TDP
చంద్రబాబుకడిగిన ముత్యంలా బయటకొస్తారంటున్నారు నందమూరి బాలయ్య… ఆరునెలలు ఆగు జగన్… అంతరిక్షంలోఉన్నా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ బాలయ్య సీఎం వైఎస్ జగన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు అరెస్టు తదనంతరం పార్టీ శ్రేణుల్లో ఆవరించిన నిస్తేజాన్ని తరిమి కొట్టేందుకు బాలకృష్ణ రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది.
కకావికలమైన టీడీపీ కేడర్ TDP
ఏపి స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ లో ఉండటంతో టీడీపీ శ్రేణులు నాయకత్వ లేమితో బాధపడుతున్నాయి. అందుకే ఈ ఇబ్బందిని తొలగించేందుకు ఆగమేఘాల మీద బాలకృష్ణను రంగంలోకి దింపారు. స్కిల్ స్కామ్ తోపాటు మరిన్ని స్కామ్ లు బయటకు తీసే ఆస్కారం ఉండటం, అందులో లోకేష్ పేరు కూడా ఉంటుందని వైసీపీ నేతలు ముందే హింట్ ఇస్తున్న తరుణంలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. భవిష్య కార్యాచరణను రూపొందించేందుకు బాలకృష్ణతో పరిస్థితిని సమీక్షించారు.
టీడీపీ అగ్రనేతలందరూ కేసుల ఊబిలో చిక్కుకునే అవకాశం ఉన్నందున బాలకృష్ణ పార్టీ పగ్గాలు అనధికారికంగానైనా స్వీకరించే ఛాన్స్ కనిపిస్తోంది.తన సినిమాల షూటింగ్ షెడ్యూల్ ను బాలకృష్ణ రద్దు చేసుకుని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. సీనియర్ నేతలు యనమల, కంభంపాటిరామ్మోహన్ రావు, లాంటి సీనియర్లతో సమావేశమయై భవిష్యత్ కార్యాచరణపై ఓ ప్లాన్ రచించాలని నిర్ణయానికొచ్చారు. తెలుగు దేశం పెద్ద దిక్కు చంద్రబాబు జైలు పాలవడం, యువగళం లోకేష్ తండ్రి కోసం రాజమండ్రిలోనే క్యాంప్ వేయడంతో పార్టీని నడిపించే నేతలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అండగా నిలవాలని బాలయ్య తో సహా కుటుంబ సభ్యులు, బంధువులు రంగంలోకి దిగారు. చంద్రబాబును అక్రమ కేసుల్లో ఇరికించారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు గతంలో ఎన్టీఆర్ చైతన్య రథంలో తిరిగినట్లు రాష్ట్రమంతా తిరిగితే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీ నేతల మధ్య జరిగినట్లుగా తెలుస్తోంది.
కేసులతో ఉక్కిరి బిక్కిరి…
ఏపీ స్కిల్ స్కామ్ నుంచి బెయిల్ పొంది చంద్రబాబు బయటకొచ్చినా ఆయన ఇప్పట్లో ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఆయన తీసుకున్ననిర్ణయాలు, చేసిన చర్యల ఆధారంగా మరిన్ని కేసులు వెలుగు చూడనున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, పుంగనూరు అల్లర్ల కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి అసైన్డ్ లాండ్య్స్ వ్యవహారం, ఈఎస్ ఐ స్కామ్, ఐటీ నోటీసులు ఇలా ఒక దాని తర్వాత మరోటి వెంటాడబోతున్నాయి.
స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కామ్ ఈ రెంటిలోనూ లోకేష్ పాత్ర ఇంకా తెరపైకి రాలేదు. వస్తే లోకేష్ ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇప్పట్లో టీడీపీ పార్టీ కోసం చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంది. అందుకనే పార్టీ నేతలు బాలయ్యను బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నారు. పార్టీకోసం ఏం చేయమన్నా సిద్ధమంటూ బాలయ్య అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టారు.
చంద్రబాబు స్థానంలో పార్టీ పగ్గాలు టెంపరరీగానైనా చేపట్టేందుకు బాలయ్య ఉత్సాహం చూపుతుండటంతో భవిష్య కార్యాచరణపై బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నారు. చంద్రబాబు పొలిటికల్ కెరీర్, 40 ఏళ్ల పాటు సేవలను ప్రజలకు వివరించడమే కాదు, వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పేందుకు రాష్ట్రమంతా బాలయ్య తిరుగుతానని స్పష్టం చేసినట్లు సమాచారం.
కనీసం ఇలాగైనా… TDP
టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ అసలైన వారసులకు దక్కాలన్నది దివంగత ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్. ఇప్పుడు చంద్రబాబు జైలు పాలు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో, కొంతకాలం పాటైనా బాలయ్య పార్టీ పగ్గాలు స్వీకరించక తప్పని పరిస్థితి ఎదురయ్యింది. ఇది ఎన్టీఆర్ అభిమానులకు సంతోషాన్నిచ్చే అంశం.