రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడు(CBN) భద్రతపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయడానికి కారణమేంటి? మాజీ ముఖ్యమంత్రి, అందునా మావోయిస్టులనుంచి ప్రాణహాని ఉన్న వ్యక్తిని, 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని సెంట్రల్ జైలులో పెట్టడం దారుణమని టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయి.
మరోవైపు చంద్రబాబు దుర్భేధ్యమైన కోట లాంటి బ్లాక్ లో హాయిగా ఉన్నారని, ఆయన ప్రాణాలకు ఎలాంటిప్రమాదం లేదని ఆయన భద్రతలో ఎలాంటి డొల్లతనం లేదని ప్రభుత్వ వర్గాలు బలంగా చెబుతున్నాయి. భద్రతా కారణాల రీత్యా తనను హౌస్ రిమాండ్ కు పంపాలంటూ మొదట్నుంచి చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆరోపణలు చేస్తున్నారు.
ఇంకేం కావాలో చెప్పండి…
అయితే చంద్రబాబు కోసమే రాజమండ్రి సెంట్రల్ జైలులో స్నేహ బ్లాక్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. ఆ బ్లాక్ మాత్రమే ఆర్థిక నేరాలకు పాల్పడిన హై ప్రొఫైల్ వ్యక్తుల కోసం కేటాయించిన బ్లాకు కావడంతో ఆయనకు అత్యంత సురక్షితమైన ఆభవనాన్ని కేటాయించారు. ఆయనకు విశాలమైన గది, పడుకోడానికి మంచం, ఏసీ సౌకర్యం, చదువుకోడానికి పేపర్లు, వెస్ట్రన్ మోడ్ టాయిలెట్ తో సహా అన్ని అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చారు. ఆ భవనాన్ని చంద్రబాబు రావడానికి గంట ముందే పూర్తిగా శానిటైజ్ కూడా చేశారు. ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఇంటి లో వండే కుక్ తోనే ప్యాంట్రీ కార్ ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పించారు.
చంద్రబాబుకు టైమ్ టు టైమ్ భోజనం, అల్పాహారం, వేడి నీరు అన్నీ అందిస్తున్నారు. ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలకారణంగా జైలు ప్రాంగణంలో స్నేహ బ్లాకు కు ఎదురుగానే మెడికల్ డిస్పెన్సరీ కూడా కొత్తగా తెరిచారు. ఆయన ములాఖాత్ లో వచ్చిన వారిని కలుసుకోడానికి ప్రత్యేక గది కూడా ఉంది.. బాబు చుట్టూ నిరంతరం అంగరక్షకులు కొద్ది దూరంలో పర్యవేక్షిస్తూ ఉంటారు. వారిని దాటుకుని చీమ కూడా లోనికి వెళ్లే ఆస్కారం లేదు. ఆయన వ్యక్తిగత పనుల సహాయం కోసం ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని సహాయకుడిగా ఏర్పాటు చేశారు. నిరంతర పహారా,ప్రశాంతమైన వాతావరణం ఆయనకు కల్పిస్తున్నారు. మొన్న జైలు ప్రాంగణంలో ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను కూడా ఆయన సందర్శించారంటే జైలులో ఆయన బాగానే ఉన్నారని అర్ధమవుతోంది. ఆయన జైల్లో హాయిగా ఉన్నారని సకల రాచమర్యాదలూ కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆయనకు ఇంకేం సమకూర్చాలో సూచనలు చేస్తే అవి కూడా చట్టపరిధికి లోబడి అంద చేస్తామని తెలిపింది.
టీడీపీ అదే పాత పాట
మరోవైపు టీడీపీ శ్రేణులు మాత్రం ఆయనకు భద్రత కరువైందని ఆరోపణలు చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నాయి.
చంద్రబాబు(CBN) సతీమణి భువనేశ్వరి కూడా ఆయనకు భద్రత సరిగా లేదంటూ అనుమానాలు వ్యక్తం చేయడం రాజకీయం కోసమేనని వైసీపీ నేతలు అంటున్నారు.
సూపరింటెండెంట్ శెలవుపై రాద్ధాంతమెందుకు? (CBN)
చంద్రబాబు తో సన్నిహితంగా మెదులుతున్నారన్న ఆరోపణలున్న జైలు సూపరింటెండెంట్ ను శెలవుపై పంపించి నట్లు తెలుస్తోంది. అయితే ఆయన్ను కావాలనే తొలగించి మరొకరిని నియమించారంటూ టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. గతంలో జైలు సిబ్బందితోనూ, పోలీసులతోనూ చనువు పెంచుకుని నేరస్తులు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడటం, నిషేధిత వస్తువుల పై అనుమతులు పొందడం,దొంగచాటుగా నిషేధిత వస్తువులను తెప్పించుకోవడం లాంటివి జరిగినందునే జైలు అధికారులు ముందు జాగ్రత్తగా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. జైలు అధికారులు రిమాండ్ లో ఉన్నవారితో చనువు పెంచుకుంటే దానివల్ల తలెత్తే రాజకీయ పరిణామాలు, భద్రతా పరమైన సమస్యలు కొత్త తలనొప్పులు తెస్తాయి. ప్రభుత్వ వాదన ఇలా ఉండగా.. టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబుకు భద్రత కరువైందంటూ గట్టిగా వాదన చేస్తున్నాయి.
అయితే వారు ఆరోపిస్తున్నంత అభద్రమైన వాతావరణంలో చంద్రబాబు లాంటి వ్యక్తిని ఉంచుతారా? అసలు ఉంచడం సాధ్యమేనా? జరగరానిది ఏదైనా జరిగితే ఆ చెడ్డ పేరు ప్రభుత్వానికి రాదా? అసలే ఎన్నికల టైమ్ లో ఆవేశకావేశాలు హద్దులు మీరుతున్న టైమ్ లో ఎవరూ కూడా కోరి ఇలాంటి గొడవలు కొని తెచ్చుకుంటారా?
NSG నివేదిక (CBN)
ఇదిలాఉండగా చంద్రబాబు అరెస్టు, జైలుకు తరలింపు నేపధ్యంలో కేంద్ర హోం శాఖకు ఎన్ ఎస్ జీ నివేదిక అందించింది.
సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట వరకూ జరిగిన పరిణామాలు,
ఏసీబీ కోర్టులో రిమాండ్ చేయడం, జైలులో భద్రత లాంటి అంశాలన్నింటినీ నివేదికలో వెల్లడించింది.
ఎన్ ఎస్ జీ రక్షణలో ఉన్న ఆయన్ను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు అంశాన్నీ ప్రస్తావించింది. అయితే చంద్రబాబు కావాలనే రోడ్డు మార్గం ఎంచుకున్నారన్న విషయాన్ని కూడా ఎన్ ఎస్ జీ తన నివేదికలో పొందు పరిచిందో లేదో తెలీదు.