G-20
ఇండియా పేరును భారత్ గా మార్చేస్తోందని విపక్షాలు కంగారు పడుతున్నాయి గానీ నిజానికి ఈ ప్రక్రియ చాలా సైలెంట్ గా ఎప్పుడో మొదలైపోయిందని పిస్తోంది.ఈ మధ్య దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు సంబంధించి కేంద్రం తో జరిగిన కరస్పాండెన్స్ అంతా భారత్ అనేపేరు మీదనే సాగిందని తెలుస్తోంది. ఆగస్టులో దక్షిణాఫ్రికా బ్రిక్స్ సదస్సు నోటిఫికేషన్ లోనే ఇండియా స్థానంలో భారత్ అనే పేరు వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. బ్రిక్స్ సదస్సును చూసిన వారు అప్పుడు ప్రధానిని గానీ, మనదేశాన్ని గానీ అక్కడి దేశాలు సంబోధించిన తీరును ప్రత్యేకించి గమనించలేకపోయాం. ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ఆ నోటిఫికేషన్ లో ప్రస్తావించారు. ఆ తర్వాత గ్రీస్ పర్యటనలో కూడా ప్రధానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను భారత్ పేరు మీదే నడిపించారు. ఆగస్టు నెలలో రెండుదేశాల్లో ప్రధాని పర్యటనకు సంబంధించిన నోటిషికేషన్ లో ఆ విషయం స్పష్టంగా ఉంది.
అన్ని సదస్సుల్లోనూ అదే పేరు (G-20)
ఇక ఇప్పుడు జరగబోయే తూర్పు ఆసియాసదస్సు, ఇండోనేషియాలో జరిగే ఏసియన్ ఇండియా సదస్సుల్లో కూడా ఇండియాకు బదులు భారత్ అనీ, ప్ర్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అనీ వ్యవహరించారు. ఈసదస్సు లు ఇవాల్టినుంచి మొదలవనున్నాయి.
జీ20 (G-20) కరస్పాండెన్స్ అంతా భారత్ పేరు మీదే!
ఇప్పుడిక జీ20 (G-20) సదస్సుకు సంబంధించిన కరస్పాండెన్స్, లిటరేచర్ అన్నింటిలోనూ ఇండియా అన్న పదం ఎక్కడా లేదు. అన్ని చోట్లా భారత్ అనే ఉంది.. ఈ సదస్సుకు భారత్ నేతృత్వం వహిస్తున్న నేపధ్యంలో భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని రాశారు.మనదేశంలో వేల ఏళ్లనుంచే ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని ఆపుస్తకాల్లో రాసుకొచ్చారు. రాష్ట్రపతి ఆహ్వానాలపై భారత్ అని కనపడటంతో మీడియా, విపక్షాలు అలెర్ట్ అయి దీనిపై చర్చలు జరిపి హడావుడి చేస్తున్నాయి కానీ కేంద్రం సైలెంట్ గా తాను అనుకున్నది చేసుకుపోతోంది.
అన్నీ గమనించాకే నిర్ణయం
రాజ్యాంగంలో ఇండియా దటీజ్ భారత్ అని ఉండటంతో ఈరెంటిలో కేంద్రం దేన్నైనా వినియోగించే స్వేచ్ఛ ఉంది. కేవలం సాధారణ మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుంది.ఈ విషయాలన్నీ కూలంకషంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ పేరు మార్పుకు శ్రీకారంచుట్టి ఉంటుందని రాజకీయనిపుణులు అంటున్నారు. అసలు దీనికోసం తీర్మానం కూడా అవసరం లేదంటున్నారు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు.పేరు మార్పు ఇక లాంఛనమే !
భారత్ ఇండోనేషియా సదస్సులోకూడా భారత ప్రధాని అనే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సంబీత్ పాత్రా తెలిపారు.ఈనెల 18నుంచి ఐదురోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ పేరు మార్పు జరపడం లాంఛనమేనని తెలుస్తోంది. దీనికి ప్రతిపక్షాల అభిప్రాయం, తీర్మానాలతో పని లేదు కాబట్టి కేంద్రం నేరుగానే ఈ మార్పును ఎలాంటి అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా చేసేసుందని పిస్తోంది.
మా కూటమి పేరు కూడా మారుస్తాం..
అసలు ఇండియా అన్న పేరును భారత్ అని మార్చడం అంటే చరిత్రను వక్రీకరించడమేనని, దేశాన్ని విడదీయటమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.విపక్షాలు ఐక్య కూటమిగా ఏర్పడి ఇండియా అనిపేరు పెట్టుకోవడం ప్రధానికి కంటగింపుగా మారిందని అందుకే దేశం పేరును మార్చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. విపక్షాల ఐక్యకూటమి పేరు భారత్ అని మారిస్తే అప్పుడేం చేస్తారని ఎద్దేవా చేశారు.అసలు దేశంపేరును మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు ఎన్సీపి నేత శరద్ పవార్. దేశం పేరు మార్చడం వల్ల ఏ ప్రయోజనాలు బీజేపి పొందదలచుకుందో స్పష్టం చేయాలన్నారు.మరోవైపు బీజేపి నేతలు మాత్రం ఈ చర్యను సమర్ధిస్తున్నారు. భారత్ అంటేనే ఇండియా ..ఇండియా అంటేనే భారత్ రాష్ట్రాల సమాఖ్య కాబట్టి పేరు మార్పువల్ల నష్టం ఏం లేదంటున్నారు.వలస వాదుల భావజాలానికి వ్యతిరేకంగా ఉండాలంటే భారత్ అనే పేరే సరైనదంటున్నరు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.ఇది ఎప్పుడో మార్చేసి ఉండాల్సిందని ఆయనంటున్నారు.భారత్ అంటే వినేందుకు చెవులకు ఇంపుగా ఉందంటున్నారాయన.కొద్ది రోజుల క్రితం ఆరెస్సెస్ ఈ ప్రతిపాదనను చేస్తూ ప్రకటన చేయడం చూస్తుంటే నిజానికి ఈ పేరు మార్పు ఉద్దేశాలు చాలా కాలంనుంచే బీజేపి మైండ్ లో ఉన్నాయన్నది సుస్పష్టం…