(G-20)
మనదేశం పేరు మారబోతోందా? ఇప్పటి వరకూ ఇండియా అన్న పేరు ను ఇకపై భారత్ గా మార్చబోతున్నారా? అందుకే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారా? ఈమధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రహస్య నిర్ణయాలు, అధికారిక సమాచారంలో చేర్చుతున్న మార్పులు చూస్తే అది నిజమేననే అనుమానాలు కలుగుతున్నాయి.
భారత ఖ్యాతిని సమున్నతంగా నిలబెట్టే జీ-20 (G-20) సదస్సును అందుకు వేదికగా చేసుకుంటున్నట్లుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి.
జీ-20 (G-20) సదస్సు సందర్భంగా భారత్ ఇచ్చే విందుకోసం పంపిన ఆహ్వానాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాష్ట్రపతి పేరుమీద పంపిన ఈ ఆహ్వానాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ఒక అధికారిక ఆహ్వానంపై అందునా విదేశీ అధిపతులకు పంపే ఆహ్వానంపై ఇలా ముద్రించడం అంటే ఖచ్చితంగా కేంద్రం దేశం పేరును మార్చాలనే ఉద్దేశంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. భారత్ అన్న పదం కూడా మన రాజ్యాంగంలో ఉంది. అయితే ఇండియా దటీజ్ భారత్ .. రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగం ఆర్టికల్ వన్ లో ఉంది.
మరిప్పుడు పేరు మారిస్తే భారత్ దటీజ్ ఇండియా అని మార్చాల్సి ఉంటుంది. అతిధులకు పంపిన జీ-20 (G-20) బుక్ లెట్ లో భారత్- మదర్ ఆఫ్ డెమోక్రసీ అని ముద్రించారు. జీ-20 (G-20) లాంటి సదస్సు వేదికగా ఈ మార్పు చేస్తే ప్రపంచానికి ఒకేసారి స్పష్టం చేసినట్లు ఉంటుందనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆరోపణలు.. ప్రత్యారోపణలు (G-20)
అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ రిపబ్లిక్ ఆఫ్ భారత్- ఇది అమృత కాల్.. మన నాగరికత దీనివైపుగా అడుగులు వేయడం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేయడం పేరు మార్పు అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బీజేపి నేతలు జీ -20 ఇన్విటేషన్లలో పేరు మార్పును స్వాగతించగా ప్రతిపక్షాలు మాత్రం యధాప్రకారం మండి పడ్డాయి. దేశం పేరు మార్పు అనేది ఒక రాజకీయ పార్టీ గుత్త సొత్తు కాదని 135 కోట్ల మంది భారతీయుల అభిమతానికి సంబంధించిన విషయమని ప్రతిపక్షాలు కామెంట్ చేశాయి. జాతి ఐడెంటిటి బీజేపి వ్యక్తిగత సంపద కాదు. దానిని ఎలా పడితే అలా మారుస్తామంటే కుదరదు అని ఆప్ పార్టీ నేత రాఘవ్ చద్దా కామెంట్ చేశారు.
పేరు మార్పు సూచన ఆరెస్సెస్ దే (G-20)
రెండు రోజుల క్రితం దేశం పేరు ఇండియా కాదు భారత్ అని మారిస్తే బాగుంటుందంటూ బీజేపి మాతృ సంస్థ ఆరెస్సెస్ సూచన చేసింది. ఇప్పటి వరకూ అంగ్రేజీ వాళ్లకు అర్ధమవ్వాలని ఇండియా అని మన దేశాన్ని పిలుచుకున్నాం. కానీ ఇప్పుడిక భారత్ అని మార్చేయాలి. మన దేశం ప్రస్తావన ఎక్కడ రాసినా, మాట్లాడిన భారత్ అనే పలకాలి అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.
భగ్గుమన్న కాంగ్రెస్
(G-20)
రెండురోజులుగా సోషల్ మీడియాలో హడావుడి, ఇప్పుడు జీ-20 సదస్సు ఆహ్వానాలపై పేరు మార్పు చూసిన తర్వాత కాంగ్రెస్ కేంద్రంపై మండిపడింది. విపక్షాలన్నీ ఏకమై ఇండియా కూటమిని పెట్టడం వల్ల మోడీ ఆత్మరక్షణలో ప డిపోయారని, ఇండియా కూటమి పేరు ప్రచారం బాగా కలిసొచ్చి గెలిస్తే తమ పుట్టి మునుగుతుందన్న అక్కసుతోనే దేశం పేరు మారుస్తున్నారని మండిపడింది.
అయితే విపక్షాలన్నీ కొత్త కూటమిగా ఏర్పడి పేరు మార్చుకుని తమ పాపాలు కడిగేసుకోవాలనుకుంటున్నారని మోడీ కూడా పార్లమెంటులో మండిపడ్డారు. దేశాన్ని దోచుకోడానికే ఇండియా అని విపక్ష కూటమి కొత్త పేరు పెట్టుకుందని మోడీ అన్నారు. రాజకీయ నిపుణుల ఊహాగానాలు గనక నిజమే అయితే ఈనెల 18నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దేశం పేరును భారత్ గా మారుస్తున్నట్లుగా రాజ్యాంగ సవరణ చేయచ్చు.