రాజకీయాల్లో అనుబంధాలకు తావులేదు. ఆప్యాయతలకు చోటు లేదు. రక్తబంధానికి అర్థం ఉండదు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు పార్టీలో ఉండటం అనేక చోట్ల చూశాం. తెలుగు రాష్ట్రాల్లో మరింత అధికం. కుటుంబ బంధానికన్నా అధికారం దక్కించుకోవడం కోసమే రక్తసంబంధాలను పక్కన పెడతారు. ఆస్తుల కోసం ఘర్షణ పడే వారిని చూశాం. కానీ తండ్రి లెగసీ కోసం పరితపించే వాళ్లు కూడా రాజకీయాల్లో అనేక చోట్ల కనపడతారు. AP
కానీ నిన్న మొన్నటి వరకూ అత్యంత ఆప్తులుగా ఉన్న వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇప్పుడు తమ దారులు మార్చుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. వైఎస్ కుటుంబమంటనే ఐక్యత అని భావించే అనేక మందికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలవడం ఏమాత్రం రుచించడం లేదు.
సోనియాను కలిసి…
వైఎస్ షర్మిల ఈరోజు అంటే రక్షాబంధన్ రోజునే ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ ను కలిశారు. రాజకీయ పరిణామాలపై చర్చించారు. అయితే తాను కేవలం తెలంగాణ రాజకీయాలపై మాట్లాడారని చెబుతున్నప్పటికీ జగన్ వ్యతిరేక మీడియా మాత్రం భిన్నకథనాలను ప్రచురిస్తూ వైఎస్ అభిమానులను ఆందోళనలో పడేస్తుంది.
షర్మిలకు కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీ పగ్గాలు అప్పగిస్తారన్న వార్తలు వారిని కలచి వేస్తున్నాయి. అయితే వైఎస్ షర్మిల సోనియా, రాహుల్ ను కలసి వచ్చిన తర్వాత తాను తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే వారితో చర్చించానని చెప్పినా అసలు వారిని కలవడాన్ని వైఎస్ జగన్ తో పాటు రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఒకింత అసహనానికి గురవుతున్నారు.
షర్మిల కష్టం… AP
ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. రాజకీయం కూడా అంతే. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టుకున్నారు. అందులో తప్పేమీ లేదు. అన్నకు పోటీగా ఏపీలో తాను పోటీ చేసినా పెద్దగా తప్పుపట్టడానికి ఏమీ ఉండదు. గత ఎన్నికల్లో వైఎస్ షర్మిల జగన్ గెలుపు కోసం చేసిన కృషిని మరవలేం. జగన్ పదహారు నెలలపాటు జైలులో ఉన్నప్పుడు ఆమె పార్టీని గాడిన పెట్టారు. పాదయాత్ర చేశారు.
జగన్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చేంత వరకూ హీట్ చల్లారకుండా జనంలో ఉన్నారు. ఆమె ప్రసంగాలు కూడా గత ఎన్నికల్లో జగన్ గెలుపునకు ఒక కారణంగా చెప్పుకో్వాల్సి ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు.
అంతా తెలిసి…
కాని ఇప్పుడు కలిసిందెవరిని? సోనియా, రాహుల్ ని. జగన్ కు వారు రాజకీయంగా బద్ధశత్రువులు. తన అన్నపై తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టించారని ఇదే షర్మిల నాడు వాడవాడలా చాటి చెప్పారు. కనీసం తన తండ్రి చనిపోతే గుండె ఆగిన, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్ర చేపడితే కాంగ్రెస్ అధినాయకత్వం నో చెప్పింది. దీంతోనే జగన్ సొంత పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయాలన్నీ షర్మిలకు తెలియనవి కావు.
తన తండ్రికి సోనియా సీఎం పదవి ఇచ్చి గౌరవించి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత తన అన్న కు జరిగిన …చేసిన అన్యాయం గురించి ఆమెకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పరిస్థితుల్లో షర్మిల సోనియా, రాహుల్ ను కలవడమంటే తన కుటుంబానికే కాదు.. వైఎస్ ను అభిమానించే లక్షలాది గుండెల్లోనూ నిప్పులు చల్లినట్లే. AP