చందమామ ఉపరితలంపై బుడి బుడి అడుగులతో కలియ తిరుగుతున్న ప్రగ్యాన్ రోవర్ చకచకా చంద్రుని అధ్యయనం కొనసాగిస్తోంది. 14 రోజుల కాలవ్యవధిలో అప్పుడే వారం రోజులు పూర్తి కావస్తున్నాయి. ఇప్పటి వరకూ చంద్రుని (moon) ఉపరితలం అంతా కొండలు, గుట్టలుగా ఉన్నట్లు, అనేక విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధన ల్లో బయటపడ్డాయి.
అయితే చంద్రునిపై ఆవాసాలకు సాధ్యమేనా అన్న దిశగా భారత్ చేస్తున్న ఈ కీలకమైన పరిశోధనలకు రోవర్ ఇచ్చే సమాచారం బాగా ఉపయోగపడుతోంది.రోవర్ బుజ్జి బుజ్జి అడుగుల వీడియోను ఇస్రో తాజాగా ట్విట్వర్ లో షేర్ చేసింది. రోవర్ చాలా సేఫ్ గా అడుగులు వేస్తోంది.
తల్లి లాంటి ల్యాండర్ ముందు పిల్లలాంటి రోవర్ చందమామ పెరట్లో అటూ ఇటూ పరుగులు తీస్తోంది అనే అర్ధం వచ్చేలా ఇస్రో సరదాగా కామెంట్ చేసింది.
చంద్రునిపై అగ్నిపర్వతాలున్నాయా?
జాబిల్లి ఆవాసయోగ్యం కాదా? మామ గుండెల్లో అగ్ని పర్వతాలు ఉన్నాయా? అంటే అవుననే అనుమానాలే కలుగుతున్నాయి. చంద్రుని (moon) దక్షిణ ధ్రువంపై సల్ఫర్ ఉనికిని రోవర్ ఇప్పటికే కనుగొంది. పైగా మిగతా ఖనిజాలన్నింటికన్నా చాలా పెద్ద సంఖ్యలో సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది.
తాజాగా లేజర్ ఆధారిత స్పెక్ట్రోస్కోప్ లిబ్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. సల్ఫర్ చందమామ ఉపరితలంపైకి అంత ఎక్కువ మొత్తంలో ఎలా చేరింది? చంద్రునిపై సల్ఫర్ మొదట్నుంచి ఉందా లేక నక్షత్రాలు ఉల్కా పాతం వల్ల జరిగిన పేలుళ్ల వల్ల సల్ఫర్ గుట్టలు ఏర్పడ్డాయా? ఈ అంశాలను ఇంకా నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఈసారి ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రో స్కోప్ ద్వారా సల్పర్ నిల్వలు ఉన్నాయని ధ్రువీకరించింది.
మిగిలిన మూలకాలతో పోల్చుకుంటే సల్ఫర్ నిల్వలు అపారంగా ఉండటానికి కారణం ఏంటన్న దానిపై ఇస్రో ఆరాతీస్తోంది. భారీ ఉల్కాపాతం సంభవిస్తే సల్ఫర్ నిక్షేపాలు ఏర్పడే అవకాశం ఉంది. తోక చుక్కలు చంద్రుని ఢీకొంటే కూడా సల్పర్ ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చందమామ అందరూ అనుకున్నంత చల్లని వాడు కాదని, జాబిల్లి ఉపరితలంపై 50 నుంచి70 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని మిషన్ చంద్రయాన్ తేల్చింది.
రోవర్ లోని 18 సెంటీ మీటర్ల ఎత్తు ఉండే ఈ ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోస్కోప్ పేలోడ్ ను అహ్మదాబాద్ లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ, స్పేస్ అప్లికేషన్ సెంటర్, బెంగళూరులోని యూ ఆర్ రావు శాటిలైట్ సెంటర్ కలసి రూపొందించాయి.చంద్రుడి దక్షిణ ధ్రువంపై తిరంగా జెండా రెపరెపలతో అంతరిక్ష రంగంలో భారత్ ఒక కొత్త విజయాన్ని నమోదు చేసింది.
భవిష్యత్తులో మానవ సహిత ఉపగ్రహ ప్రయోగాలే తమ లక్ష్యమని ఇస్రో ప్రకటించింది. ఇకపై సూర్యునిపైనా, శుక్రుడు, అంగారకుడిపైనా తమ ప్రయోగాలు జరుపుతామని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఈ శనివారం ఆదిత్య L1 మిషన్ ప్రయోగం :
చంద్రయాన్-3 సక్సెస కావడంతో ఇస్రో ఈసారి సూర్యుని అంతు చూడాలని నిర్నయించింది. ఆదిత్య ఎల్ -1 పేరుతో ఓ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.సూర్యుని బాహ్యవలయం తీరు తెన్నులను, దుమ్ము, ధూళి కణాలను, అతి నీలలోహిత కిరణాలను పరీక్షించేందుకు , సూర్యునిపై ఎగసి పడే అగ్ని జ్వాలలను పరిశీలించేందుకు ఈప్రాజెక్ట్ ప్రయత్నిస్తుంది. బెంగళూరు యూఆర్ రావు అంతరిక్ష కేంద్రంలో దీనిని రూపొందించారు.
ఈ శనివారం అంటే సెప్టెంబర్ 2న ఉదయం ఈ వ్యోమనౌకఉదయం 11.50 నిమిషాలకు పరిశోధనలకు బయల్దేరుతుంది.
ఉపగ్రహం (satellite) ద్వారా అతి దగ్గరి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణాన్ని పరిశీలిస్తుంది. దీనికోసం ఈ మిషన్ ఏడు పేలోడ్స్ ను తీసుకెళుతోంది.ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొరపై అధ్యయనం చేయడంలో ఈ పేలోడ్స్ ఉపయోగపడతాయి.