ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును (CBN) ఏపీ సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారు జామున అత్యంత నాటకీయ ఫక్కీలో అరెస్టు చేశారు. నిన్న రాత్రి నుంచే వాస్తవానికి అనంతపురం రాజకీయం హీటెక్కింది. తనను రేపో, మాపో అరెస్టు చేస్తారంటూ ముందుగానే చంద్రబాబు అనేక సభల్లో ప్రస్తావించడం తో నంద్యాలలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాత్రికి అనంతపురం నుంచి ఆరు బస్సుల్లో వచ్చిన పోలీసులు అక్కడ బస చేశారు. ఈలోగా చంద్రబాబును అరెస్టు చేయవచ్చన్న ఊహాగానాలు తెరపైకి రావడంతో భారీ ఎత్తున కార్యకర్తలు చంద్రబాబు బస చేసిన ఆర్. కె. ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. పార్టీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర మైన వాగ్యుద్ధం జరిగింది. బాబును అరెస్టు చేయవద్దంటూ నేతలు గట్టిగా ఎదురు తిరిగారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ కార్యకర్తలు అడ్డు పడ్డారు. అయితే పోలీసులు నేరుగా బాబు బస చేసిన బస్సు దగ్గరకు రావడంతో బస్సు దిగి పోలీసులతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
తప్పుచేస్తే ఉరి తీయండి… (CBN)
తప్పు చేస్తే ఉరి తీయండి. అంతేకాని తన హక్కులు హరించొద్దంటూ చంద్రబాబు (CBN) మండిపడ్డారు. దాదాపు గంట పాటు ఇరు బృందాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన అరెస్టుకు ప్రాధమిక ఆధారాలు చూపాలని చంద్రబాబు డిమాండ్ చేయగా అన్ని ప్రాధమిక ఆధారాలు హైకోర్టుకు ఇప్పటికే సమర్పించామని తెలిపారు.
ష్యూరిటీ-గ్యారంటీ కార్యక్రమంలోనే
బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి నంద్యాలలో చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అయితే అప్పటికే అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న పోలీసులు కూడా వ్యూహాత్మకంగా పెద్ద సంఖ్యలో అక్కడకి చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచి రెండు బృందాల్లోనూ హైడ్రామా నడిచింది. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చంద్రబాబును నిద్ర లేపేందుకు డిఐజీ రఘురామిరెడ్డి ప్రయత్నించారు. అయితే రాత్రి సమయంలో డిస్ట్రబ్ చేయవద్దంటూ కార్యకర్తలు అడ్డుకున్నారు.
చంద్రబాబునాయుడిని (CBN) ఏ కేసులో అరెస్టు చేస్తున్నారన్న విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. చంద్రబాబుపై ఇప్పటికే
అమరావతి నిర్మాణాల స్కాం ఆరోపణలున్నాయి.. టిడ్కో ఇళ్ల నిర్మాణం, అమరావతిలో అసెంబ్లీ,హైకోర్టు భవనంతో పాటు పలు నిర్మాణాల విషయంలో రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజికి నిర్మాణ కాంట్రాక్టులు అప్పగించడానికి చంద్రబాబు ముడుపులు తీసుకున్నారన్నది ఆర్థిక, ఐటీ శాఖలు చేస్తున్న ఆరోపణలు. ఈకేసులో ఆయనపై నమోదైన సెక్షన్లు చాలా తీవ్రమైనవి. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంటరీ ఎవిడెన్సులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.ఐటీ చట్టాలతో పాటు,మనీ లాండరింగ్ కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు అమరావతి నిర్మాణాలు, పేదలకు టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ముడుపులు స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటికి తోడు లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కూడా భారీఎత్తున అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మరి చంద్రబాబుఅరెస్టు ఏ కేసులో అన్నది మాత్రం పోలీసులు స్పష్టం చేయలేదు.
లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు
మరోవైపు చంద్రబాబును అరెస్టు చేశారన్న వార్తలతో కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ లో ఉన్న లోకేష్ విజయవాడకు బయల్దేరారు. అయితే ఆయన్ను పోలీసులు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఒక కుటుంబ సభ్యుడిగా, నాతండ్రిని చూసే హక్కు నాకుంది. నా హక్కులను కాలరాసే పెత్తనం మీకెవరిచ్చారంటూ లోకేష్ పోలీసులపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తన క్యాంప్ సైట్ వద్దే ఆయన బైఠాయించి నిరసన తెలిపారు.
కేసు చాలా లోతైనది: పోలీసులు (CBN)
అమరావతి కుంభకోణానికి సంబంధించినంత వరకూ ఈ వ్యవహారంలో ఎక్కడా ప్రత్యక్షంగా గానీ,పరోక్షంగా గానీ తన పేరు లేదని చంద్రబాబు అంటున్నారు.అయితే పేరు లేకపోయినంత మాత్రన నేరం చేయనట్లు కాదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ప్రాసంగిక సాక్ష్యాలు ఉన్నాయి అవి ఆధారాలుగా సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఐటీ అధికారులు తమ దర్యాప్తులో భాగంగా ట్రిబ్యునల్ లోచార్జి షీటు ఫైల్ చేస్తారు. ఆతర్వాత ఆయన్ను రిమాండ్ కు అడగాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబును ఏ కేసులో అరెస్టు చేశారన్నది తేలితేనే తర్వాత ఏం జరుగుతుందన్నది అంచనా వేయవచ్చు..చంద్రబాబును తమ వెంట తీసుకెళ్లేందుకు ఒత్తిడి చేస్తున్న ఏపీ సీఐడి పోలీసులు ఏ కేసు అన్నది మాత్రం బయటకు వెల్లడించ లేదు.