వరుస విజయాలతో ఇస్రో ఖ్యాతి దిగంతాలకు వ్యాపిస్తున్న ఈతరుణంలో దీనికి పునాది తుంబా (Thumba) అనే ప్రాంతంలో పడిందని ఎంతమందికి తెలుసు?
ప్రతిష్టాత్మక సంస్థ ఇస్రో సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.ప్రస్తుతం మనం చూస్తున్న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం రూపుదిద్దుకోడానికి వెనుక చాలా మంది ఇంజనీర్లు, పెద్దల ప్రయత్నాలు ఉన్నాయి. అసలు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంకన్నా ముందు ఇస్రో ఎక్కడ ఉండేది? ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన నిజం.తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాలన్న అంశంపై సైంటిస్టులు మల్లగుల్లాలు పడ్డారు.
ఆముగ్గురే కీలకం…
1962లో అప్పటి ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ హోమీబాబా, అప్పుడే సైంటిస్ట్ గా అడుగులు వేస్తున్న డాక్టర్ అబ్దుల్ కలాం వీరంతా స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశంకోసం వెతుకుతున్నారు. కేరళలోని తుంబా (Thumba) ప్రాంతంలో సముద్ర తీరానికి, రైల్వే లైన్ కు మధ్యలో ఉన్న విస్తారమైన ప్రాంతంలో ఒక ఎర్ర రాతి చర్చి ఉండేది. ఈచర్చిని మేరీ మగ్దాలెనె అనే మహిళ పేరు మీద ఏర్పాటు చేశారు.. జీసస్ శిలువ వేయబడిన తర్వాత మూడో రోజున తిరిగి లేచినప్పుడు మొదటగా ఆమెకే కనిపించాడని చెబుతారు. ఆమె స్మారకార్ధం కట్టిన ఆ చర్చి అంటే స్థానిక క్రైస్తవులకు ఎంతో గురి.
అనుకూలమైన ప్రాంతం (Thumba)
అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు స్థలం కోసం అన్వేషిస్తున్న విక్రమ్ సారాభాయ్ బృందానికి ఈ చర్చి , పరిసరాలు అనువుగా కనిపించాయి.
భూ అయస్కాంత క్షేత్రానికి దూరంగా ఉన్న ఆ ప్రాంతంలో భూమ్యాకర్షణ శక్తి, అయస్కాంత ప్రభావం కాస్త తక్కువ కాబట్టి అంతరిక్ష ప్రయోగాలకు అనువుగా ఉంటుంది.
పరిస్థితిని గమనించిన శాస్త్రవేత్తల బృందం త్రివేండ్రం స్థానిక చర్చి బిషప్ రివరెండ్ పీటర్ బెర్నార్డ్ పెరీరియాను కలిసి విషయం వివరించారు.
మత్య్సకారుల పెద్దమనసు
అయితే ఈ చర్చి పరిసర ప్రాంతాలన్నీ మత్య్సకారుల అధీనంలో ఉన్నవి కావడంతో ఓ ఆదివారం చర్చికి వస్తే వారిని కలసి పరిస్థితి వివరించవచ్చనీ వారిని ఒప్పించేందుకు ప్రయత్నించవచ్చనీ బిషప్ వారికి చెప్పారు. బిషప్ సూచన మేరకు ముగ్గురు శాస్త్రవేత్తలు ఆదివారం ఆచర్చికి వెళ్లారు. అంతరిక్ష కేంద్రం ఏర్పాటు అవసరం, అందులో జరిపే ప్రయోగాల గురించి వారికి పూర్తిగా వివరించడంతో ఆ మత్య్సకారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసేందుకు అంగీకరించారు. చర్చి, దానిపరిసరాల్లో ఉన్న90ఎకరాలను శాస్త్రవేత్తలకు స్థానికులు అప్పగించారు. అందులో ఉంటున్న 183 మంది మత్య్సకార కుటుంబాలను మరో చోటకి తరలించారు. అతి తక్కువ సమయంలోనే వీరందరికీ మరో ప్రాంతంలో ఆవాసాలు కల్పించి అందుకు దగ్గరలోనే చర్చిని కూడా నిర్మించారు. బిషప్ లు ఉండే క్వార్టర్లను తుంబా స్పేస్ స్టేషన్ ఆఫీస్ గా మార్చేశారు. చర్చిని వర్క్ షాప్ గా మార్చేశారు.మేరీ మెగ్దాలెనె గంధపు చెక్క విగ్రహాన్ని మాత్రం అక్కడే యధాతధంగా ఉంచేశారు. ఆశిలువ గుర్తు కిందే భారత తొలి అంతరిక్ష ప్రయోగ కేంద్రం బోర్డు వెలిసింది.
మ్యూజియంగా మారిన తుంబా (Thumba)
తుంబా (Thumba) చర్చి ఈ రోజుకి కూడా మనకు కనిపిస్తుంది.
అయితే దానిని స్సేస్ మ్యూజియంగా మార్చేశారు.రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచే సున్నిత మనస్కుడు,ఉన్నత విద్యాధికుడు అయిన డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఈ కథని తన పుస్తకం ఇగ్నైటెడ్ మైండ్స్ లో ప్రస్తావించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే అన్ని మతాల సారాంశమే మన ఇవాల్టి అంతరిక్ష రంగం. హిందువు అయిన సారాభాయ్,పార్సీ అయిన హోమీ బాబా, మస్లిం అయిన అబ్దుల్ కలాం ఈముగ్గురూ కలసి క్రైస్తవులకు ఉమ్మడిగా చేసిన విన్నపం ఫలించే తుంబా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు సాధ్యమైంది.
స్థానిక క్రైస్తవులుకూడా ఓ జాతీయ ప్రయోజనాల కోసం పెద్ద మనసు చేసుకుని చర్చిని , ఆప్రాంతాన్ని సైంటిస్టులకు ఇచ్చేశారు.
చంద్రయాన్-3 మిషన్, ఆదిత్య ఎల్-1 మిషన్ రెండూ సక్సెస్ అయిన ఈ శుభతరుణంలో అంతరిక్ష రంగ బృందం విజయాలని ప్రశంసిచేం వారంతా కేరళలోని తుంబా ప్రాంత ప్రజల దాతృత్వాన్ని, పెద్దమనసును కూడా ప్రశంసించి తీరాలి.
వారి విశాల ధృక్పథం వల్లనే ఈరోజు మన అంతరిక్ష రంగం దినదినాభివృద్ధి చెందడానికి ప్రపంచం అసూయ పడేంతలా విజయాలు సాధించడానికి కారణమైంది.