స్కిల్ డెవలెప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి (TDP) నేతలు అప్రకటిత బంద్ పాటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం దూర ప్రాంతాల బస్సులన్నింటినీ ఆపేసింది.రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు బంద్ అయ్యయి. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో సిటీ బస్సులు కూడా తిరగడం లేదు.ముందస్తు సమాచారం లేకుండా ఉన్నట్టుండి బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .
టీడీపీ నేతల ఖండనలు (TDP)
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టు కక్షసాధింపు చర్యల్లో భాగం అన్నారు. ఏ ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.జగన్ ఓటమి భయంతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. అయినా ఏమీ జరగని స్కాంలో అరెస్ట్ ఏంటని ప్రశ్నించారు.
పోలీసుల అప్రమత్తం (TDP)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్తో టీడీపీ నేతలు ఎక్కడిక్కడ ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని రూరల్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెంలో కూడా అదే ఉద్రిక్తత నెలకొంది.రెడ్డి గూడెం ప్రధాన సెంటర్లో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెడ్డి గూడెం ప్రధాన సెంటర్లో నిరసనకు దిగారు.దీంతో పోలీసులకు, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదంజరిగింది. పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
జగన్ సైకో : స్వామిదాసు
అటు ధర్మవరం లో టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మూడవ పట్టణ పోలీస్స్టేషన్ను ముట్టడించారు. పోలీస్ స్టేషన్ గేట్లను తోసివేసి ముఖ్యమంత్రి జగన్మోహన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్లో బైఠాయించిన టీడీపీ కార్యకర్తలు నిరసన చేస్తున్నారు.తిరువూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ సుధారాణి దంపతులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. స్వామిదాసును బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.విషయం తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వామిదాసు ఇంటికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ… జగన్ లండన్లో ఉండి చంద్రబాబును అరెస్ట్ చేసి ఒక్కరోజైనా జైల్లో పెట్టి రాక్షసానందం పొందాలని జగన్ సైకో ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశానికి పరాకాష్ట అంటూ నల్లగట్ల స్వామిదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టు అక్రమం: పురంధరేశ్వరి
చంద్రబాబును నోటీసులు లేకుండా అరెస్టు చేయడం అక్రమమంటూ ఆయన బంధువు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు.అక్రమాలేవైనా ఉంటే తగిన ఆధారాలతో పోలీసులు చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు.చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.వాటిలో 109 (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్), 120 బీ (కుట్ర), 166, 167 (క్రిమినల్ నేచర్), 418, 420 (చీటింగ్), 465 (ఫోర్జరీ), 468 (ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారీ), 471 (అబద్దాలను నిజం చేయడం), 409 (నమ్మక ద్రోహం) లాంటివి ఉన్నాయి.