నిన్నమొన్నటి వరకూ ఆమెది కంచు కంఠం.. ఇస్రో (ISRO) ప్రయోగాలకు కామెంట్రీ చెప్పే అత్యంత మధురమైన కంఠస్వరం.. ఇప్పుడా కంఠం మూగబోయింది. ఇస్రో సైంటిస్ట్ ఎన్. వలర్మతి కన్నుమూశారు. రాకెట్ ప్రయోగాలప్పుడు రాకెట్ లాంచింగ్ కౌంట్ డౌన్ ఆమె చేసేవారు. ఈమధ్య చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన చంద్రయాన్-3ప్రాజెక్ట్ కు ఆమె చివరి సారిగా తన కంఠస్వరాన్నివినిపించారు.
ఇస్రో మాజీడైరక్టర్ డాక్టర్. పి.వి. వెంకట క్రిష్ణన్ ఆమె మరణానికి విచారం వ్యక్తం చేస్తూ ట్విటర్ లో సంతాపాన్ని ప్రకటించారు.
శ్రీహరికోటనుంచి ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు ఆ మధురమైన కంఠస్వరం కౌంట్ డౌన్ ఇక వినపడదు అంటూ ఆయన తన విచారాన్నివ్యక్తం చేశారు. వాలర్మతి మరణం ఊహించనిదని, చంద్రయాన్ కు ఆమె చెప్పిన కౌంట్ డౌన్ ఆమె కెరీర్ లో చివరిదని వెల్లడించారు.
గుండెపోటుతో మృతి
శనివారం సాయంత్రం చెన్నై లో ఆమె గుండెపోటుకు గురై చనిపోయినట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన అరియాలూర్ లో 1959 జులై 31న వలర్మతి జన్మించారు.
నిర్మలా బాలికల హయ్యర్ సెకండరీ స్కూలులో చదువు తర్వాత కోయంబత్తూరు ప్రభుత్వ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీనుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.
1984 నుంచి ఇస్రోలో (ISRO)
1984లో ఇస్రోలో (ISRO) శాస్త్రవేత్తగా చేరారు. అనేక మిషన్స్ లో ఆమె కీలక పాత్ర పోషించారు. రిశాట్-1 కి ఆమె ప్రాజెక్ట్ డైరక్టర్ గా వ్యవహరించారు.
రిశాట్అనేది మన దేశంలో దేశీయ పరిజ్నానంతో రూపొందించిన రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.
2015లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు మీద ఏర్పాటు చేసిన స్మారక అవార్డును పొందిన తొలి మహిళ కూడా వాలర్మతియే.
ఇస్రో వరుస విజయాలు సాధిస్తున్న ఈ తరుణంలో ఇంత పేరొందిన శాస్త్రవేత్త లేకపోవడం విచారకరమంటూ సోషల్ మీడియాలో సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.
వాల్మరతి కంఠం ప్రతీ రాకెట్ లాంచింగ్ సమయంలోనూ అందరికీ పరిచితమేనని, ఇకపై ఆమె స్వరం వినపడదు అంటే బాధగా ఉందని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
సంతాపాల వెల్లువ
ఆదిత్య ఎల్ 1 మిషన్ లాంచింగ్ సమయంలో ఆమె స్వరం వినపడలేదని ఆమెలీవ్ లో ఉన్నారని భావించామని కానీ ఇలా స్వర్గస్తులయ్యారని తెలియలేదని మరో నెటిజన్ సంతాపం ప్రకటించారు.
విక్రమ్-ఎస్ శాటిలైట్ లాంచింగ్ టైమ్ లో ఆమెతో సన్నిహితంగా కలసి పనిచేశామని ఇప్పుడామె లేని లోటు స్పష్టంగా తెలుస్తోందనీ మరో సైంటిస్ట్ విచారం వ్యక్తం చేశారు.
అసలు వాల్మరతి స్వరంతోనే మన దేశం ఉపగ్రహాల ప్రయోగంలో ఒక హిస్టరీని నమోదు చేసింది. భారత అంతరిక్ష ప్రయోగాలన్నింటిలోనూ ఆమె స్వరం సమ్మిళితమైఉంది.
ఆమె లేని లోటు ఇక పైస్పష్టంగా తెలుస్తుంది అని మరో ఉద్యోగి ఆమె అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
దేశంలో ఎంతో మంది చక్కని కంఠ స్వరం కలిగి ఉంటారు. కానీ అందరూ అన్ని పనులకూ నప్పరు.అలా వాలర్మతి మేడం ఒక అద్భుతం..
ఆమె వాయిస్ లేకుండా ఇప్పటి వరకూ ఒక్క ప్రయోగం కూడా జరపలేదు.. ఇప్పుడామె లేకపోవడంతో పూడ్చలేనంత లోటు కలిగినట్లు అనిపిస్తోంది అంటూ మరో సహోద్యోగి విచారాన్ని వ్యక్తం చేశారు.
వరుస విజయాలతో సంతోషంలో ఉన్న ఇస్రో ఉద్యోగులను మహిళా సైంటిస్ట్ వాలర్మతి ఇక లేరన్న వార్త కలచి వేస్తోంది.