మనిషి తల్లి గర్భం లో తొమ్మిది నెలలుంటాడు .జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి(Kasi) ఒక్కటే .అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి ,అ తర్వాతా స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలి అని చెప్పాడు. అయితే కలికాలం లో ఇంత శ్రద్ధ తో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమని సామాన్యులు కోరారు . దానికి అయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు.
మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి ?
విశ్వేశ్వర నామ స్మరణ ,దానాలు చేయటం ,ధర్మ ప్రసంగాలు వినటం , ఏక భుక్తం , ప్రాతఃకాల స్నానం , ఉదయం రాత్రి విశ్వేశ్వర దర్శనం , కోపం లేకుండా ఉండటం ,అబద్ధ మాడకున్డటం ,అనే ఎనిమిది అంశాలు ఖచ్చితంగా అమలు చేయాలి.
మొదటి రోజు కార్యక్రమం:
మొదటిగా మనసులో 33 కోట్ల దేవతలు, తీర్ధాలతో సర్వ పరివారంతో సేవింప బడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వరా !శరణు !అనుజ్ఞ ! అని స్మరించుకొని మణి కర్ణికా తీర్దానికి వెళ్ళాలి. దీనినే చక్ర తీర్ధం అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహా దేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు. శివుడికి పార్వతి తర్వాత ఇష్టమైన వాడు విష్ణువే. అందుకే ‘’నారాయణీ సహా చరయ నమశ్శివాయ ‘’అన్నారు . విష్ణు సేవా ఫలితం గా ఏర్పడిన మణి కర్ణిక కు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు. యాత్రీకులు మణి కర్ణిక లో స్నానం చేయాలి .బ్రాహ్మణులకు దానాలు చేయాలి . కేశ ఖండనం చేసుకొని ,మళ్ళీ స్నానం చేయాలి.
మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి. రుద్రాక్ష మాల ధరించి ఈ శ్లోకం చదువు కోవాలి ’కిము నిర్వాణ పదస్య భద్ర పీతం – మృదులం తల్ప మదోను మోక్ష లక్స్యః ,అధవా మణి కర్ణికా స్థలీ పరమానంద సుకాండ జన్మ భూమి చరా చరేషు సర్వేషు-యావంతస్చ సచేతనః –తావంతిహ్ స్నాంతి మధ్యాహ్నే – మణి కర్నీజతే మలే.. ఆ గంగా కేశవస్చైవ – ఆ హరిన్ద్రస్చ మండ పాత్ – ఆ మద్ధ్యా ద్దేవ సరితః స్వర్ద్వారా న్మణికర్ణికా నమస్తే నమస్తే నమః‘’అని నమస్కరించి అక్కడ నుండి డుండి వినాయకుడిని దర్శించి ఇరవవై ఒక్క గరికలను , ఇరవై ఒక్క కుడుములను సమర్పించి , ఇరవై ఒక్క సార్లు గుంజీలు తీసి ఇరవై ఒక్క రూపాయలు దక్షిణ గా సమర్పించాలి. తర్వాతా అన్నపూర్ణా దేవిని సందర్శించాలి ఆ తర్వాతా విశాలాక్షి ,జ్ఞాన వాపి , సాక్షి గణపతులను చూడాలి.
ఇది పూర్తీ చేసి నివాసం చేరి భోజనం చేయాలి రాత్రికి విశ్వనాదుడిని దర్శించాలి. ఫలాలు పాలు ఆహారం గా గ్రహించాలి ‘’హర సాంబ హర సాంబ సాంబ సాంబ హరహర –హర శంభో హర శంభో –శంభో శంభో హరహర మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ – మహాకారి మహా కారి రక్ష రక్ష హరహర ‘’ అంటూ పద కొండు సార్లు భజన చేసి నిద్రపోవాలి.
రెండవ రోజు కార్య క్రమం :
రెండో రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర ,అన్నపూర్ణా దర్శనం చేయాలి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా ఘట్టం లో స్నానం చేయాలి .తీర్ధ శ్రాద్ధం చేయాలి . వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి. గురు ఉపదేశం తో‘’శ్రీ కాశీ విశ్వేశ్వరాయనమః ‘’ అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జపించాలి . మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి. రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి .
మూడో రోజు కార్యక్రమం :
తెల్లవారక ముందే అసీ ఘాట్ లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి .తర్వాత దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి. దీనికి ‘’రుద్ర సరోవర తీర్ధం ‘’అనే పేరు కూడా ఉంది. ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి. వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి. పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం చేయాలి ‘ తర్వాతా బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి. మణి కర్నేశుని ,సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి. అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి . రాత్రికి పాలు ,పండ్లు మాత్రమె స్వీకరించాలి.
నాల్గవ రోజు:
ఉదయమే గంగా స్నానం విశ్వేశరుడి దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండ పాణి అయిన కాల భైరవుని ,పూజించాలి. కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసు లో స్మరించి ‘ ’ఓం కాశ్యైనమః ‘’అని 36సార్లు అనుకోవాలి తర్వాతా బిందు మాధవుని దర్శించాలి. గుహను ,భవానీ దేవిని దర్శించాలి ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణి కర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణా విశ్వేశులను దర్శించి భోజనం చేయాలి. రాత్రి నామ స్మరణ పాలు ,పండ్లు ఆహారం. అంటే ఈరోజు పది దర్శనాలన్న మాట.
అయిదవ రోజు:
ప్రాతః కాలమే గంగా స్నానం చేసి , కేదారేశ్వరుని దర్శించి ,అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి . తర్వాత తిలా భాన్దేశ్వర , చింతా మణి గణపతిని సందర్శనం చేయాలి. దుర్గా దేవిని చూసి ,ఒడి బియ్యం దక్షిణా సమర్పించి ,గవ్వలమ్మ ను చేరి అదే విధంగా పూజ చేయాలి. ఈమెనే కౌడీబాయి అంటారు.అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి ,భోజనం చేసి రాత్రి పాలు ,పండ్లు తీసుకోవాలి.
ఆరవ రోజు:
సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది ,వైధవ్యం ఎన్ని జన్మ లకైనా రాకూడదని దీవెనలు పొంది మూసివాయన చేటలదానాన్ని చేసి ,బేసి సంఖ్యలో జనానికి వాయనదానాన్ని చేయాలి. వ్యాస కాశీ చేరి వ్యాసుని రామ లింగేశ్వరుని శ్రీ శుకులను దర్శించి ,కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి. తర్వాత భోజనం చేయాలి. రాత్రి సంకీర్తనతో కాల క్షేపం చేసి పాలు పండ్లను స్వీకరించాలి.
ఏడవ రోజు:
గంగాస్నానం ,నిత్య పూజా చేసి వెయ్యి గరిక లను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరక్క పోతే నూట ఎనిమిదితో సరి పెట్టుకోవాలి . 21 ఉండ్రాళ్ళను, 108 యెర్ర పూలతో పూజించాలి. ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువులకు భోజనం పెట్టి తామ్బూలాలివ్వాలి. డుండి వినాయకుడిని అర్చించి ,అన్నపూర్నాలయం లో కుంకుమ పూజ చేయించాలి. అమ్మవారికి చీరా జాకెట్టు ,ఒడి బియ్యం ,గాజులు సమర్పించాలి. ఇలాగే విశాలాక్షి కీ చేయాలి. విశ్వేశునికి అభిషేకం చేయాలి. సహస్ర పుష్పార్చ
సహస్ర బిల్వార్చన ,హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి హర సాంబ హర సాంబ అంటూ పదకొండుసార్లు జపం చేయాలి .
ఎనిమిదో రోజు:
గంగాస్నానం నిత్యపూజా తర్వాత కాల భైరవుడిని దర్శించి వడలు ,పాయసం నివేదించాలి. ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ రోజంతా కాల భైరవ స్మరణతో నిష్టగా గడపాలి. అయిదుగురు యతులకు ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనం పెట్టాలి. దక్షిణా తాంబూలం సమర్పించాలి. భోజనం చేసి రాత్రి కాలభైరవ స్మరణ చేస్తూ నిద్ర పోవాలి.
తొమ్మిదో రోజు:
గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్నాదేవిని దర్శించి పూజించి ,108ప్రదక్షిణలు చేయాలి. జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణలివ్వాలి ఆశీస్సులు పొందాలి . రాత్రి అన్నపూర్నాష్టం చేసి నిద్ర పోవాలి
పదవ రోజు కార్య క్రమం :
నవ దిన యాత్ర పూర్తీ చేసి పదవ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్రనామ పూజ చేసి ,అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తలిదండ్రులను గురు దంపతులను పూజించాలి. అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి. ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.