సామాన్యులకు తిరుమల (TTD) శ్రీవారిని దర్శనం ఎంతకష్టమో అందరికీ తెలిసిందే.. ఆ దేవ దేవుని దర్శించాలంటే చాంతాడంత పొడవైన క్యూ ఉంటుంది.. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాలి. సామాన్యులకు ఇది మరీ ఇబ్బంది. డబ్బున్న వారు స్పెషల్ దర్శనం, విఐపీ బ్రేక్ దర్శనం లాంటి వాటితో క్షణాల్లో స్వామిని దర్శించుకుని వెళుతుంటారు. కానీ సామాన్యులు కాలిమార్గంలో నడచి కొండెక్కి సర్వదర్శనం క్యూలో నిలబడి ఎప్పుడు స్వామి కరుణిస్తే అప్పుడే దర్శనం చేసుకుంటారు. కానీ ఇకపై ఈ కష్టాలు కొంత వరకూ గట్టెక్కేఅవకాశాలు కనిపిస్తున్నాయి. టీటీడీ పాలక మండలి ఇవాళ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
గోవింద కోటి రాస్తే స్వామి దర్శనం (TTD)
25 ఏళ్ల లోపు వయసున్న యువతీ యువకులు రామకోటి లాగ గోవింద కోటి రాస్తే వారి కుటుంబ సభ్యులకు విఐపీ బ్రేక్ దర్శనం భాగ్యం కల్పించాలన్నది ఇవాల్టి పాలక మండలి నిర్ణయాల్లో ప్రధానమైనది. పది లక్షల వెయ్యి 116 సార్లు గోవింద నామాలు రాసిన వారికి విఐపి దర్శన భాగ్యం లభిస్తుందని టీటీడీ ఛైర్మన్ భూమన తెలిపారు. ఇది యువతీ యువకుల్లో భక్తి భావాన్ని పెంచడమే కాక, హిందూ ధర్మ వ్యాప్తికి కూడా పనికొస్తుందని భూమన అన్నారు. సో ఇకపై విఐపీ బ్రేక్ దర్శనాలకు నోచుకోలేని వారు, అంత ఖర్చు పెట్టుకోలేని వారు ప్రశాంతంగా గోవింద కోటి నామాలు రాసుకోవడం ఉత్తమం. ఇవి రాస్తే పుణ్యం, పురుషార్ధం రెండూ దక్కినట్లే.. ఎలాగూ రామకోటి రాసేవారికి గోవింద కోటి రాయడం పెద్ద కష్టం ఏం కాదు.. పైగా స్వామి వారి దర్శన భాగ్యం కూడా దొరుకుతుంది. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. టీటీడీ దీనికోసం ప్రత్యేక పుస్తకాలు సప్లయ్ చేస్తుందా లేక మనమే పుస్తకాలు కొని రాయాలా అన్నది ఇంకా క్లారిటీ రావాలి.
భూమన మార్కు నిర్ణయాలు (TTD)
టీటీడీ (TTD) ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యాక చాలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.. నడక మార్గంలో పులి, చిరుతల దాడులు ఎక్కువగా ఉండటంతో భక్తులకు చేతికర్రలు ఇవ్వాలని నిర్ణయించారు. పైగా నడక దారి కి అటూ ఇటూ ఫెన్సింగ్ వేయాలనే ప్రతిపాదనలూ వచ్చాయి. మెట్ల దారిలో, నడక దారిలో ఫెన్సింగ్ వెయ్యాలంటే వ్యయం ఎక్కువ అవుతుంది. అందుకే ప్రస్తుతానికి ఆత్మరక్షణకు చేతికర్రలు ఇవ్వాలని నిర్ణయించారు.
ముంబై బాంద్రాలో శ్రీవారి ఆలయ నిర్మాణం (TTD)
ఇవేకాక ముంబై బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రం, శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని పాలక మండలి నిర్ణయించింది.
ఇక రెండుకోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పునర్నిర్మాణం, 49.5 కోట్లతో టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మత్తులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ పోటులో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి, టీటీడీ వేద పాఠశాలలో అధ్యాపకుల భర్తీ చేయాలని నిర్ణయించారు.
కొండపై శిథిలావస్థలో ఉన్న 2,3 సత్రాల స్థానంలో 600 కోట్ల రూపాయల వ్యయంతో అచ్యుతం, శ్రీపఠం వసతుల సముదాయాలను కూడా వెను వెంటనే నిర్మిస్తారు.
ఉదయనిధి మాటలు సరికాదు : భూమన
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్ఠాలిన్ చేసిన వ్యాఖ్యలను భూమన తప్పుబట్టారు.
సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన యానం అనీ అన్నారు.
ఈ విషయం తెలుసుకోకుండా సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేస్తే సమాజంలో అలజడులు రేగే అవకాశముందని భూమన హెచ్చరించారు.