ఆఫ్రికా దేశమైన మొరాకోలో(Morocco) శుక్రవారం రాత్రి తీవ్ర భూ కంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం 632 మంది చనిపోయి ఉంటారని, 329 మందికి గాయాలయ్యాయని ఆదేశ అంతర్గత శాఖ వెల్లడించింది. గాయపడిన వారిలో 51 మంది పరిస్థితి విషమంగా ఉంది. మొరాకోలోని వాయవ్య టూరిస్టు ప్రాంతమైన మర్రాకేష్ కి 75కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రకం ఉందని గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై ప్రకంపనాల తీవ్రత 6.8 గా నమోదైంది.
ఉయ్యాల లా ఊగిపోయిన భవనాలు…
భూకంపం చాలా భయానకంగా వచ్చిందని, తమకు అది భూప్రకంపన అన్నది ముందు అర్ధంకాలేదని స్థానిక టూరిస్టు ఒకరు తెలిపారు. తామున్న భవనం ఒక్కసారిగా అటూ ఇటూ ఉయ్యాల మాదిరి ఊగిందని ఏం జరుగుతోందని బయటకు వచ్చి చూసేసరికే జనమంతా వీధుల్లో హాహాకారాలు చేస్తున్నారని పసిపిల్లలు ఏడుస్తుంటే ,పెద్దవారు అయోమయంలో పరుగులు తీస్తూ కనిపించారని అతగాడు చెప్పాడు. పదినిమిషాల పాటూ కరెంట్ సరఫరా, టెలిఫోన్ సేవలు స్తంభించాయి. ఆతర్వాత మళ్లీ వచ్చాయి. అయితే ప్రజలంతా ఇళ్లు వీడి బయట రోడ్ల మీదే కాలక్షేపం చేశారు.
భూ కంపం వచ్చే సమయానికి తాను మంచి నిద్రలో ఉన్నానని తన మంచం గాల్లో తేలిపోయినట్లు అనిపించిందని, ఎవరో బలంగా నెట్టేసినట్లు భావన కలిగిందని మైఖేల్ బిజెట్ అనే ఫ్రాన్స్ దేశస్థుడు తెలిపాడు. తాను భయంతో లేచి బయటకు వచ్చేసరికే ప్రజలంతా కకావికలమై పరుగులు తీస్తున్నారన్నారు.
భూకంపం వచ్చే సమయానికి తాను డ్రైవింగ్ లో ఉన్నానని ఫైసల్ బాదోర్ అనే మోరాకో వాసి తెలిపాడు. ఒక్కసారిగా నదికి గట్టు తెగి నీరు ఉథృతంగా ప్రవహిస్తే వచ్చే శబ్దం వచ్చిందని ఆ వెంటనే ఆర్తనాదాలు, ఏడుపులతో ఆ ప్రాంతం కంపించి పోయిందని తెలిపాడు. తాను వెంటనే డ్రైవింగ్ నిలిపేసి రోడ్డుపై నిలబడిపోయినట్లు తెలిపాడు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ చర్యలు తీసుకుంటున్నామని అందుకు తగ్గ ఆహార,వైద్య, ఆర్ధిక సదుపాయాలు కల్పిస్తున్నామని మొరాకో ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రుల ఆర్త నాదాలతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. గాయపడిన వారికి తక్షణం రక్తం అవసరమవుతుందని కాబట్టి పెద్ద మొత్తంలో రక్త దానం చేయాలని మొరాకో ప్రభుత్వం పిలుపునిచ్చింది.భూ కంప కేంద్రం సమీపంలో ని ఆల్ హౌజ్ పట్టణంలో ఓ కుటుంబం భూ కంప శిథిలాల్లో చిక్కుకుపోయింది.
టూరిస్టు స్పాట్ మర్రాకేష్ కు 44 మైళ్ల దూరంలో భూకంపం సంభవించిందని అధికారులు నిర్ధారించారు. కాబట్టి నష్టం భారీగా ఉండొచ్చని అమెరికా జియలాజికల్ సర్వే అంచనా వేసింది.భూ కంప తీవ్రతకు తీర ప్రాంతాలైన రాబట్, కసాబ్లాంకా, ఎస్సౌరియా బాగా దెబ్బతిన్నాయి.ప్రజలెవరూ ఇళ్లలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. అందరూ రోడ్లపైనే నిద్రిస్తున్నారు. భవనాలకు భవనాలే పేక మేడల్లా కూలిపోవడంతో శిథిలాలతో మర్రాకేష్ ప్రాంతం హృదయ విదారకంగా కనిపిస్తోంది.
భూ కంప జోన్ లో ఆరెంజ్ అలెర్ట్
భూకంపం సంభవించిన పరిసరాల్లో నష్టం తీవ్రంగా ఉండి ఉండొచ్చని ప్రకంపనల ప్రభావాన్ని అంచనావేసే యూఎస్ జీఎస్ సంస్థ భావిస్తోంది.ఆ పరిసరాల్ల తీవ్ర నష్టాన్ని తెలియ చేసే ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.ఈ ప్రాంతాల్లో భూ కంపాలకు కూలిపోయే ఇళ్లే ఎక్కువని అందులో నివసిస్తున్న ప్రజలు కూడా ఎక్కువేనని జియలాజికల్ సర్వే సంస్థ వ్యాఖ్యానించింది.
పొరుగు దేశాలకు పాకిన ప్రకంపనలు
గత దశాబ్ద కాలంలో ఇదే అతిపెద్ద భూకంపం. దీని తీవ్రత పొరుగు దేశాలైన ఆల్జీరియా లో కూడా కనిపించింది.2004లో ఈశాన్య మొరాకోలో (Morocco) అతిపెద్ద భూకంపం సంభవించింది. అందులో 628మంది చనిపోగా 926 మంది గాయపడ్డారు.అంతకుముందు 1980ల్లో ఆల్జీరియాలో రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రత కలిగిన భూకంపం ఏర్పడింది. ఇది చరిత్రలోకే అతిపెద్ద భూకంపంగా భావించారు. ఇందులో 2,500 మంది చనిపోగా, మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు.