భాగ్య నగరంలో (Hyderabad) వర్షం వస్తే ప్రాణ గండం తప్పదా ..అవును.. అయితే పొంగుతున్న డ్రైనేజీల్లో పడతాం.. లేదంటే నాలాల్లో మునిగిపోతాం.. అక్కడా తప్పించుకుంటే ఇళ్లలోకి వరద నీరు పోటెత్తి మొత్తం మునిగిపోతుంది.. ఇప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. నగర శివార్లలో ఉంటున్న వారు కూడా బిక్కు బిక్కు మంటూ బతకాల్సిన దుస్థితి. భారీవర్షానికి కుకట్ పల్లి ఆల్విన్ కాలనీలో చెరువు పొంగింది.. జీడిమెట్ల నుంచి వచ్చే ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఈ చెరువులో కలుస్తుంది. రాత్రి భారీ వర్షానికి ఈ చెరువు పొంగి పొర్లింది. దాంతో రసాయన చర్య జరిగి ఒక్కసారిగా నురుగు (foam) పొంగుతూ వచ్చింది. ఆ నురుగు (foam) ఎంతలా అంటే చుట్టు పక్కల ఇళ్లన్నీ ఈ నురుగులో (foam) కప్పబడిపోయాయి.. కళ్లకు తెల్లని దట్టమైన నురుగు తప్ప ఆ ప్రాంతంలో ఏమీ కనిపించడం లేదు.. కుకట్ పల్లి లోపి ఆల్విన్ కాలనీ, ధరణీ నగర్ లలో పెద్ద మొత్తంలో నురుగు పరిసర ప్రాంతాలను కప్పేసి ఇళ్లలోకి కూడా చొరబడింది.
తెల్లని దట్టమైన మేఘాల్లాగా, దూది పింజల్లాగా గాల్లోకి కూడా ఎగిరింది. రోడ్లపై ప్రయాణించే వారికి కూడా కాసేపు రహదారి కనిపించనంత దట్టంగా ఇది కమ్మేసింది.
ఇది క్షణ క్షణానికి పెరిగిపోతూ ముద్దలుగా గాల్లో తేలుతూ ఆ ప్రాంత మంతా వ్యాపించింది. దూది పింజలలా కనిపిస్తున్న ఈ నురుగు కళ్లలో పడితే ప్రమాదమని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఒక్కసారిగా జీడిమెట్ల పరిసర ప్రాంతాలు వదిలిన వ్యర్ధాల వల్ల కుకట్ పల్లి పరిసరాలు ఇలా ఇబ్బందులకు బలవడం మొదలు పెట్టాయి.
ఇళ్లలోకి ప్రహారీ గోడలు దాటుకుంటూ నురుగు వ్యాపించడం మొదలు పెట్టింది. ఎదుటి వ్యక్తి కనిపించనంత దట్టంగా ఈ నురుగు వ్యాపించింది.
జీహెచ్ ఎంసీ యంత్రాంగం ఈ నురుగును ఎలా అదుపు చేయాలో తెలీక అవస్థలు పడింది. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోనుంచి వ్యర్ధాలు విడుదల చేశారని అవి వాన నీటితో కలవడంతో రసాయనిక చర్య జరిగి పరిస్థితి మరింత వికటించిందనీ సమాచారం.
ప్రతీ ఏడాది భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు వాపోతున్నారు.
నగరంలో యధేచ్ఛగా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు (foam)
హైదరాబాద్ నగరం అనూహ్యంగా విస్తరిస్తోంది. ఎంతలా అంటే చెరువులు, కాల్వలు, కుంటలు కూడా కప్పేసి నిర్మాణాలు సాగించేస్తున్నారు. ఒకప్పుడు పరిశ్రమలంటే ఊరి బయట ఉండేవి.. జీడిమెట్ల ఒకప్పుడు ఊరి చివరి ప్రాంతం.
కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చెరువులు ఆక్రమణలకు, కబ్జాలకు గురవుతూ వచ్చాయి. వాటిని కప్పేసి, మూసేసి ఆ ప్రాంతాల్లో కాలనీలు, అపార్టుమెంట్లు వెలిశాయి. దాంతో ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఉండాల్సిన పరిసరాలను కూడా కాలనీలుగా, జనావాసాలుగా మార్చేయడంతో చినుకు పడిందంటే చాలు ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతున్నాయి. భారీ వర్షం పడితే కురిసిన వాన బయటకు పోయే మార్గం లేదు.. ఎక్కడి వాన అక్కడే ఉండిపోవడంతోనే ఇళ్లు,కాలనీలు నీట మునుగుతున్నాయి. పైగా పారిశ్రామిక వ్యర్ధాలను చెరువుల్లో కలపడం, చెరువులను కబ్జా చేసి, కుదించడం వల్ల పారిశ్రామిక వ్యర్ధాలు, వాన నీరు కలసి రసాయన చర్య జరిగి ఇలాంటి దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి.
ప్రతీసారీ ఇదే తంతు.. (foam)
కుకట్ పల్లి ధరణీనగర్, ఆల్విన్ కాలనీలకు ఇది ప్రతీ ఏటా తలెత్తే ఇబ్బందే.. అధికారులకు కంప్లయింట్ ఇచ్చినా చర్యలు ఉండవు. పరిశ్రమలు వ్యర్ధాలను చెరువుల్లోకి విడుదల చేయకూడదని మార్గదర్శకాలు, నిబంధనలు ఉన్నా.. వాటిని ప్రశ్నించే నాధుడు ఉండడు. అయినా చెరువుల పరిసరాల్లో ఇళ్లను ఎవరు నిర్మించుకోమన్నారని వారు అడిగే ప్రశ్నలకు మన దగ్గరా సమాధానం ఉండదు. నగరంలో సగం నిర్మాణాలు చెరువుల్లోనే.. అందుకే లోతట్టు ప్రాంతాలు కావడం వల్ల వర్షపునీటికి కాలనీలకు కాలనీలే మునుగుతున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, నాలాల పూడికలు తీయకపోవడం, జీహెచ్ ఎంసీ యంత్రాంగం నిర్లక్ష్యం, నగర పౌరుల కక్కుర్తి తనం అన్నీ కలసి ఇన్ని సమస్యలకు మూలం అవుతున్నాయి.
నాలాలో పడిన బాలుడు
కుకట్ పల్లి ప్రగతి నగర్ ఎన్నారై కాలనీలో నాలుగేళ్ల బాలుడు నాలాలో పడి కొట్టుకుపోయాడు. ఉయదం 11 గంటల ప్రాంతంలో ఆడుకుంటున్న బాలుడు నాలాలో పడిపోయాడు.వర్షపు నీరు పోయేందుకు మ్యాన్ హోల్ మూత తెరిచిన జీహెచ్ఎంసీ అధికారులు అందుకు సంబంధించిన సైన్ బోర్డ్ పెట్టకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
జీహెచ్ ఎంసీ, పోలీసు సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు రాజీవ్ గృహ కల్ప అపార్టుమెంట్ల దగ్గర బాలుడి మృతదేహం పైకి తేలింది. అయితే మృత దేహాన్ని తీస్తుండగా మళ్లీ వాన నీటి ఉథృతికి కొట్టుకు పోయింది.
నిన్న భారీ వర్షాలకు లక్ష్మీ అనే మహిళ కూడా గాంధీ నగర్ లో కొట్టుకుపోయింది. డెడ్ బాడీ కోసం గాలించినా ఇప్పటి వరకూ దొరకలేదు.