చంద్రయాన్ -3 మిషన్ సక్సెస్ ఇచ్చిన స్ఫూర్తితో సూర్యుని రహస్యాలను ఛేదించే పనిలో ఇస్రో
నిమగ్నమయ్యింది. శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రంనుంచి రేపు సూర్యుని పై అస్వేషణలకు ఆదిత్య L1 సోలార్ మిషన్ బయల్దేరుతోంది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ఈ మధ్యాహ్నం 12.10 నుంచే మొదలైంది.
దాదాపు 23 గంటల పాటు ఇది కొనసాగుతుంది.ఈ సమయంలో ఈ మిషన్ లో ప్రతీ విభాగాన్ని నిపుణులైన ఇంజనీర్ల పర్యవేక్షణలో నిరంతరం గమనిస్తుంటారు.
నిర్ణయించిన ముహూర్తానికే నింగిలోకి… L1
ఇస్రో అధికారులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ శనివారం ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహాన్ని మోసుకుంటూ పీఎస్ ఎల్వీ సి-57 రాకెట్ బయల్దేరుతుంది.
ఇప్పటికే దీని ట్రయల్ రన్ పూర్తయ్యిందని రాకెట్ లోని అంతర్గత చెకింగ్ కూడా పూర్తయిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ ఉపగ్రహం బరువు1500కిలోలు.
భూమినుంచి బయల్దేరే ఈ రాకెట్ సూర్యునిదిశగా పయనింపచేసి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ వన్ (L1)చుట్టూ ఉండే కక్ష్యలో ప్రవేశ పెడతారు.
ఆదిత్య L1 మిషన్ తన బాహ్య వలయ కక్ష్యనుంచి సూర్యుని చుట్టూ ఉండే కొరోనా వలయం, దాని చుట్టు పక్కల వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది.
ఆదిత్య L1 పూర్తిగా దేశీయ పరిజ్నానంతో రూపొందినది.మనదేశంలోనే వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంస్థలు దీనిలోని యంత్ర పరికరాలను రూపొందించాయి.
దీనిలో మొత్తం 7 పేలోడ్స్ ఉంటాయి.యూవీ పేలోడ్ ను వినియోగించి కొరొనా, సోలార్ క్రోమోస్ఫియర్ లను, ఎక్స్ రే పేలోడ్స్ ను ఉపయోగించి సూర్యుని పై నున్న జ్వాలలను పరిశీలిస్తుంది.
మేగ్నటోమీటర్ పేలోడ్ సూర్యుని చుట్టు ఉన్న ధూళికణాలను స్టడీ చేయడమే కాక వాటిలో మార్పులను, L1 చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాన్ని అబ్జర్వ్ చేస్తుంది.
అంటే.. ఎల్ వన్ కక్ష్యలో నుంచి నాలుగు పేలోడ్లు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తే మిగిలిన మూడు పేలోడ్స్ సమీపంలోని సూర్యరశ్మి రేణువులు, అయస్కాంత క్షేత్రాలను పరిశీలిస్తాయన్నమాట.
భానుని భగభగలకు కారణం తెలుస్తుందా?
ఈ ఉపగ్రహం నుంచి రోజుకు 1,440 చిత్రాలు గ్రౌండ్ స్టేషన్ కు వస్తాయి. సూర్యునిలో అగ్నిజ్వాలల విస్ఫోటనం ఎలా జరుగుతోంది, ఏ టైమ్ లో జరుగుతోంది ఎందుకు జరుగుతోంది లాంటి అంశాలను ఈమిషన్ అధ్యయనం చేస్తుంది.
అగ్ని గోళం మీద రేగే జ్వాలలు,సౌర తుఫాన్ల వల్ల రేగే ధూళి కణాలు భూమిని తాకే ఆస్కారముందా? అన్నది కూడా ఈ ప్రాజెక్ట్ అధ్యయనం చేస్తుంది.
ఈ ఉపగ్రహ కాలపరిమితి అయిదేళ్లని అయితే అయిదేళ్లు దాటినా దానిలోని ఇంధన వినియోగం ఆధారంగా ఇంకా పనిచేసే అవకాశం ఉంటుందని ఈ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ తెలిపారు.అన్నీ కుదిరితే ఈ ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల చివరి నాటికి సౌరకక్ష్యలోకి ప్రవేశపెడతారు.
అంతా సవ్యంగా జరిగి, సాంకేతిక ఇబ్బందులేవీ తలెత్తకపోతే గ్రహణాలతో సంబంధం లేకుండా ఈ మిషన్ పనిచేసే ఆస్కారముంది.
అన్ని పూజలు చేశాకే..
ఏ కొత్త ప్రాజెక్ట్ చేపట్టినా , ప్రయోగం తలపెట్టినా ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి ఆనవాయితీ..
సౌర మండలం అధిపతి పురాణాల పరంగా అందరికీ ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్యునిపై అధ్యయనాలు కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఆదిత్య ఎల్-1 నమూనాను తీసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
మరోవైపు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఎప్పటిలాగే సూళ్లూరు పేటలోని చెంగాళమ్మ పరమేశ్వరీ ఆలయాన్ని సందర్శించి ప్రార్ధనలు జరిపారు.
దీని ఉపగ్రహాన్ని పూర్తిగా మన శాస్త్రవేత్తలే దేశీయ పరిజ్నానంతో రూపొందించినా,సూర్యునిపై అధ్యయనాలకు మాత్రం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సహకారం తీసుకుంటున్నారు.
ఈరోజు ఈప్రయోగాన్ని శ్రీ హరికోట అంతరిక్ష కేంద్రం చుట్టుపక్కలనుంచి సాధారణ ప్రజలు కూడా గమనించవచ్చు.
అయితే రాకెట్ ప్రయోగించే ప్రాంతంనుంచి చూడాలంటే మాత్రం ముందుగా ఇస్రో వర్గాల దగ్గర సందర్శకుల కోటా లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.ఆదిత్య ఎల్ వన్ ఎన్ని సంచలనాలను అందిస్తుందో చూడాలి..