ఇంటి దొంగని(Theft) ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నది సామెత.. ఒక్కోసారి నమ్మిన వాళ్లే నట్టేట ముంచుతారు. తడిగుడ్డలతో గొంతు కోస్తారు. ఇలాంటి అనుభవమే ఎదురైంది ఓ బంగారం వ్యాపారికి. నాలుగేళ్లు నమ్మకంగా పనిచేసిన సిబ్బందే చేతి వాటాన్ని చూపించి భారీ ఎత్తున బంగారం చోరీకి ప్లాన్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరిజిల్లా తణుకులో ఓ బంగారం వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది.ఇందులో కిలో బంగారంతో పాటు లక్ష రూపాయల నగదు, మరికొన్ని ఆభరణాలను దొంగల ముఠా తస్కరించింది.
తణుకులో భారీ చోరీ (Theft)
తణుకులో నరేంద్ర సెంటర్ లో రేణుక టెస్టింగ్ అనే బంగారం దుకాణం ఉంది.. ఇల్లు,షాపు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. మంగళవారం షాపుకు శెలవు దినం కావడంతో షాపును మూసేసిన యజమాని పై అంతస్థులో తన ఇంట్లో ఉన్నాడు. సరిగ్గా అర్ధరాత్రి దాటాక సూరజ్ అనే వ్యక్తి నలుగురు సహచరులతో ఇంట్లోకి ప్రవేశించాడు. ముఖానికి మాస్కులు ధరించి ఉండటంతో యజమాని వారిని గుర్తు పట్టలేకపోయాడు. యజమానిని,ఇతర కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి, తాళ్లతో బంధించి షాపు తాళాలు అడిగి తీసుకున్నాడు సూరజ్..అడ్డు చెప్పిన యజమాని, కుటుంబ సభ్యులను దారుణంగా చితకబాదాడు. అనంతరం షాపులోకి చొరబడి కిలో బంగారం, లక్ష రూపాయల నగదు, మరికొన్ని ఆభరణాలను దొంగలించి పారిపోయారు.
నిందితుడు తెలిసిన వాడే…
నిందితుడు సూరజ్ కు షాపు యజమాని కి పాత పరిచయాలున్నాయి. గతంలో షాపులో చేసినవాడే అవడంతో షాపు ఆను,పానులన్నింటినీ సూరజ్ ముందే గ్రహించాడు. కొద్ది రోజుల క్రితమే షాపులో పనిచేయడం మానేసినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే సహచరులతో కలసి చోరీకి పన్నాగం పన్నాడు. చోరీ సొత్తును సులభంగా తరలించడానికి ఒక కారును కూడా వీరు అద్దెకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లోకి చొరబడగానే కత్తులతో బెదిరించి కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచారు.ఆపై తాళాలు లాక్కుని దుకాణంలోకి చొరబడ్డారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేయడంతో ఉదయం వరకూ విషయం బయటవారెవరికీ తెలియలేదు. ఉదయం వ్యాపారి చోరీ సమాచారాన్ని పోలీసులకు అందించాడు. సూరజ్ అనే తన దగ్గర పనిచేసిన వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపాడు. వ్యాపారి ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
తాడేపల్లిగూడెం డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితి పై దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు. చోరీకి పాల్పడిన సూరజ్ మహారాష్ట్రలోని కుబార అనే గ్రామానికి చెందిన వాడుగా తెలుస్తోంది. దొంగల కోసం పోలిసులు ముమరంగా గాలిస్తున్నారు.తణుకు పట్టణంలో ఈసంఘటన సంచలనం సృష్టించింది. బంగారు నగల దుకాణంలో ఇంత పెద్ద భారీ చోరీ గతంలో ఎన్నడూ జరగలేదని స్థానికులు చెబుతున్నారు. పైగా దొంగలు షాపు యజమాని కుటుంబాన్ని అత్యంత దారుణంగా చితకబాదడం, బీభత్సం సృష్టించడంపై స్థానికులు భయపడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇళ్లలో, దుకాణాల్లో పనివారిని పెట్టుకునేటప్పుడు అన్ని వివరాలు తీసుకుని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పనివాళ్లే దొంగలుగా మారి దాడులు చేయవచ్చని అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.