తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ లో తెల్లవారు జామున నాలుగున్నర నుంచి ఏకధాటిగా వర్షం (Rains) కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నడుంలోతు నీళ్లు రావడంతో లోతట్టు కాలనీల్లో జనావాసాలన్నీ నీట మునిగాయి. భారీ వర్షాల నేపధ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ , ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని ప్రజలందరూ అవసరమైతే తప్ప ఇళ్లనుంచి కదలొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్, మరో 17 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది.
హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలు రెడ్ అలెర్ట్ జోన్ లో ఉన్నాయి.
ఇక భారీ వర్షాలు కురిసే ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. జగిత్యాల, జయశంకర్ భూపాల్ పల్లి, జనగామ, కామారెడ్డి, కరీం నగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నారాయణ పేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి.
హైదరాబాద్ లో నరకం.. అడుగడుగునా ట్రాఫిక్ జామ్ … (Rains)
వర్షాల నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు శెలవులు ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం కల్పించారు. మామూలుగానే హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ.. ఇక భారీ వర్షమే పడితే ఎక్కడి కక్కడ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ తప్పదు. దాంతో క్యాబ్ సర్వీసులు దాదాపు గా స్తంభించాయి. దూరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలైనా, దగ్గర ప్రాంతాలైనా అసలు క్యాబ్ బుక్ కావడం లేదు.. భారీగా చెల్లించినా క్యాబ్ డ్రైవర్లు రైడ్ తీసేందుకు ఇష్టపడటం లేదు. ఒక వైపు భారీ వర్షం.. మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనాలు అసలు కదలడం లేదు. దాంతో హైదరాబాద్ నగర ప్రజలు నరకం చూస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలో ఎటు చూసినా భారీ ట్రాఫిక్ జామ్ లే కనిపిస్తున్నాయి.
బేగంపేట ప్రకాశ్ నగర్, జుబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ట్రాపిక్ క్లియర్ అవడానికి గంటల టైమ్ పట్టేస్తోంది. మాదాపూర్ హై టెక్ సిటీ ప్రాంతంలోనూ భారీ వర్షానికి మోకాల్లోతు నీళ్లు వచ్చేశాయి. దాంతో వాహనాలన్నీ ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి.
మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద కూడా భారీగా వరద ప్రవాహం కనిపిస్తోంది. దీంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
లోతట్టు ప్రాంతాల ప్రజల్లో భయం (Rains)
- జీడిమెట్ల, కూకట్ పల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది.
- కూకట్ పల్లి దీన్ దయాల్ నగర్, ఫతేనగర్ పూర్తిగా నీట మునిగాయి.
- కాలనీల్లోకి, ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు.
- వర్షం ఆగి, ఆగి కురుస్తున్నా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు నీట మునిగి పోయి అష్టకష్టాలు పడుతున్నారు..
- అదే ఏక ధాటిగా గంటల పాటూ కురిస్తే పరిస్థితి ఏంటా అని ఆందోళనలో ఉన్నారు.
మూసీ నదికి వరద పోటు
కుండపోత వర్షంతో నగరంలో దిగువ ప్రాంతమైన మూసీ నదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది.
రాజేంద్ర నగర్ జంట జలాశయలకు వాన నీరు పెరగడంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తేశారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద ప్రవాహం పెరిగితే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మూసీ నది ఉథ్రుత ప్రవాహంతో పరిసర కాలనీల ప్రజల్లో ఆందోళన పెరిగింది.