వివాహేత సంబంధాలు దారుణ హత్యలకు కారణమవుతున్నాయి. ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో(Noida) జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. స్వయానా కొడుకే తండ్రిని, తాతని అత్యంత దారుణంగ హతమార్చడం సంచలనం సృష్టించింది. హత్యకు కారణాలు తండ్రికున్న వివాహేత సంబంధమే కారణమని ప్రాధమిక సమాచారం బట్టి తెలుస్తోంది.
గ్రేటర్ నోయిడాలో ని దన్ కౌర్ కుచెందిన భల్లు ఖెరా గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. హతులిద్దరూ స్వయంగా తండ్రి,కొడుకులు కావడం చంపింది స్వయంగా మనవడే కావడం విషాదం.. కుటుంబ ఘర్షణలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకోవడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. గ్రేటర్ నోయిడా (Noida) శివార్లలోని దన్ కౌర్ లో ఉన్న బల్లు ఖెరా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఒక ఫిలిం స్టూడియోలో ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..
విగతజీవులుగా కనిపించిన తండ్రీ,కొడుకు
విక్రమ్ జిత్ రావు, ఆతని తండ్రి రామ్ కుమార్ గత అర్ధరాత్రి అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయి కనిపించారు. ఇద్దరినీ నిద్రపోతున్న సమయంలోనే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు విక్రమ్ జిత్ రావుకున్న వివాహేతర సంబంధాలే కారణమని తెలుస్తోంది. హంతకుడు స్వయంగా కొడుకే కావడం మరింత సంచలనం సృష్టించింది.
తండ్రి నిర్లక్ష్య వైఖరితో రగిలిన పగ
21 ఏళ్ల జాస్మిన్ విక్రమ్ జిత్ రావుకు కొడుకు.. తండ్రి వివాహేతర సంబంధాలను కలిగి ఉండటం కుటుంబ సభ్యులను చులకనగా చూడటం , తరచుగా వారితో ఘర్షణ పడటం తో ఆవేశంతో రగిలిపోయిన జాస్మిన్ కన్న తండ్రిని కడతేర్చాడు. గత కొంత కాలంగా విక్రమ్ జిత్ రావు భార్యను చితక బాదుతూ, తూలనాడుతూ విసిగించే వాడని తెలుస్తోంది. అది తట్టుకోలేక ఆమె పిల్లలతో వేరుగా వెళ్లిపోయిందని తెలుస్తోంది.ఇద్దరికీ మధ్య విడాకుల వ్యవహారం నడుస్తోందని సమాచారం. అప్పటినుంచి విక్రమ్ జిత్ రావు వారితో ఉండకుండా తన తల్లి తండ్రుల కుటుంబంతో కలసి ఉంటున్నాడు.
అనుకోకుండా తాతను కూడా..
తమను సరిగా చూడని తండ్రిని హత్య చేయాలని పథకంతోనే కొడుకు జాస్మిన్ ఘటనా స్థలికి వెళ్లాడు. అప్పటికే అక్కడ మంచాలపై తండ్రి, ఆ పక్కనే తాత నిద్రిస్తూ కనిపించారు. జాస్మిన్ తాత ఈమధ్యనే రోడ్ వేస్ లో ఉద్యోగిగా రిటైర్ అయ్యాడు. అర్ధరాత్రి దాటాక గోడదూకి గొడ్డలితో ప్రవేశించిన జాస్మిన్ ఇద్దరూ పక్క పక్కనే నిద్రిస్తుండటాన్ని గమనించాడు… వెంటనే గొడ్డలితో తండ్రి ముఖంపైనా, గొంతుపైనా, తలపైనా విచక్షణారహితంగా వేటు వేశాడు. ఈ అలికిడికి నిద్ర లేచిన తాతను చూసి భయపడిన జాస్మిన్ తానే హంతకుడని బయటకు చెబుతాడన్న భయంతో తాత మీద కూడా గొడ్డలితో దాడి చేశాడు. అందుబాటులో ఉన్న సుత్తితో తలపై మోదడంతో ఆ ముసలి ప్రాణం అక్కడికక్కడే నేలకొరిగింది. తండ్రి, తాతను ఒకేసారి చంపేసిన జాస్మిన్ ఆపై గోడ దూకి పారిపోయాడు. జంట హత్యలకు వాడిన ఆయుధాలను పక్కనే ఉన్న బాత్ రూమ్ లో పడేసి గోడ దూకి ఇంటికెళ్లిపోయాడు. రక్తం అంటిన దుస్తులను శుభ్రం చేసుకుని ఏమీ ఎరగనట్లు పడుకున్నాడు. ఘటనాస్థలంలో మారణాయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వేలిముద్రల ఆధారంగా జాస్మిన్ హంతకుడని గుర్తించారు. గ్రేటర్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.