(Biden)
దేశం కాని దేశంలో భేటీ.. అందునా అగ్రరాజ్య అధిపతి .. ఆయన కాలు కదిపారంటే ఆయనవెంట మందీ మార్బలం కదిలి రావాల్సిందే. రాజు వెడలే రవి తేజములలరగ అన్నట్లుగా భువన భోంతరాళాలు దద్దరిల్లాల్సిందే. భారత్ లో జరిగే జీ-20 సదస్సుకు వస్తున్న జో బైడెన్ (Biden) కోసం ఓ పెద్ద పటాలమే కదలి వస్తోంది. ఆయన రెండు రోజుల ట్రిప్ కోసం కొన్ని కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది అమెరికా. హెలికాప్టర్లనుంచి అత్యంత ఖరీదైన కార్లనూ, అత్యాధునిక రక్షణాయుధాలను, వేలరౌండ్ల బుల్లెట్లను, హాండ్ కఫ్స్ ను, నాలుగు కాళ్ల బాంబు డిటెక్టింగ్ మెషీన్లను అమెరికానుంచి న్యూఢిల్లీకి తరలిస్తున్నారు.
అందుబాటులో సమాంతర సమాచార వ్యవస్థ
అధ్యక్షుల వారు భారత్ లో ఉన్న కొన్ని గంటల పాటు స్వదేశంతో కమ్యూనికేషన్స్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఒక సమాంతర వ్యవస్థతోపాటు, ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా నిర్మిస్తున్నారు. ఈనెల 8 అంటే ఎల్లుండి , 9వ తేదీనా మాత్రమే బైడెన్ భారత్ లో ఉంటారు. కానీ ఆయన రాకకు ముందు సన్నాహాలు మాత్రం కొన్ని వారాల క్రితమే మొదలయ్యాయి.భద్రతా దళాల అధికారుల బృందం ఇప్పటికే భారత్ వచ్చేసింది. ఇక అధ్యక్షుల వారికి అవసరమైన సామాగ్రి, ఇతర వ్యవస్థల తరలింపుకు సంబంధించిన వ్యవహారాలను నిరంతరం ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర దేశాలకు భిన్నంగా అమెరికా అధ్యక్షుని రక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఆయన కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్వదేశానికి చేరవేయడానికి నిరంతర సమాచార వ్యవస్థ, అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ల్యాప్ టాప్ లు, ట్యాప్ చేయడానికి వీలులేని ఫోను వ్యవస్థలు, అందుబాటులో వైద్య సహాయం ఉంటాయి.
యువకులే ఆయనకు బాడీ గార్డులు
బైడెన్ భద్రత కోసం వినియోగించే బాడీగార్డుల వయసు కేవలం 21నుంచి 28 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీరు బైడెన్ కు ముందూ వెనుకా అత్యంత సమీపంలో ఉంటారు.వీరి చేతిలో పిస్ట్లల్స్, లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ ఆయుధాలు, అధ్యక్షుని కాపాడేందుకు బుల్లెట్ రెసిస్టెంట్ షీట్లు అందుబాటులో ఉంటాయి.
అధ్యక్షుని భద్రతకు సంబంధించిన క్షుణ్ణమైన సమాచారం ఇప్పటికే భారత భద్రతాదళాలు తీసుకున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాయి. అధ్యక్ష బలగాల రాక, పోకలకు సంబంధించిన ప్లానింగ్ అంతా భారత బలగాలు చూసుకుంటున్నాయి. బైడెన్ ఉండే ప్రాంతం ఫోర్ లెగ్ డ్ బాంబ్ డిటెక్టర్లు ఇప్పటికే తనిఖీలు చేసి , శానిటైజ్ చేశారు.కంట్రోల్ రూమ్ అధికారులందరితోనూ కాంటాక్ట్ లో ఉండి ఆదేశాలు ఇస్తుంటే అధ్యక్షుని భద్రతా పరమైన అవసరాల కోసం వెనకాల మరో టీమ్ పనిచేస్తుంటుంది.
తరలి రానున్న విమానాలు, హెలికాప్టర్లు (Biden)
అమెరికా అధ్యక్షుని రెండు రోజులకోసం సొంత విమానాలు, హెలికాప్టర్లు కూడా వెంట వస్తున్నాయి.
బైడెన్ భారత్ లో కాలు పెట్టింది మొదలు ఎక్కడా కొంచెం కూడా నడవరు. బ్రిక్స్ ప్రాంగణంలోకి కూడా హెలికాప్టర్ లోనే వచ్చి అక్కడనుంచి కారులో వస్తారు.
వెంట రానున్న ది బీస్ట్ (Biden)
బైడెన్ తిరిగే కారు పేరు ది బీస్ట్.. మోస్ట్ అల్ట్రా మోడ్రన్ అయిన ఈ కారు సువిశాలంగా ఉంటుంది. దీని వివరాలను ఇప్పటికే మన బలగాలకు షేర్ చేశారు. ఈకారు బైడెన్ తో సహా స్పెషల్ ప్లేన్ లో భారత్ కు వస్తుంది.అనుకోని అవాంతరమేదైనా ఎదురై అధ్యక్షునికి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటే అమెరికా ఏజెన్సీలు రంగంలోకి దిగి మొత్తం ప్రాంగణాన్ని,ఎయిర్ పోర్టు, నౌకాశ్రయాలను తమ అదుపులోకి తీసుకుని అధ్యక్షుని సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తారు.
ఆఖరున వస్తారు.. ముందు వెళిపోతారు..
అధికారిక సమాచారం ప్రకారం బైడెన్ ఈనెల 8 ఉదయం భారత్ చేరుకుని హోటల్లో బస చేస్తారు. మన దేశంలో ఉన్నంత వరకూ ఆయన అదే హోటల్ లో ఉంటారు. బ్రిక్స్ ప్రాంగణానికి చేరుకునే ఆఖరి అతిధి ఆయనే..అలాగే సదస్సు ముగిశాక ముందు స్వదేశానికి బయల్దేరే గెస్ట్ కూడా ఆయనే. భారత ప్రధాని మోడీతో ప్రత్యేక సమావేశాన్ని కూడా ప్లాన్ చేశారు.బైడెన్ వెళ్లి పోగానే ఆయన వెంట వచ్చిన మందీ మార్బలం అంతా సర్దుకుని బయల్దేరతారు.
ప్రతి పూటా కోవిడ్ టెస్టులు (Biden)
బైడెన్ భార్య జిల్ బైడెన్ కు కోవిడ్ రావడంతో అధ్యక్షునికి కూడా ప్రతీ పూటా కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయనకు నెగటివ్ రావడంతో ప్రయాణాన్ని నిర్ధారించారు. బ్రిక్స్ సదస్సుకు ఆయన మాస్క్ తో హాజరవుతారు.