భారత అంతరిక్ష రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ సందర్భమిది.. చంద్రయాన్ 3 ప్రాజెక్టే కాదు.. ఆదిత్య L1 ప్రాజెక్ట్ కూడా సఫలమైంది. అశేష భారతావని ఆశలను నిజం చేస్తూ ఆదిత్య -ఎల్ 1 మిషన్ సక్సెస్ ఫుల్ గా నింగిలోకి దూసుకుపోయింది. యావద్భారతావని ప్రార్ధనలు ఫలించి భానునిపై అన్వేషణకు ఆదిత్య ఎల్-1 మిషన్ నింగికేగింది.
పీఎస్ఎల్ వీ సి-57 వాహక నౌక ఆదిత్య ఎల్-1 శాటిలైట్ ను దిగ్విజయంగా నింగిలోకి తీసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ తాజా ప్రయోగం నిర్వహించారు. దాదాపు నాలుగు నెలల పాటు ప్రయాణించిన తర్వాత భూమినుంచి సూర్యుని దిశగా ఉన్న ఎల్ 1 (లాంగ్రాజ్) పాయింట్ ను ఈ శాటిలైట్ చేరుకుంటుంది.దాదాపు15 లక్షల కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. లాంగ్రాజ్ కక్ష్యలోనుంచి అయితే సూర్యుని పై అధ్యయనాలకు ఏలాంటి అడ్డంకులు లేకుండా ఉంటుంది.
నిర్దేశించిన సమయానికే… ఆదిత్య L1
అంతకు ముందు నిర్దేశించిన సమయానికే అంటే11.50 నిమిషాలకే రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికి దూసుకుపోయింది. ప్రతీ దశలోనూ రాకెట్ గమనాన్ని, వేగాన్ని షార్ సైంటిస్టులు నిశితంగా గమనిస్తూ వచ్చారు. మూడు దశల్లో రాకెట్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోయింది. నాల్గవ దశ వచ్చేసరికి శాస్త్రవేత్తలు ఉత్కంఠ ఆపుకోలేకపోయారు. నాల్గవ దశలోనే ఉపగ్రహం రాకెట్ నుంచి విడివడుతుంది. ఆ ఉద్విగ్న క్షణం కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. చివరకు 12.53నిమిషాలకు రాకెట్ నుంచి ఉపగ్రహం విడివడి భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశించింది. . దీనికి దాదాపు 63 నిమిషాల సమయం పట్టింది . దాంతో శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి..
పట్ట పగ్గాల్లేవ్…
ప్రతీ దశలోనూ నిర్దేశించిన గమనంవైపే రాకెట్ దూసుకు వెళ్లడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. నాల్గవ దశ దాటిన తర్వాత ఇస్రో ఛైర్మన్ సోమనాథన్ ఒక్కసారిగా బల్లలు చరుస్తూ లేచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సహచర సిబ్బందితో కరచాలనం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆపై మీడియానుద్దేశించి అధికారిక ప్రకటన చేశారు. ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతమైందనీ ధృవీకరించారు. సైన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ ప్రయోగం సఫలం అవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందానికి ధన్యవాదాలు, అభినందనలు తెలియ చేశారు. ఇక భారత అంతరిక్షరంగంలో సూర్యునిపై పరిశోధనలతో ప్రపంచ అంతరిక్ష రంగంలోనే మనదేశం తన ఆధిక్యతను ప్రదర్శించనుంది.
పరిశోధనలకు అదే అనువైన ప్రదేశం… ఆదిత్య L1
ఆదిత్య ఎల్ -1 ని భూమికి, సూర్యునికి మధ్య సూర్యుని లాంగ్రాజ్ పాయింట్ (L1) లోని దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టాలంటే దాదాపు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాలి.
దీనికి 125రోజుల సమయం అంటే దాదాపు నాలుగు నెలల సమయం పట్టొచ్చు. సోలార్ అన్వేషణలకు లాంగ్రాజ్ పాయింట్ లో ఉపగ్రహాన్ని నిలపడమే అతిపెద్ద సవాల్.
ఇది సక్సెస్ అయితే సూర్యునికి సంబంధించిన అనేక కొత్త అంశాలను మనం కనుగొనే వీలుంది.
ఆ తర్వాత దాన్ని మరింత దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి పంపుతారు. దీనికోసం ఆదిత్య ఎల్-1 లోని రాకెట్లను వినియోగిస్తారు.
ఆతర్వాత ఉపగ్రహం నెమ్మదిగా ఎల్ -1 పాయింట్ వైపు చేరుకుంటుంది.అంటే భూగురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతాన్ని దాటి ముందుకెళుతుంది.
అక్కడనుంచి సూర్యుని అధ్యయనం చేస్తుంది. దాదాపు ఏడు పేలోడ్స్ ను తీసుకెళ్లుతున్న
ఆదిత్య ఎల్-1 రోజుకు 1440 ఫోటోలను పంపుతుంది.
అంటే నిమిషానికొక ఇమేజ్ అన్నమాట. ఈఉపగ్రహ కాలపరిమితి ఐదేళ్లు.అప్పటి వరకూ ఇందులో సాంకేతిక పరికరాలేవీ పాడైపోకుండా ఉంటే మరింతకాలం పనిచేసే అవకాశం ఉంది.