CA-IND
భారత్ తో ఢీ అంటే ఢీ అంటున్న కెనడాకు మన ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. మన దేశ రాయబారిని దేశం విడిచి వెళ్లిపోమని కెనడా ఆదేశించిన కొన్ని గంటల్లోనే టిట్ ఫర్ టాట్ రీతిలో బదులిచ్చింది. మనదేశంలో ఉన్న కెనడా రాయబారిని ఐదు రోజుల్లో భారత్ వదిలి వెళ్లాలని హుకుం జారీ చేసింది. రాయబారి పేరు బయటకు వెల్లడించనప్పటికీ ఐదురోజుల్లో దేశం దాటి పోవాలని గడువు ను విధించింది. జీ20 వేదికగా కెనడా ప్రధాని ట్రుడో, భారత ప్రధాని మోడీ మధ్య రేగిన అభిప్రాయ బేధాలు చిలికి చిలికి గాలివానగా మారాయి. కెనడా ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరాదని, ఖలిస్తాన్ ఉద్యమాన్ని బలపరచ వద్దని ప్రధాని ట్రుడోను గట్టిగా కోరారు. అయితే దీనిని వ్యతిరేకించిన ట్రుడో భారత విన్నపాన్ని అసలు పరిగణనలోకి తీసుకోలేదు. జీ 20 సదస్సులో కూడా అంటీ ముట్టనట్లు ఉండి ఏకాకిగా ఉండిపోయారు. పై పెచ్చు స్వదేశం వెళ్లాక భారత్ పై అభాండాలు వేయడం మొదలు పెట్టారు. తీవ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్ల సహకారముందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది కక్ష పూరితంగా దురుద్దేశాలను ఆపాదించడమేనని మండిపడింది.
భారత డిప్లమాట్ ను బహిష్కరించిన కెనడా CA-IND
దీనికి కౌంటర్ గా కెనడా మన సీనియర్ ఇండియన్ డిప్లమాట్ ను బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ సీనియర్ అధికారి పేరు వెల్లడించనప్పటికీ అతగాడు రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ ( RAW) లో పనిచేస్తున్నట్లు గుర్తించామంటూ కెనడా విదేశాంగ మంత్రి ఒక ప్రకటన చేశారు. దీంతో మండిపడిన భారత్ ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయంలో సీనియర్ అధికారిని ఐదు రోజుల్లో వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడమే కాదు, దేశవ్యతిరక చర్యలకు పాల్పడే వారికి మా దేశంలో స్థానంలేదంటూ భారత్ ఘాటుగా బదులిచ్చింది.
జీ20 వేదికగా ట్రుడోను నిలదీసిన మోడీ CA-IND
జీ-20 వేదికగా ప్రధాని మోడీ కెనడా ప్రధాని ట్రుడోను ఓ రకంగా కార్నర్ చేశారు. కెనడాలోని ఖలిస్థాన్ తీవ్రవాదులు భారత రాయబార కార్యాలయాలపై దాడులు జరుపుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. దాంతో అక్టోబర్లో జరగాల్సిన కెనడా, భారత వాణిజ్య బృందం భారత పర్యటనను కెనడా ఏకపక్షంగా రద్దు చేసుకుంది. పైగా మా గడ్డపై మా పౌరుడిని ఏ విదేశీ ప్రభుత్వమూ చొరవ తీసుకుని చంపితే అది మా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడమేనంటూ ఎమర్జెన్సీ మీటింగ్ లో ట్రుడో కామెంట్ చేశారు. ప్రజాస్వామిక సంఘాలు స్వేచ్ఛగా, బాహాటంగా వ్యవహరించాలన్న ప్రాధమిక సూత్రాలను ఉల్లంఘించినట్లేనని పార్లమెంటు సమావేశాల్లో ట్రుడో స్పష్టం చేశారు.
సంఘ విద్రోహక శక్తులకు బాసటగా కెనడా
ట్రుడో కామెంట్లపై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కెనడా ప్రధాని వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవి.. ఇది సంఘ విద్రోహక శక్తులకు బాహాటంగా మద్దతు పలకడమేనని మండి పడింది. ఇది ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించింది. ఖలిస్థానీ తీవ్రవాదులు, ఉగ్రవాదులపై చర్యలు లేకుండా వారికి ఆశ్రయం కల్పిస్తూ అసలు విషయం పక్కదారి పట్టించేందుకు ఇలాంటి కామెంట్లు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించిది. కెనడా ఎప్పటినుంచో ఈ విషయంపై ఉదాసీన వైఖరి చూపుతోంది. భారత ఆందోళనను, ఆవేదనను అర్ధం చేసుకోటం లేదని మనదేశం వ్యాఖ్యానించింది. కెనడాలో అసాంఘీక కార్యకలాపాలు, హత్యలు, మానవ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు కొత్తకాదని ఇలాంటి భారత వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ గడ్డపై నుంచి భారత్ పై విషం చిమ్మే ఉగ్రమూకలను నిషేధించాలని మన దేశం గట్టిగా కోరింది.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తో రగిలిన గొడవలు
కెనడాలో ఉంటున్న హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఖలిస్థానీ ఉగ్రవాది అక్కడనుంచే భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ పేరిగ ఉగ్రవాద సంస్థను నడుపుతున్నాడు. హర్దీప్ సింగ్ నిజ్జర్ పై జూన్ లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ పేరిట మనదేశంలో ఖలిస్థాన్ వేర్పటు వాద ఉద్యమానికి బీజం వేస్తూ, అరాచకం సృష్టించే పథకానికి రూపకర్త హర్దీప్ సింగ్. పంజాబ్ లోని జలంధర్ లో ఓ హిందూ పూజారిని చంపడంలో హర్దీప్ కీలక పాత్ర పోషించాడు.దాంతో హర్దీప్ తలకు పది లక్షల వెల కట్టింది భారత ప్రభుత్వం.
2007లో పంజాబ్ లో ఓ సినిమా హాల్లో బాంబు పేలుడు ఘటనకు కారకుడు కూడా హర్దీపే. ఇటీవల కెనడా,బ్రిటన్, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలపై దాడులలోనూ హర్దీప్ హస్తం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. సిక్కు ఉగ్రవాదులకు కెనడా స్థావరంగా మారుతోంది. గత కొన్నేళ్లుగా అక్కడ ఉంటూ మన దేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న ఈ వేర్పాటు వాద శక్తులపై కఠిన చర్యలు చేపట్టాలంటూ మన దేశం కెనడాపై ఒత్తిడి తెస్తోంది. మొన్న జీ-20 సదస్సు వేదికగా కూడా మోడీ ఇదే విషయంపై కెనడా ప్రధాని ట్రుడోను నిలదీశారు. CA-IND