(Women’s)
మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల సాకారమవుతోంది. పార్లమెంటు కొత్త భవనంలో ఈ చరిత్రాత్మక బిల్లు చట్టరూపం సంతరించుకుంటోంది. మహిళల దశాబ్దాల ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల అమలుకు వాస్తవానికి చాలా రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు.. పైకి అందరూ కావాలనే అంటున్నా.. లోలోన మాత్రం కోటాలో ఉపకోటా కావాలంటూ మళ్ళీ గందరగోళం రేకెత్తిస్తున్నారు.. దశాబ్దాల పోరాటం తర్వాత కార్యరూపం దాలుస్తున్న ఈ చట్టం అమల్లోకి వచ్చేది మాత్రం ఇప్పట్లో కాదు.. అంటే మరో నాలుగేళ్ల ఎదురు చూపుల తర్వాతే ఈ ఫలాలు మహిళలకు అందబోతున్నాయి. రిజర్వేషన్ బిల్లు చట్ట రూపం సంతరించుకోవాలంటే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందాలి. అప్పుడే అసెంబ్లీలు, పార్లమెంటు పరిధిలోని అన్ని లెజిస్లేటివ్ స్థానాలకూ ఈ కోటా వర్తిస్తుంది. ఈ కొత్త చట్టం ప్రకారం లోక్ సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడోవంతు సీట్లు మహిళలకు కేటాయిస్తారు. ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఇది వర్తిస్తుంది. ఈ కొత్త చట్టం వల్ల దాదాపు 15 ఏళ్ల పాటు ఈరిజర్వేషన్లు మహిళలకు వర్తింప చేస్తారు. అప్పటికి పరిస్థితి మారి మహిళలు మగవారితో సమానంగా ఎదగ గలిగితే రిజర్వేషన్లు ఉపసంహరిస్తారు. లేని పక్షంలో పరిస్థితిని బేరీజు వేసి పొడిగిస్తారు.
2027దాకా ఎదురు చూపులు తప్పవా? (Women’s)
మహిళా రిజర్వేషన్లు అమలు జరగాలంటే మనం మరో నాలుగేళ్లు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ కొత్త చట్టం అమలు అవ్వాలంటే ముందు జన గణన జరగాలి. మహిళల(Women’s) సంఖ్య ఎంతుందో ముందు తేలాలి. అలాగే డీలిమిటేషన్ ప్రక్రియ లేదా నియోజక వర్గాల పునర్విభజన కూడా జరగాలి.. ఇది జరగాలన్నా ముందు జనగణన జరగాలి. జనాభా ప్రాతిపదికనే నియోజక వర్గాలపునర్విభజన చేస్తారు. అది 2027 దాకా అయ్యే అవకాశం లేదు. వాస్తవానికి 2021లో మనకు జనగణన జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ పాండమిక్ కారణంగా అది వాయిదా పడింది.
నియో జక వర్గాల పునర్విభజన తర్వాత మహిళలకు రిజర్వు చేసిన సీట్లను రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారు. ఈసీట్లకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే మహిళలను ఎంపిక చేస్తారు. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలు అన్నింటిలోనూ ఈ మూడోవంతు రిజర్వేషన్లు అమలవుతాయి.అయితే రాజ్య సభకు మాత్రం ఈ ఎంపిక వర్తించదు. కోటాలోనే మూడో వంతు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డు తెగలకు కేటాయిస్తారు. మహిళా బిల్లు ఓబీసీలకు మొండి చేయిచూపిస్తోంది. అసెంబ్లీ నియోజక వర్గాల్లో అలాంటి వెసులు బాటు లేదు. ఈకారణంగానే ఆర్జేడీ లాంటి పార్టీలు మహిళా రిజర్వేషన్లను ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నాయి.
పాత బిల్లుకు ,కొత్త బిల్లుకు తేడా ఏంటి?
ప్రస్తతం ఆమోదించబోయే కొత్తబిల్లు అంతా 2010లో మన్మోహన్ ప్రభుత్వం రూపొందంచిన రిజర్వేషన్ బిల్లునే పోలి ఉన్నా.. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ కోటాకు సవరణలు చేయాలన్న ప్రతిపాదనను తొలగించారు. కొత్త బిల్లు అన్ని విధాలాబాగానే ఉన్నా, డీలిమిటేషన్ చట్టం చేయాలంటే మళ్లీ ప్రత్యేకంగా, బిల్లు నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే.
ప్రస్తుతం మన దేశంలో చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం 14 శాతంగా ఉంది.
ఇది ప్రపంచ సగటుకంటే చాలా చాలా తక్కువ. మొత్తం మీద ఎట్టకేలకు మహిళలు చట్ట సభల్లో అడుగు పెట్టే శుభతరుణానికి ముహూర్తం కుదిరింది.ఆ ముహూర్తం మరో నాలుగేళ్ల ఎదురు చూపుల తర్వాతేననే బాధ వెంటాడుతున్నా.. ఇప్పటికైనా ఒకఅడుగు ముందుకు పడినందుకు సంతోషించాల్సిందే.కుటుంబాన్ని ఎంతో చక్కగా,సమర్ధవంతంగానిర్వహించే మహిళ చట్ట సభల్లో ఉంటే దేశం కూడా కుటుంబంలా అభివృద్ధి చెందుతుంది.మహిళా(Women’s) రిజర్వేషన్ల బిల్లు సాకారమవుతుండటం పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హర్షం వ్యక్తంచేశారు. ప్రతీ మహిళ ఈ ఆనందాన్ని సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మహిళా బిల్లు ఆమోదించడం ఎంపీలకు అగ్ని పరీక్ష లాంటిదే నని మోడీ కామెంట్ చేశారు. 2010లో ఈ బిల్లుకు మోక్షం కల్పించాలని మన్మోహన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినా సాధ్య పడలేదు. 2014లో లోక్ సభ రద్దు కావడంతో లోక్ సభలో బిల్లు పెండింగ్ లోనే ఉండి మురిగిపోయింది. అయితే తాము తెచ్చే ఈ బిల్లు పాత బిల్లు కాదని, సరికొత్త బిల్లనీ బీజేపీ చెబుతోంది. బిల్లులో కొన్ని మార్పులు చేసినట్లు ప్రకటించింది.