G-20 సదస్సు నేపధ్యంలో ఢిల్లీ భద్రతా సిబ్బంది పహారాలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, బంగ్లా దేశ్ ప్రధాని షేక్ హసీనా, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ అంతటా కట్టుదిట్టమైన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. అగ్రదేశాల నేతలు బస చేస్తున్న ప్రాంతంలో సదస్సు జరుగుతున్న పరిసరాల్లో అత్యవసర మెడికల్ సర్వీసులు తప్ప ఆన్ లైన్ డెలివరీ సర్వీసులన్నీ ఆపేశారు.. సదస్సు జరుగుతున్న భరత మండపం ప్రాంగణంలో అష్ట ధాతువులతో నిర్మించిన 27అడుగుల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని కొలువు తీర్చారు.
ప్రధాని మోడీ X హ్యాండిల్ ( ట్విటర్) కవర్ పై ఫోటో
ప్రధాని మోడీ తన X హ్యాండిల్ (ట్విటర్ హ్యాండిల్) కవర్ ఫోటో పై కూడా ఇదే ఇమేజ్ కనిపిస్తుంది.ఈ ఏడాది జీ20 సదస్సుకు భారత దేశం ఆతిధ్యమిస్తుండగా, మోడీ ఈసదస్సుకు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 1న జీ 20 సదస్సు అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్ ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ప్రధాని మోడీ X హ్యాండిల్ (గతంలోట్విట్టర్)ఫోటో సదస్సుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక సన్నాహక చర్యల్లో ఒకటి.
అష్ట ధాతువులతో తయారీ
దాదాపు 18 టన్నుల బరువైన ఈ నటరాజ విగ్రహం దేశంలోకే అత్యంత పొడవైనదని ఇందిరాగాంధీ జాతీయ కళా కేంద్రం తెలిపింది. ఈ విగ్రహం తయారీలో రాగి, జింగ్, సీసం, తగరం, వెండి, బంగారం,పాదరసం, ఇనుము ధాతువులను వినియోగించారు. నృత్యానికి ప్రతిబింబమైన శివుడి రూపంలో ఉన్న నటరాజు ను ఈ సదస్సుప్రాంగణంలో కొలువు దీర్చడం వల్ల ఆప్రాంతానికే అందం వచ్చింది. రాత్రి వేళ ఊదారంగంలో తళుకు లీనుతున్న ఈ విగ్రహం జీ 20 సదస్సు ప్రాంగణాన్ని శోభాయమానంగా మార్చేసింది.
తమిళనాడు లో పోత పోసి ఢిల్లీకి తరలింపు G
తమిళ నాడుకు చెందిన విగ్రహ శిల్పి రాధాకృష్ణ స్థపతి తన టీమ్ తోకలసి కేవలం ఏడు నెలల్లోనే ఈ విగ్రహ తయారీని పూర్తిచేశారు. ప్రత్యేకించి నిర్దేశించిన గ్రీన్ కారిడార్ మీదుగా దీనిని తమిళనాడు నుంచి ఢిల్లీకి తరలించారు.నటరాజ విగ్రహం ఏక శిలతో కూడి ఉంటుంది ఆ కారణంగానే ఈవిగ్రహాన్ని కూడా ఎక్కడా అతుకులు లేకుండా ఒకే పోతపోసి నిర్మించారు. ఈ విగ్రహం తయారీ ఖరీదు పదినుంచి 12 కోట్లు ఉంటుందని ఇందిరాగాంధీ జాతీయకళా కేంద్రం కార్యదర్శి సచ్చిదానంద జోషి తెలిపారు.G-20 సదస్సు కోసం భారత్ ఎన్ని ఘనమైన సన్నాహాలు చేసిందో ప్రధాని X హ్యాండిల్ (ట్విటర్) కవర్ ఫోటో నటరాజ విగ్రహం చూస్తేనే తెలుస్తుంది. సనాతన వాదాన్ని నిర్మూలించాలని లెఫ్ట్ భావ జాల పార్టీలు విమర్శలు చేస్తున్న వేళ నటరాజ విగ్రహాన్ని ప్రపంచ దేశాల సదస్సు ప్రాంగణంలో ప్రతిష్టించడం ద్వారా మోడీ తన విధానాలకు అంతర్జాతీయ మద్దతు కూడా కూడగట్టినట్టయ్యింది.G-20 సదస్సు పుణ్యమాని ఢిల్లీ రూపురేఖలు మారిపోయాయి.రాజధాని అందంగా అలంకరించుకున్న పెళ్లి కూతురుల్లా ముస్తాబయ్యింది. అగ్ర నేతల రాకతో రాజధాని అన్ని హైటెక్ హంగులతో సర్వాంగ సుందరంగా మెరిసిపోతోంది.