కేరళలో మళ్లీ నిఫా వైరస్(Nipah Virus) జాడలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇద్దరు అసహజ మరణం పాలవడంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కోజీకోడ్ జిల్లాలో సోమవారం ఇద్దరు అసాధారణ స్థితిలో చనిపోవడంతో కేరళ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ నిన్న రాత్రి అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
జ్వరంతో చనిపోయిన మృతులు
ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు అధిక జ్వరంతో బాధపడుతూ చనిపోయారని అది నిఫా వైరస్(Nipah Virus) వల్లనే అని ప్రాథమికంగా తేలిందనీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మృతుల్లో ఒకరి బంధువు పరిస్థితి కూడా వికటించడంతో ఆయన్ను ఇంటన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదికాక మరో ముగ్గురు కూడా తేలికపాటి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోంది. ఆగస్టు 30నుంచి బాధితులంతా ట్రీట్ మెంట్ లోనే ఉన్నారు.. మృతుల శాంపిల్స్ ను పరీక్షలకు పంపారు. గత ఐదేళ్లలో కోజీకోడ్ లో నిఫా వైరస్ వెలుగు చూడటం ఇది రెండవ సారి.
2018లోనూ 2021లోనూ కేరళలో నిఫా వైరస్ విజృంభించింది. 2018 మే 19న కోజీకోడ్ లో తొలి నిఫా వైరస్ కేసు బయట పడటంతో దక్షిణాదిన నిఫా జాడలు కనిపించినట్లయ్యింది.
అసలేమిటీ నిఫా వైరస్? (Nipah Virus)
కరోనా వైరస్ మనల్ని ఎంత భయపెట్టిందో అందరికీ తెలుసు.. ఆ వైరస్ తర్వతే వైరస్ లు ఇంత భయంకరంగా మనిషిని దెబ్బతీస్తాయా అన్న స్పృహ మనకి కలిగింది. నిఫా వైరస్ సాధారణంగా జంతువుల నుంచి వ్యాపిస్తుంది. అలాగే కలుషిత ఆహారం తిన్నా, అలాగే వైరస్ సోకిన వారిని తాకిన వారికీ వ్యాధి వ్యాపించే అవకాశముంది. నిఫా వైరస్ సోకిన వారిని తీవ్రమైన అనారోగ్యం వేధిస్తుంది. పైకి లక్షణాలు కనిపించకపోయినా ఎక్కువ మోతాదులో జ్వరం రావడం, అతి నీరసం మనిషిని వేధిస్తాయి. వైరస్ ఉథృతంగా ఉంటే ఛాతీ పట్టేసినట్లయి ఊపిరి సంబంధ సమస్యలు తలెత్తుతాయి. అరుదుగా మెదడు వాపు వ్యాధికి దారి తీస్తుంది. మెడ పట్టేయడం,తీవ్రమైన గందరగోళం,మతి స్థిమితం లేని ఆచనలతో సతమతమవుతారు. కొందరిలో స్పర్శ కోల్పోతారు. శరీరంలోకానీ, ముఖంలో కానీ కొన్ని కండరాలు పనిచేయని స్థితికి చేరుకుంటాయి. అలాగే కొందరిలోఅసాధారణ కదలికలుకనిపిస్తాయి. కొందరిలో కండరాల నొప్పులు వేధిస్తాయి. అలాగే మాట తడబడటం, సరిగావినిపించకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి సరైన చికిత్స చేయకపోతే మనిషి ప్రాణాలు పోతాయి.
నిఫా వైరస్ జంతువుల్లోనూ ప్రాణాలు పోయే పరిస్థితిని కల్పిస్తుంది. పందులు, ఇతర పశు, పక్ష్యాదులకు ఈ వ్యాధిసోకితే సామూహిక మరణాలు ఉంటాయని, ఆర్థికంగా రైతులు నష్టపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది.కరోనా వైరస్ లాగా నిఫా వైరస్ కు కూడా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ,మందు అంటూ లేదు. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడంతో పాటు నేలరాలిన పళ్లను తినకూడదు. అలాగే పందులను జనావాసాల్లో మేపడం లాంటివి చేయకూడదు. అలాగే కొన్ని రకాల పళ్లను తినే కీటకాలు కూడా మన పరిసరాల్లో లేకుండా చేసుకోవాలి..