KIM
ఉత్తరకొరియా అధినేత కిం జోంగ్ ఉన్ గురించి తెలియని వారుండరు. ప్రపంచంలోనే అతిపెద్ద నియంత.. మూర్ఖుడు. అణ్వస్త్రాలు, జీవాయుధాల తయారీ అంటూ ప్రపంచ దేశాలను భయపెడుతుంటాడు. అత్యాధునిక సాంకేతిక పరిజ్నానంతో మిస్సైళ్లు గట్రా తయారు చేస్తుంటాడు. అటు అమెరికాను, దక్షిణ కొరియాను అప్పుడప్పుడు హడలెత్తిస్తుంటాడు…అలాంటి కిమ్ జోంగ్ ఎట్టకేలకు రైలు ప్రయాణం చేశాడు. అదీ మాస్కోకి. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను వ్లాడివోస్తాక్ లో కలసి ఒక సదస్సులో పాల్గొనడం కోసం అధ్యక్షుల వారు బయల్దేరారు.
సాధారణంగా ఇవాళ,రేపు ప్రయాణాలంటే అత్యుధునిక స్పెషల్ ఫ్లైట్ లే.. దేశాధినేతలు ప్రయాణమంటే వాడేవి వ్యక్తిగత ఫ్లైట్లే.. కానీ కిమ్ మాత్రం విమానం ఎక్కడు.. ఆయనకు విమానమంటే భయం… ఎవరైనా కూల్చేసి చంపేస్తారేమోనని . ఎక్కడకు వెళ్లినా నేలపై ప్రయాణమే సేఫ్ అనుకుంటాడు ఆయన. సాధారణంగా ఏ దేశాలకీ వెళ్లే అలవాటు లేని కిమ్ నాలుగేళ్ల తర్వాత, అదీ కోవిడ్ పాండమిక్ తర్వాత దేశం బయటకు కాలు పెట్టాడు.
2011లో కొరియా పగ్గాలు చేపట్టాక కిమ్ ఏడు సార్లు మాత్రమే విదేశీ ప్రయాణాలు చేశాడు.. దక్షిణకొరియాకు రెండు సార్లు అదీ రైలులోనే వెళ్లాడు.
20 గంటల సుదీర్ఘ ప్రయాణం (KIM)
ఇప్పుడు రష్యాకు కూడా రైలులోనే బయల్దేరాడు. దాదాపు 1,180కిలోమీటర్ల దూరం 20 గంటల ప్రయాణం తర్వాత రష్యా చేరుకున్నాడు. ఉత్తర కొరియా నేతలు సాధారణంగా ఎక్కడికి వెళ్లినా కూర్చోరు. నిలబడే వెళుతుంటారు. కిమ్ కూడా 20 గంటలు అలా నిలబడే రైలు జర్నీ చేశాడు. గ్రీన్ అండ్ ఎల్లో లో ఉన్న ఓ ప్రత్యేకమైన రైలు కేవలం ఆయన ప్రయాణం కోసమే రూపొందించారు. రైలుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం వల్ల రైలు వేగం గంటకు 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలదు. ఈరైలులో 90 క్యారేజ్ లు ఉన్నాయి. కిటికీలన్నీ బయటి వారికి ఏమాత్ర కనిపించకుండా రంగు పూసి ఉంటాయి.
నోరూరించే వంటకాలు..మద్యం (KIM)
కిమ్ జోంగ్ తినేందుకు తాజా పీతలతో కూడిన వంటకాలు, ఫ్రెంచ్ బోర్డెక్స్, బర్గుండీ బ్రాండ్ రెడ్ వైన్ నిల్వలు అపారంగా ఉంచుతారు. ఈ రైలులో కాన్ఫరెన్సు రూములు, ఆడియన్స్ ఛాంబర్లు, బెడ్ రూమ్స్, శాటిలైట్ ఫోన్స్, ఫ్లాట్ స్క్రీన్ టీవీ సెట్లు ఉంటాయి. కిమ్ కు చేరాల్సిన సమాచారం అంతా ఎప్పటికప్పుడు ఆ టీవీ స్క్రీన్ లపై కనిపిస్తుంటుంది.
రైలు ప్రయాణం ఎంత భద్రం?
కిమ్ రైలును కదిలే రాజసౌధం అని ముద్దుగా పిలుస్తారు. దీనికి బుల్లెట్ ఫ్రూఫ్ విండోలు, బాంబు దుర్బేధ్యమైన వాల్స్, ఫ్లోరింగ్ ఉంటుంది. ఎలాంటి పేలుడు జరిగినా లోపల వ్యక్తులకు ఏమీ కాకుండా అవి సంరక్షిస్తుంటాయి. వీటికి ఎదురు దాడి చేసేందుకు ఆటోమేటిక్ అటాక్ వెపన్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఎగిరిపోడానికి ఓ హెలికాప్టర్ కూడా ఉంటుంది. ఈ అదనపు భద్రతా ఏర్పాట్ల వల్లనే కిమ్ రైలు వేగం గంటకు 50 కిలోమీటర్ల లోపే ఉంటుంది. రైలు నెమ్మదిగా ప్రయాణించినా అందులోవసతుల విషయంలో విమానానికి మించి సౌకర్యవంతంగా ఉంటాయి. దాడులే జరిగితే సురక్షితంగా బయటపడేందుకువీలుగా టెక్నాలజీ,అమరిక ఉంటుంది.
రైలు ప్రయాణాలే ఆనవాయితీ (KIM)
కిమ్(KIM) తాత కిమ్2 సంగ్ కాలం నుంచి దూర ప్రయాణాలంటే రైళ్లే వాడటం అలవాటు. వియత్నాం అయినా, యూరప్ అయినా వారు రైల్లోనే వెళతారు. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ 2 కి విమానాలంటే హడల్.. పాంగ్యాంగ్ నుంచి మాస్కోకు 2001లో 20 వేల కిలోమీటర్ల దూరాన్ని24 రోజుల పాటు ప్రయాణించి వెళ్లిన ఘనుడు.
కిమ్ ప్రయాణానికి బయల్దేరాడంటే అతనితోపాటు సెక్యూరిటీ ఏజెంట్లుకూడా వెంట ఉంటారు. ప్రతీ రైల్వే స్టేషన్ లోనూ సేఫ్టీ ఏర్పాట్లు చూస్తుంటారు. తాత, తండ్రి బాటలోనే ప్రస్తుత కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా రైలు ప్రయాణాలే చేస్తున్నాడు. అత్యాధునిక మారణాయుధాలతో కూడిన రైలు విమానం కంటే సేఫ్ అని కిమ్ నమ్ముతున్నాడు.
గతంలో కూడా కిమ్ చైనా భూభాగంమీంచి వియత్నాం ప్రయాణించి అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను కలుసుకున్నాడు.
ఈ ప్రయాణం రెండున్నర రోజులు పట్టింది. పాంగ్యాంగ్ లో కిమ్ కోసం ప్రత్యేక రైళ్ల తయారీ ఫ్యాక్టరీ ఉంది. ఇవి అసలు, నకిలీ రైళ్లు కూడా తయారు చేస్తాయి. అధక్షుడు ఏ రైల్లో ఉన్నాడో తెలీకుండా ప్రత్యర్ధులను కన్ఫ్యూజ్ చేసేందుకు ఇలా చేస్తుంటారు.
ఉక్రెయిన్ యుద్ధం కోసమే.
ఇంతకీ కిమ్ రష్యా ఎందుకు వెళుతున్నాడంటే ఉక్రెయిన్ తో యుద్ధంలో అలసిపోయి నష్టపోయిన రష్యాకు అత్యాధునిక మందుగుండు సామాగ్రి, క్షిపణులు, ఆయుధాల అవసరం ఉంది. వాటి సరఫరాకు సంబంధించిన సమావేశంలో పాల్గొని ఒప్పందం కుదుర్చుకోడానికే కిమ్ వెళ్లాడు.