(power cut)
ఏపీలో కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకుంటున్నారని బీఆర్ ఎస్ నేత , మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేస్తున్నారు… బీఆర్ ఎస్ నేతలకు ఈ మధ్య స్వరాష్ట్రం కన్నా పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతోందోనన్న ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. మంత్రులు హరీష్ రావు దగ్గరనుంచి కేటీఆర్ వరకూ, తలసాని నుంచి ఎర్రబెల్లి వరకూ అందరూ ఏపీ ప్రభుత్వంపై ఏదో ఒక మాట వదిలేయడమే..పొరుగు రాష్ట్రం సంగతి దేముడెరుగు సొంత రాష్ట్రం సంగతి ముందు చూసుకుంటే బాగుంటుందని తెలంగాణ ప్రజలే కామెంట్ చేస్తున్నారు. ” కరెంట్ ఇవ్వడంలో తెలంగాణ దేశంలోకే నెంబర్ వన్ రాష్ట్రం.. విద్యుత్ కోతలంటే మాకు అస్సలు తెలీదు.. వ్యవసాయానికి 24 గంటలూ కరెంట్ ఇస్తూనే ఉన్నాం ” అంటూ తెగ కోతలు కోసేస్తున్నారు.. కానీ వాస్తవానికి ఎక్కడా అంత సీన్ లేదు.తెలంగాణలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి.
ఐదు కొట్టిదంటే కరెంట్ ఆఫ్ (power cut)
రాష్ట్రంలో ఉన్న27లక్షల వ్యవసాయ పంపుసెట్లకు మళ్లీ త్రీఫేజ్ కరెంట్ కోత అమల్లోకి వచ్చింది. కోతల్లేకుండా కరెంట్ ఇవ్వండి మహప్రభో అని రైతులు గగ్గోలు పెడుతుంటే అనేక జిల్లాల్లో సాయంత్ర ఐదు కొడితే చాలు త్రీఫేజ్ కరెంట్ టప్ మని ఎగిరిపోతోంది. దీనికి కారణం కృష్ణా బేసిన్ లో నీటి నిల్వలు లేకపోవడమే. దీంతో జల విద్యుత్ ఉత్పాదన పూర్తిగా మందగించింది.పోనీ అని ఓపెన్లో కరెంట్ కొందామంటే ఆకాశాన్నంటుతున్నాయి ధరలు. యూనిట్ కి పది రూపాయలు చొప్పున కొంటే తప్ప దొరకడం లేదు..డిస్కమ్ లకు ప్రభుత్వం పడిన బకాయిలు ఓ పక్క మూలుగుతున్నాయి. దాంతో పీక్ టైమ్ లో విద్యుత్ కోతలకే పరిమితమవుతున్నాయి డిస్కమ్ లు. పలు జిల్లాల్లో పగటి పూట కూడా అనధికారికంగా త్రీఫేజ్ కరెంట్ ను నిలిపివేస్తున్నారు. మొన్న జులైలో త్రీఫేజ్ కరెంట్ పై అసెంబ్లీ సాక్షిగా అధికార విపక్షాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.
కాంగ్రెస్ మెలికతో ఇరుకున పడ్డ బీఆర్ ఎస్
24 గంటల కరెంట్ ఇస్తున్నామంటూ బీఆర్ ఎస్ నేతలు వీధులకెక్కి ఉపన్యాసాలిస్తుంటే ఈ గందరగోళం అంతా ఎందుకు అసలు 24 గంటల సరఫరా ఉందో లేదో డిస్కమ్ లలో లాగ్ బుక్కులు చూస్తే తేలిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసరడంతో బీఆర్ఎస్ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. వర్షాలు పడి దుక్కిదున్ని నాట్లు వేసిన రైతులు ఇప్పుడా పంట కాస్త ఎదగడంతో నీరు పెట్టేందుకు పంపు సెట్లవైపు ఆశగా చూస్తున్నారు.
దీంతో వ్యవసాయ కరెంట్ డిమాండ్ పీక్ స్టేజికి చేరింది. అందరికీ అదే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయలేక డిస్కమ్ లు చేతులెత్తేస్తున్నాయి. అప్రకటిత త్రీఫేజ్ కరెంట్ కోతలను అమలు చేస్తున్నాయి. దాంతో రైతులు రోడ్లెక్కుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాయంత్రం ఆరు దాటితే త్రీఫేజ్ కరెంట్ కట్.. అలాగే ఉమ్మడి వరంగల్ లో కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు. రోజుకు 16నుంచి 18 గంటలు మాత్రమే ఇవ్వగలుగుతున్నారు.ఇక యాదాద్రి జిల్లా ది మరో సమస్య.. రోజుకు 15 గంటలు మాత్రమే అదీ మూడు విడతలుగా మాత్రమే త్రీఫేజ్ కరెంట్ అందుతోంది.
ముందస్తు సమాచారం లేకుండానే… (power cut)
నిజానికి 24 గంటల ఉచిత కరెంట్ అన్నప్పుడు అసలు సమస్య రాకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కోతలు అమలు చేయాలంటే ముందు రైతులకు కరెంట్ కోతలపై సమాచారం ఇవ్వాలి.కానీ అదేం లేదు.. డిస్కమ్ లు దైవాధీనం సర్వీస్ అన్నట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నాయి.బోర్ ఉండి నీరు ఉంటే రైతులు ఆటోమేటిక్ గా ఆన్ అయ్యే స్టార్టర్ ను బిగించుకుని త్రీఫేజ్ కరెంట్ ఎప్పుడొస్తే అప్పుడే మోటార్లు పని చేసేలా చూసుకుంటున్నారు. కానీ ఈ స్థోమత లేని రైతులకు రాత్రి వేళ చీకట్లో తండ్లాట తప్పటం లేదు.తెలంగాణలో ఏ ఒక్క జిల్లాకీ 24 గంటల విద్యుత్ అందటం లేదన్నది నికార్సయిన నిజం.కొన్ని జిల్లాలకు 16 గంటలు, మరికొన్ని జిల్లాలకు 17,18గంటల విద్యుత్ మాత్రమే అందుతోంది. మెతుకు సీమగా పేరొందిన మెదక్ లో కూడా రోజుకు 15గంటలే విద్యుత్ సరఫరా ఉంటోంది.వాస్తవాలు ఇలా ఉండగా బీఆర్ ఎస్ నేతలు కరెంట్ ఇచ్చేస్తున్నాం అని ఇల్లెక్కి మరీ బీరాలు పలుకుతున్నారు. త్రీఫేజ్ కరెంట్ కోతలతో తెలంగాణలోనూ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకుంటున్న మాట నికార్సయిన నిజం. మరి మధ్యలో ఏపీ ఊసు వీళ్లకెందుకు? ఆ రాష్ట్రంతో పోలికెందుకు?ఇలా కెలకడం మొదలు పెడితే విభజన పంచాయతీ దాకా చేరే కొట్లాటలను తీర్చేదెవరు?కోతలకైనా హద్దూ పద్దూ ఉండాలిగా..