BJP
ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో కొత్త రాజకీయ పొత్తు పొడిచింది. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ గా ఉండటంతో తెలుగుదశం, జనసేన కొత్త నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి.టిడీపీతో కలిసేందుకు ఎప్పటినుంచో తహతహలాడుతున్న పవన్ తన ముసుగు తొలగించారు. స్నేహ బ్యారక్ లో ఇవాళ చంద్రబాబుతో 40 నిమిషాల ములాఖత్ అనంతరం బయటకువచ్చి టీడీపీతో కలసి ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. ఇన్నాళ్లూ బీజేపీతో మిత్రత్వంతో ఉంటూ ఇప్పుడు హటాత్తుగా టీడీపీ వైపుకు పవన్ దూకేశారు. మరి బీజేపి పరిస్థితి ఏంటి? బీజేపి ఈ టీమ్ తో కలుస్తుందా? లేక ఒంటరిగానే ఉంటుందా? అన్నది తేలాలి..
పవన్ చిరకాల కోరిక…
జనసేనకు రాజకీయ అవగాహన లేని తనం అడుగడుగునా కనిపిస్తోంది.గత ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి దెబ్బ తిన్నాక బీజేపీ(BJP) తో కలిశారు పవన్. జనసేన మా మిత్ర పక్షం అని బీజేపీ కూడా చెప్పుకుంది. అయితే ఏపీలో బీజేపీకి సీట్లు సున్నా.. మనుగడే లేని పార్టీ పవన్ కున్న ఇమేజ్ తో కొంతైనా నెట్టుకు రావాలనుకుంది. కానీ జనసేన-బీజేపి కాపురం మొక్కుబడి తంతుగానే మిగిలిపోయింది. బీజేపీతో పవన్ తెగతెంపులు చేసుకోలేరు. అలాగని టీడీపీని తమ బంధంలోకి లాగలేరు.. మనసిక్కడ, తనువక్కడ అన్న చందంగా సాగుతున్న జనసేన ఇవాళ తెగించి నిర్ణయం తీసేసుకుంది. ఎన్డీఏలోకి టీడీపీని చేర్చాలన్నది పవన్ చిరకాల కోరిక.
ఆ నేపధ్యంలో టైమ్ దొరికినప్పుడల్లా అమిత్ షా, మోడీల దగ్గర చంద్రబాబు ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. మోడీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రతిపాదన పవన్ చేసినట్లు అందుకు మోడీ సీరియస్ అయినట్లు వార్తలొచ్చాయి. పొత్తులపై ఇప్పట్లో ఆలోచించవద్దని హై కమాండ్ దగ్గర ఒక వ్యూహం ఉందనీ మోడీ అన్నట్లు అప్పట్లోనే వార్తలొచ్చాయి. టీడీపీతో జత కట్టాలన్న తన మనసులో కోరికను అప్పటినుంచి బాహాటంగా వ్యక్త పరిచేందుకు తగిన అవకాశం, వేదిక రాక పవన్ కల్యాణ్ ఎప్పటినుంచో ఎదురు చూపులు చూస్తున్నాడు.. పలకరింపులు, పరామర్శలు, కరచాలనాలతో ఇంతకాలం గడిచిపోయింది. చంద్రబాబును కలిసే ఏ ఒక్క అవకాశాన్ని పవన్ వదులుకోలేదు. చివరికి మొన్న అరెస్టు టైమ్ లో కూడా విజయవాడకు రోడ్డు మార్గంలో వెళ్లాలని ప్రయత్నించి రోడ్లపై పడుకుని నానా విన్యాసాలూ చేశారు. తన కార్యాలయానికి తాను వెళుతుంటే అడ్డుకున్నారని పైకి బుకాయిస్తున్నా చంద్రబాబును కలవడమే లక్ష్యమన్నది అందరికీ తెలిసిన విషయమే..
బీజేపి ఏం చేయబోతోంది? (BJP)
చంద్రబాబు అరెస్టు వెనక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది సస్పెన్స్ గా ఉంది. చంద్రబాబు అరెస్టు వెనక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో బీజేపి వ్యూహం మార్చింది.. చంద్రబాబు అరెస్టు ఉదంతం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టి మళ్లించడానికి లిక్కర్ స్కామ్ ను తిరగదోడింది.
అందుకే మళ్లీ తిరగదోడారా?
సద్దుమణిగి పోయిందనుకుంటున్న లిక్కర్ కేసు మళ్లీ తెరపైకి తెచ్చింది. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు అందాయి. డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్ సైజ్ కిందే కవితకు నోటీసులిచ్చారని రాజకీయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏడాదినుంచి టీవీ సీరియల్ లా సాగుతున్న ఈ విచారణ ఎపిసోడ్ ఇంకెంత కాలం నడుస్తుందోనని కవిత కామెంట్ చేశారు. రాజకీయ కక్షతోనే తనకు నోటీసులు పంపించారన్నారు. దీనికి భయపడేది లేదని కూడా కవిత ప్రకటించారు. మొత్తం మీద పవన్ మరో సారి పప్పులో కాలేశారా? టీడీపీ ముందు జనసేన మోకరిల్లిందా? బీజేపీ ఈ నిర్ణయాన్ని సమర్దిస్తుందా? చూడాలి.. ఏం జరుగుతుందో.