G-20 సమావేశాలు జరిగేది రెండు రోజులే అయినా ప్రధాని మోడీ మాత్రం నాలుగురోజులపాటు ఊపిరి పీల్చుకోలేనంత బిజీగా మారిపోతున్నారు. కారణం మన దేశం ఆతిధ్య దేశం కావడంతో అతిధి దేవోభవ అన్న నానుడిని పాటించి వారికి సకల మర్యాదలు అందేలా చూసుకుంటున్నారు. మరోవైపు ఈసదస్సు నిర్వహణ వల్ల భారత్ కు ఆర్ధికంగా,రాజకీయంగా, వ్యూహాత్మకంగా దేశానికి మరింత లబ్ది కలిగేలా వ్యూహ రచన చేశారు. ప్రధాని బిజీ షెడ్యూల్ ను సంబంధిత అధికారులు ఇప్పటికే ఖరారు చేశారు.G-20 సదస్సు సైడ్ లైన్స్ లో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చల కోసం పలు దేశాల అధినేతలు కూడా తమ షెడ్యూల్ ను ఇప్పటికే ఖరారు చేసుకున్నారు..
అసలు ప్రధాని షెడ్యూల్ ఎంత బిజీగా ఉందంటే… G-20
G-20 సదస్సులో అందరికన్నా ముందు ప్రధాని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను కలవబోతున్నారు.ఆగ్నేయాసియా దేశాల సదస్సులో పాల్గొనేందుకు జకార్తా వెళ్లిన ప్రధాని గురువారం రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. శుక్రవారం భారత్ చేరుకోనున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో అదేరోజు సాయంత్రం ద్వైపాక్షిక చర్చలకు షెడ్యూల్ ఖరారైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనాతోనూ ద్వైపాక్షిక చర్చలు ఉండబోతున్నాయి. అయితే ఈ చర్చలు ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికార నివాసంలోనే జరగబోతున్నాయి.
బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాధినేతలతోనూ భేటీలు
తగినంత సమయం దొరికితే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, నాలుగు దేశాల క్వాడ్ కూటమి నేతలైన జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా, ఆస్ర్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ తోనూ ప్రధాని చర్చించే వీలుంది. రిషి సునాక్ తో చర్చించే అంశాల్లో ప్రధానంగా ఇరు దేశాల మధ్య కొంతకాలంగా నలుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..ఎఫ్ టిఎ కీలకంగా ఉండనున్నది. ఈ నెల 10న ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ తో ప్రధాని మోడీ లంచ్ బ్రేక్ చేయనున్నారు. దాంతో, G-20 దేశాల నేతలతో సైడ్ లైన్ చర్చలకు తెరపడుతుందని అధికారులు పేర్కొన్నారు…
11న సౌదీ రాజకుమారుడుతో భేటీ
G-20 సమావేశాలు ముగిసిన మరుసటి రోజున అంటే ఈ నెల 11న సౌదీఅరేబియా రాకుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ తో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ప్రధాని మోడీతో సమావేశం కోసం ప్రిన్స్ సల్మాన్ అదే రోజున ఢిల్లీకి రానున్నారు. అంతేగాక G-20 సదస్సుకు భారత్ ప్రత్యేక ఆహ్వానంమేరకు వస్తున్న UAE అధ్యక్షుడు మహ్మద్ బిన్ జయేద్ తోనూ సైడ్ లైన్ చర్చలకు ప్రధాని ప్రాధాన్యత ఇస్తున్నారు. జయేద్ ను తనకు సన్నిహిత మిత్రుడిగా ప్రధాని మోడీ భావిస్తారు. ఇటీవల చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసి అభినందించిన నేతల్లో జయేద్ కూడా ఉన్నారు. బ్రిక్స్ లో UAE కి సభ్యత్వం కల్పించాలని భారత్ కోరుతోంది. అందుకు ప్రధాని మోడీకి జయేద్ కృతజ్ఞతలు తెలిపారు…
బైడెన్ తో చర్చలు అత్యంత కీలకం
జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలకు ప్రధాని అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలపై తుది నిర్ణయాలకు రానున్న సందర్భంగా ఇరువురు నేతలు మధ్య చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీటిలో జిఇ ఎఫ్ 414 ఫైటర్ జెట్ ఇంజిన్లకు సంబంధించిన డీల్ అత్యంత కీలకమైంది.
G-20
ఇటీవలే అమెరికా కాంగ్రెస్ ఈ డీల్ కు ఆమోదం తెలిపింది.ఈ డీల్ లో భాగంగా ఫైటర్ జెట్లను 100 శాతం భారత్ లోనే తయారు చేయనున్నారు.వీటికి సంబంధించిన సాంకేతికతలో 80 శాతాన్ని మన ప్రభుత్వరంగ సంస్థయైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు అమెరికా కంపెనీ జనరల్ ఎలక్ర్టిక్ కంపెనీ బదిలీ చేయనుంది. అందులో భాగంగా 99 జెట్ ఇంజిన్లను HAL లో సంయుక్తంగా తయారు చేయనున్నారు.ఈ ఒప్పందం ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని HAL చీఫ్ సిబి అనంతక్రిష్ణన్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. జెట్ ఇంజిన్లను స్వదేశంలోనే ఉత్పత్తి చేయడం ద్వారా భారత వైమానిక దళం బలోపేతం కానున్నది.. ఈ డీల్ భారత్ కు ఎంతో ప్రాధాన్యమైనదిగా అమెరికా అధికారులు కూడా ఇప్పటికే గుర్తించారు.దాంతో, ఇరువురు నేతల చర్చలు ఈ సందర్భంగా ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తున్నారు.మరోవైపు గతంలోనే అమెరికాతో జరిగిన పౌర అణు ఒప్పందంలో భాగంగా ఇరువురు నేతలు, సంబంధిత అధికారులు క్లీన్ ఎనర్జీ పైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది..