(AP-TS)
తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగడం లేదా? ఐటీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అవుననే అనుకోవాలి. షెడ్యూల్ ప్రకారం తెలంగాణకు డిసెంబర్లో ఎన్నికలు జరగాలి. అంటే అక్టోబర్ లో నోటిఫికేషన్ రావాలి.కానీ ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకూ దీనిపై చడీ చప్పుడూ చేయడంలేదు.. పెదవి విప్పడం లేదు.. పైగా దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు తప్పవని కేంద్రం అదే ఆలోచనలో ఉందని పుకార్లు షికారు చేస్తున్న వేళ ఈసీ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడం వల్ల తెలంగాణకు ఇప్పట్లో ఎన్నికలు ఉండవు అన్న అనుమానాలు కలుతున్నాయి. తెలంగాణకు అక్టోబర్ లో నోటిఫికేషన్ వచ్చే ఆస్కారం కనిపించడం లేదంటున్నారు కేటీఆర్.కాబట్టి ఈ ఎన్నికలు కూడా ఏప్రిల్, మేనెలల్లో జరిగే ఛాన్స్ ఉందని కామెంట్ చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తర్వాతే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ప్రత్యేక సమావేశాలు ఎందుకు? (AP-TS)
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టులోనే ముగిశాయి. ఇక నవంబర్ లో శీతాకాల సమావేశాలు జరపాల్సి ఉంది. అయితే కేంద్రం అనూహ్యంగా ఈనెల 18 నుంచి 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలని నిర్ణయించింది. అంటే సెషన్స్ ముగిసిన 40 రోజుల్లోనే మళ్లీ సెషన్స్ ఏర్పాటు చేయడం దేనికోసం? కారణం ఏంటన్నది ఇప్పటి దాకా స్పష్టం చేయలేదు. అయితే జమిలి ఎన్నికలపైనా, దేశం పేరు మార్పు పైనా ఒక నిర్ణయం తీసుకుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బీఆర్ ఎస్ వ్యూహాత్మక భేటీ
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల కారణంగా ఎలాంటి వైఖరి అనుసరించాలన్న అంశంపై చర్చలు జరిపేందుకు ఈనెల 15న ప్రగతిభవన్ లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరుగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్లమెంటులో ఏం మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి అన్నది ఎంపీలకు సూచన చేస్తారు. మొన్నటి వరకూ తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అటు కేసీఆర్, ఇటు బీజేపీ పెద్దలు కూడా చెబుతూ వచ్చారు.
అయితే మధ్యలో జమిలి ఎన్నికల విషయం తెరపైకి రావడంతో తెలంగాణ ఎన్నికల అంశం కూడా చర్చకు వస్తోంది.కేటీఆర్ మాత్రం ఏప్రీల్ లో జరగవచ్చునంటూ అంచనావేశారు.
ఏపీలో ముందస్తుపై హడావుడి
లండన్ నుంచి ఏపీకి తిరిగి వచ్చిన సీఎం జగన్ వస్తూనే అనేక సమావేశాల్లో బిజీ బిజీగా కనిపించారు. ముందస్తు ఎన్నికలు తప్పవన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఉదయం నుంచి ఆయన మంత్రులతోనూ,కేబినెట్ భేటీతోనూ సమావేశాల్లో మునిగి తేలారు. రేపు జగన్ ఢిల్లీకి బయల్దేరుతున్నారు. ప్రధాని మోడీతోనూ, హోం మంత్రి అమిత్ షా తోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారు. జమిలి ఎన్నికలు జరిగితే ఏపీకి కూడా ముందే ఎన్నికలు వస్తాయి కాబట్టి దీనిపై క్లారిటీ తీసుకోడానికే జగన్ ఢిల్లీకి వెళుతున్నారన్నది ఒక టాక్..
ఇప్పటికే వైసీపీ నేతలను సిద్ధంగా ఉండమని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలపై అటు కేటీఆర్ వాదన ఒకలా,ఇటు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అంచనాలు మరోలా ఉన్నాయి. ఏది ఏమైనా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మాత్రమే ఎన్నికల అంశంపై స్పష్టత వచ్చేఅవకాశాలు కనిపిస్తున్నాయి.