విజయ్ దేవర కొండ (VD) ఖుషీ అభిమానులకి ఎలాంటి కిక్కు ఇచ్చిందో తెలీదు కానీ విజయ్ లో దానగుణం మరోసారి బయటకొచ్చింది. దాన, ధర్మాల్లో ముందుండే విజయ్ అప్పుడప్పుడు అవసరమైన వారికి సహాయం చేస్తుంటాడు. పేదవారికి, డబ్బు సాయం అవసరమైన వారికి చాలా పెద్ద మనసుతో సాయం చేస్తూంటాడు విజయ్. తాజాగా ఖుషీ వేడుకల్లో మరో సారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఖుషీ మూవీలో తనకొచ్చిన రెమ్యునరేషన్ నుంచి కోటిరూపాయలు డబ్బు సాయం అవసరమైన వారికి అందచేస్తానని మాటిచ్చాడు.
సక్సెస్ మీట్ లో విజయ్ హామీ (VD)
ఖుషి సినిమా విశాఖ పట్టణం సక్సెస్ మీట్ లో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దాదాపు వంద కుటుంబాలను ఆదుకోవాలన్నది తన లక్ష్యమని డబ్బు సాయం అవసరమైన వారిని తానే స్వయంగా గుర్తించి వంద కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున సహాయం చేస్తానన్నాడు విజయ్ దేవర కొండ. ఖుషి సినిమా విజయంతో నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా.. మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నేనో నిర్ణయానికొచ్చాను. అది రైటో, రాంగో, చేయగలనో లేదో తెలీదు. కానీ ఆ పని చేయకపోతే మాత్రం నాకు నిద్ర పట్టదు. ఖుషి సక్సెస్ ను మీతో కలసి ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీ కి నేను తీసుకున్న రెమ్యునరేషన్ నుంచి కోటి రూపాయలు మీకు విరాళమిద్దామనుకుంటున్నా.. నేనే స్వయంగా వంద కుటుంబాలను సెలక్ట్ చేస్తాను. అది మీకు ట్యూషన్ ఫీజుకో, పెళ్లికో, అప్పుకో, వైద్య ఖర్చులకో దేనికో దానికి ఉపయోగపడుతుంది. రానున్న పదిరోజుల్లో వంద మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కును ఇవ్వబోతున్నాను.నా సంతోషాన్నే కాదు.. నా శాలరీని కూడా మీతో షేర్ చేసుకోవాలి అన్నది నా ఉద్దేశం అన్నాడు విజయ్ దేవర కొండ.
మరి మా సంగతేంటి? (VD)
విజయ్ ఇలా ప్రకటన చేశాడో లేదో పాత సినిమా ప్రొడ్యూసర్లు తమకొచ్చిన నష్టాల సంగతేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా రియాక్టయ్యాడు. అభిషేక్ పిక్చర్స్ తరపున వాల్డ్ ఫేమస్ లవర్ మూవీ రైట్స్ తీసుకున్న అభిషేక్ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో తీవ్ర నష్టాల పాలయ్యాడు. 2020లో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఈ సినిమా వల్ల8 కోట్ల నష్టం వచ్చింది. విజయ్ దేవర కొండ ఎంతో పెద్దమనసుతో అవసరమైన కుటుంబాలకు సాయం చేయాలనుకుంటున్నాడు.తమకు కూడా సినిమా వల్ల కలిగిన నష్టం నుంచి గట్టెక్కిస్తే బాగుంటుందంటూ x లో (ట్విట్టర్ లో ) ట్వీట్ చేశాడు.వాల్డ్ ఫేమస్ లవర్ సినిమా వల్ల తీవ్రంగా నష్టపోయిన మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కుటుంబాలను కూడా ఆదుకోవాలి.. ఇట్లు అభిషేక్ పిక్చర్స్ అని అభిషేక్ నామా ట్వీట్ చేశాడు.
హ్యుమానిటీ, లవ్, ఎంపథీ అనే హ్యాష్ టాగ్ లను కూడా జోడించాడు.అభిషేక్ ట్వీట్ పై విజయ్ ప్రస్తుతానికి ఏమీ స్పందించలేదు.. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడం తన బాధ్యతగా భావించి న్యాయం చేసి పాత తరం నటులైన కృష్ణ, ఎన్టీఆర్, శోభన్ బాబు ల తరహాలో ప్రశంసలు అందుకుంటాడో లేక లైట్ తీసుకుంటాడో చూడాలి. ఖుషీ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకూ 70 కోట్లు కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఈసినిమాలో విజయ్ సరసన సమంత నటించింది.