల శ్రీవారి ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తుంది. రోజుకు మూడు కోట్లకు తగ్గకుండా ఆదాయం శ్రీవారి హుండీలలో చేరుతుంది. శ్రీవారికి భక్తులకు సమర్పించే కానుకలను విలువ కట్టలేం కాని, వాటిని ప్రజోపయోగ పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం వెచ్చించనుంది.
భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం తో పాటు సులువుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా గతంలో కంటే అనేక మార్పులు తెచ్చింది. టైమ్ స్లాట్ దర్శనాలను ఏర్పాటు చేసింది. కాలి నడకన వచ్చే భక్తులకు కూడా ప్రత్యేకంగా టోకెన్లు ఇచ్చి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాలి నడకన శ్రీవారికి మొక్కులు చెల్లించుకునే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువయింది.
అంతా ఆన్ లైన్ లోనే… (TTD)
దీంతో పాటు ప్రతి నెల ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు. ఎక్కడి నుంచైనా ముందుగానే స్వామి వారి దర్శనంతో పాటు వసతి గదులు, ప్రత్యేక పూజలు, అలంకరణలు, సేవలకు కూడా భక్తులు హాజరయ్యే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించడంతో సులువుగా తిరుమలకు చేరుకునే భక్తులు తమకు కేటాయించిన సమయంలో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అయినా రద్దీ ఆగడం లేదు.
ఇందుకోసం మరిన్ని వసతి గదులను నిర్మించేందుకు టీటీడీ సిద్ధమవుతుంది. ప్రాధాన్యత క్రమంలో వసతి గృహాలను కేటాయిస్తున్నా తిరుమలలో అనేక మంది బయటే వేచి ఉంటున్నారంటే ఎంతటి రద్దీ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
నిన్న ఆదాయం… (TTD)
తాజాగా నిన్న తిరుమల శ్రీవెంకటేశ్వరుడిని 71,132 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇందులో 26,963 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు టిక్కెట్ లేని భక్తులకు శ్రీవారి దర్శనం పథ్నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
టోకెన్ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయంలోపు శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు గంట నుంచి మూడు గంటల సమయం పడుతుందని అదికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్ల రూపాయలుగా ఉందని చెప్పారు. రానున్న కాలంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఉండటంతో మరింత రద్దీ పెరిగే అవకాశముంది.