- CWC
తెలంగాణ రాజకీయం రంజుగా మారుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్రయాంగ్యులర్ వార్ లో ఎవరు గెలుస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా… కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉందన్నది తాజాగా సర్వేలు చెబుతున్న మాట. అయితే అక్కడున్నది కేసీఆర్, అందులోనూ, ఎలక్షన్ రాజకీయం మొత్తం తెలిసిన నేత. కాబట్టి చివరి నిమిషంలో తమ పార్టీ చేసే జిమ్మిక్కులు, అస్త్రాలు ఆ పార్టీని గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో అదే మేజిక్ ఇక్కడా పునరావృతమవుతుందన్న ఆశలు కాంగ్రెస్ పార్టీని ఎవర్ ఎనర్జిటిక్ మూడ్ లో ఉంచుతున్నాయి. పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతోంది. ఒకవేళ గెలిస్తే సీఎం అభ్యర్ధి దగ్గర మళ్లీ గొడవలు జరగడం కామన్.. కానీ ఇప్పటికది అప్రస్తుతం. బీఆర్ ఎస్ పై వ్యతిరేకత, దీనికి తోడు చేరికలు తమకి బాగా సాయపడతాయని కాంగ్రెస్ హై కమాండ్ నమ్ముతోంది. అందుకే ఏకంగా సీడబ్ల్యుసి సమావేశాలకు హైదరాబాద్ నే వేదికగా చేసుకున్నారు. రేపు (ఆదివారం) తుక్కు గూడలో జరిగే భారీ బహిరంగ సభ సాక్షిగా పెద్ద ఎత్తున చేరికలకు ప్లాన్ చేశారు. మాజీ మంత్రి, ఖమ్మం దిగ్గజం తుమ్మల నాగేశ్వరరావు మొదలుకొని,మైనంపల్లి సహా అనేక మంది రేపు కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకుంటారన్న ప్రచారమూ జరుగుతోంది.
తాజ్ కృష్ణా లో అగ్రనేతల భేటీ CWC
హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్ లో రేపటినుంచి రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికోసం ఇప్పటికే సోనియా,రాహుల్, ప్రియాంక, ఖర్గే సహా అగ్రనేతలందరూ తరలి వస్తున్నారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల అంశం, జమిలి ఎన్నికలు వస్తే ఏం చేయాలి అన్న దానిపైనా విస్తృతంగా చర్చలు జరుగుతాయి. సాయంత్రం తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభకోసం లక్షల సంఖ్యలో జనాన్ని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ స్థాయి అగ్ర నేతలు పాల్గొనే ఈ సభలో సోనియా మాట్లాడటమే కాకుండా ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటిస్తారు. కర్ణాటకలో లాగా కాంగ్రెస్ గెలుపుకి ఇదే కీలకమైన అడుగుగా నేతలు భావిస్తున్నారు.తెలంగాణలో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ చేస్తున్న ఈ భారీ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
రేపు షర్మిల కండువా కప్పుకుంటారా? CWC
ఇక వైఎస్ తనయ, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా సోనియా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్టీపి పెట్టి సింగిల్ గానే బరిలోకి దిగి కేసీఆర్ ను మట్టి కరిపిస్తామని చెప్పిన షర్మిల ఆతర్వాత తన సత్తా ఏంటో తెలుసుకున్నారు. పార్టీని ఇక నడిపించే శక్తి, యుక్తి కరువై కాంగ్రెస్ లో విలీనానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె రెండు సార్లు ఢిల్లీ వెళ్లి హై కమాండ్ ను కలిశారు.
షర్మిల నిర్ణయాన్ని వైఎస్సార్టీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయని అయినా ఆమె అడుగు ముందుకే వేస్తున్నారని టాక్. మరోవైపు వైఎస్ తనయగా షర్మిల కున్న చరిష్మా పార్టీకి ఉపయోగపడుతుందని పార్టీ అనుకుంటోంది. కానీ వైఎస్ హయాంలో ఆయన వ్యతిరేక వర్గంగా ముద్రపడిన వీహెచ్ లాంటినేతలు ఆమె రాకను వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ టీమ్ కూడా అయిష్టంగానే ఉంది.
పాలేరు పైనా నో క్లారిటీ
తన సొంతపార్టీ తరపున పాలేరు నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని షర్మిల మొదట అనుకున్నారు. అక్కడ ఇల్లు కూడా కట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే తాజా సమీకరణల రీత్యా తుమ్మల పాలేరు సీటు అడుగుతున్నారని అందుకు పార్టీ పెద్దలు ఓకే చేశారనీ మరో ఫీలర్ వినిపిస్తోంది. దాంతో షర్మిల అసెంబ్లీ కి పోటీపై స్పష్టత రాలేదు.
కర్ణాటక పీసీసీచీఫ్ డీ.కె. శివకుమార్ నేతృత్వంలో షర్మిలతో జరిగిన చర్చల ప్రకారం ఆమెను కర్ణాటక నుంచే రాజ్యసభకు పంపుతారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లో పనిచేయడానికే ఇష్టపడుతున్న షర్మిల ఏపీ జోలికి వెళ్లేందుకు ఎందుకో ఇష్టపడటం లేదు. అయితే రేవంత్ వర్గం ఆమెను ఏపీలో పనిచేయాలని కోరుతోంది. షర్మిలను పార్టీలోకి తీసుకుంటే ఆమెకు ఏ హోదా కట్టబెడతారన్నదీ తేలలేదు. ఈ వివాదం ఓ కొలిక్కి వస్తే రేపటి ఆమె చేరికపై క్లారిటీ వస్తుంది.