(IND vs SRI)
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఈ రోజు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగే టైటిల్ మ్యాచ్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక కంటే భారత్ చాలా బలమైన జట్టుగా పరిగణిస్తున్నారు.
ఆసియా కప్ 2023 వేదికగా భారత్, శ్రీలంక మరో సారి టైటిల్ పోరులో తలపడబోతున్నాయి. ఓవైపు అత్యధికంగా 13సార్లు ఫైనల్కు చేరిన శ్రీలంక మరో వైపు 7 టైటిళ్ల తో ఆసియాకప్ లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్. ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికరమైన ఫైనల్కు ఈ రోజు తెర లేవనుంది.
2010 తర్వాత భారత్, శ్రీలంక జట్లు తొలిసారిగా తలపడబోతున్నాయి. ఇరు దేశాల మధ్య చివరిసారి జరిగిన ఆసియా కప్ 2010ఫైనల్ మ్యాచ్లో లంకను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా 81 రన్స్ తేడాతో ఓడించింది. ఆ తర్వాత 2016, 2018 టోర్నీల్లో భారత్ గెలిచినా అది శ్రీలంకపై కాదు. ఇలా 13 సంవత్సరాల తర్వాత ఇరు జట్ల మధ్య జరగబోతున్న ఆసియా కప్ టోర్నీలో విజేతగా ఎవరు నిలుస్తారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
అందరి మదిలో ఉన్నది ఒక్కటే ప్రశ్న టైటిల్ కోసం రోహిత్ లంకను దాటగలడా సెప్టెంబర్ 12న జరిగిన సూపర్ 4 క్లాష్లో యువ ఆటగాళ్లతోనే లంక జట్టు ఓడినా భారత్కి గట్టి పోటీ ఇచ్చింది. ముఖ్యంగా యువ బౌలర్ దునిత్ వెల్లలాగే 5 వికెట్లు, 42 పరుగులతో రోహిత్ సేనపై చెలరేగాడు. నేటి ఫైనల్ మ్యాచ్కి మహీష్ తీక్షణ దూరం అయినా ధోని శిష్యుడైన మహీష పతిరణ లంక జట్టులోనే ఉన్నాడు. ఇక కీలక ప్లేయర్లు గాయాలతో దూరమవడంతో ఉన్నవారితోనే మెరుగైన ప్రదర్శన చేస్తోంది శ్రీలంక. సూపర్-4లో ఉత్కంఠ పోరులో పాక్ను ఓడించి ఫైనల్ కు వచ్చింది. అయితే ఈ రోజు మ్యాచ్కు ఆ జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ అందుబాటులో లేడు. తీక్షణ గాయంపై మ్యాచు అనంతరం స్కానింగ్ తీయించగా.. గాయం తీవ్రమైనదిగా తేలినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. గాయం కారణంగా అతడు ఫైనల్కు దూరమైనట్లు తెలిపింది. మహీశ్ తీక్షణ స్థానంలో సహన్ అరాచిగేను రీప్లేస్ చేసినట్లు జట్టు తెలిపింది. తీక్షణకు తమ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందించనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.
కీలక సభ్యులతోనే బరిలోకి (IND vs SRI)
గత మ్యాచ్లో సూపర్-4 ఆఖరి మ్యాచ్ 5 మార్పులతో బరిలోకి దిగి అనూహ్యంగా ఓటమిపాలైన భారత్ తుది పోరులో మాత్రం పూర్తి జట్టుతో బరిలోకి దిగనుంది. ఆసియా కప్ టోర్నీ సొంతం చేసుకొని వన్డే వరల్డ్ కప్కు ముందు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని భారత్ భావిస్తోంది. బంగ్లాదేశ్తో మ్యాచ్లో గిల్, అక్షర్ పటేల్ మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో టీమిండియా ఓటమి చవిచూసింది. ఈ రోజు మ్యాచ్కు కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టులోకి రానుండటంతో బ్యాటింగ్ యూనిట్ బలంగా మారనుంది. బుమ్రా, సిరాజ్లు సైతం ఆడనున్నారు. గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
వెల్లలాగే తోనే అసలు టెన్షన్
శ్రీలంక జట్టులోని ఒక ఆటగాడు టీమ్ ఇండియా టెన్షన్ని పెంచుతున్నాడు. అతగాడే వెల్లలాగే. ఇంతకుముందు సూపర్ 4 మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఈ ఆటగాడు భారత జట్టులో సగం మందిని పెవిలియన్లో కూర్చోబెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆటగాడిని ఫైనల్లో టీమిండియా డీల్ చేయగలదా. లేక మరోసారి ఈ ఆటగాడు టీమిండియాకు టెన్షన్గా మారతాడా అనేది ప్రశ్నగా మారింది.
కోహ్లీ ఆడితేనే మనం గెలిచేది
కోహ్లి సాధారణంగా ఎడమచేతి వాటం స్పిన్నర్లతో ఇబ్బంది పడుతుంటాడు. ఫైనల్లో భారత్కు కోహ్లీ సత్తా చాటడం కీలకం. ఇటువంటి పరిస్థితిలో ఈ ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ తన వికెట్ను వెల్లలాగేకు ఇవ్వకూడదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెల్లలాగే ఎదుర్కొనేందుకు టీమ్ ఇండియా పూర్తి స్థాయిలో సన్నాహలు చేస్తుంది.