INDIA
లెక్కల్లో 1+1 రెండు. కానీ రాజకీయాల్లో ఆ లెక్క మారుతుంది. తప్పుతుంది. 1+1 రెండు కాకుండా మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అలయన్స్ పెట్టుకుంటే అదే జరుగుతుంది. కొన్నిసార్లు బలం పెరుగుతుంది. అదే బలహీనతగా మారుతుంది. ఇప్పుడు “ఇండియా” కూటమి పరిస్థితి కూడా అదేనని చెప్పాలి. కిచిడీ తరహాలో అనేక పార్టీల కలయిక. వాటి సిద్ధాంతాలు వేరు. అభిప్రాయాలు భిన్నం. కానీ కేంద్రంలో పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న మోదీని గద్దె దించకపోతే ఇక తమకు పుట్టగతులుండవన్న భయం. అదే వారిని కలిపింది. కానీ ఎన్నికల సమయానికి ఈ కూటమి ఐక్యత కొనసాగుతుందా? లేదా ఎవరి లెక్క వారు తేల్చుకోవడానికి సిద్ధమవుతారా? అన్నది చూడాల్సి ఉంది.
రెండు రోజుల పాటు…
“ఇండియా” కూటమి సమావేశాలు ముంబయిలో రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈరోజు నుంచి రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ముంబయిలో “ఇండియా” కూటమి మూడోసారి సమావేశం కానుంది. తొలిసారి పాట్నాలోనూ, రెండోసారి బెంగళూరులోనూ, మూడోసారి ముంబయిలోనూ మీట్ అవుతున్నారు. ఈ సమావేశానికి దాదాపు 27 పార్టీలు హాజరవుతున్నాయని చెబుతున్నారు. ఒక్క మాయావతి తప్ప బీజేపీని వ్యతిరేకించే శక్తులన్నీ ఏకమయ్యాయి. చివరకు పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ సయితం “ఇండియా” కూటమి వైపు వచ్చారంటే మోదీ భయం వారిని ఎలా వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో ఈ కూటమి సమావేశం జరుగుతుంది.
కన్వీనర్ ఎన్నిక… INDIA
రెండు రోజుల పాటు జరిగే సమావేశంలో “ఇండియా” కూటమి కన్వీనర్ ను ఎన్నుకుంటారని తెలిసింది. కూటమి లోగోను కూడా ఆవిష్కరించనున్నారు. దీంతో పాటు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులతో కలసి పోటీ చేయడంపైన కూడా నేతలు రాష్ట్రాల వారీగా చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోనే “ఇండియా” కూటమి వెళ్లాలన్నది అందరి అభిప్రాయం అయినప్పటికీ ప్రధాని అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తే కొంత సానుకూల వాతావరణం కనిపిస్తుందని కొన్ని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉండాలని కొందరు అంటుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అరవింద్ కేజ్రీవాల్ పేరును తెరపైకి తెచ్చింది.
పొత్తులపైన…
మోదీని ధీటుగా ఎదుర్కొనాలంటే కలసి పోటీ చేస్తేనే ఫలితం ఉంటుందన్నది కొందరి వాదన. అయితే అందుకు కొన్ని పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు లేకపోలేదు. తమకు బలం ఉన్న చోట సీట్లను ఎలా మిత్రపక్షాలకు ఇస్తామన్న ప్రశ్న సహజనంగానే తలెత్తుతోంది. గొంతెమ్మ కోరికలు కోరకుండా తమ బలాన్ని గుర్తించి సీట్లతో పాటు వాటి సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. మొత్తం మీద 27 పార్టీలను ఒకతాటిపైన నడిపించడం సామాన్యమైన విషయం కాదు. అంత సులువు కాదు. “ఇండియా” కూటమి బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే అందులోని పార్టీలు కొన్ని స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుందన్నది కూడా గుర్తుంచుకోవాలి. మరి అందుకు ఎవరు సిద్ధపడతారు? ఎవరు వేరు పడతారన్నది భవిష్యత్ లో తేలనుంది. INDIA