(ODI)
వన్డే వరల్డ్కప్కు రెండు వారాల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో భారత క్రికెట్ జట్టు పటిష్ఠ ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. ఇరు జట్లలోనూ అద్భుత ఆటగాళ్లకు కొదువలేదు. భారత్ కు ఈ సీరీస్ ఒక ప్రాక్టీస్ సెషన్ లా ఉండబోతోంది. ఎందుకంటే మెగా టోర్నీకి ముందు భారత్కు మిగిలిన మ్యాచ్లు ఇవి మాత్రమే. తమ తొలి రెండు మ్యాచ్ల్లో విరాట్, రోహిత్, హార్దిక్, కుల్దీప్ లేకుండానే ఆడబోతోంది. జట్టును కేఎల్ రాహుల్ నడిపిస్తున్నాడు. జట్టు ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు కూడా ఈ సిరీస్ లో సమాధానం లభించాల్సి ఉంటుంది. రాహుల్ నిలకడ కొనసాగుతుందా? సూర్యకుమార్ వన్డే ఫామ్ను అందుకుంటాడా? జడేజా పరుగుల కొరత తీరుతుందా? శ్రేయాస్ అయ్యర్ అంచనాలను అందుకుంటాడా? ఇవన్నీ తేలాల్సి ఉంది.
రాహుల్ కెపెన్సీలో భారత జట్టు ఇప్పటిదాకా ఆడిన ఏడు వన్డేల్లో నాలుగు గెలిచి మూడు ఓడింది. అటు ఆసీస్ మూడు నెలల ప్రపంచ కప్ పర్యటనకు భారత్లో అడుగు పెట్టింది. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు మెగా టోర్నీకి ముందు ఈ సిరీస్ వారికి ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు.. దీనికి ముందు దక్షిణాఫ్రికాతో 2-3తో సిరీస్ కోల్పోగా కమిన్స్, స్మిత్, స్టార్క్, మ్యాక్స్వెల్ జట్టులోకి రావడం బలాన్నిస్తోంది. అలాగే ఈ మైదానంలో ఆడిన ఏడు వన్డేల్లో ఆసీస్ 6 మ్యాచ్ లు గెలిచింది. వన్డే క్రికెట్లో ఇప్పటివరకు 146 భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్లు జరగ్గా వాటిల్లో టీమిండియా 54 ఆసీస్ 82 గెలిచాయి. మరో 10 మ్యాచ్లు రద్దయ్యాయి.
శుభ్ మన్ కు జతగా ఇషాన్ కిషాన్?
రోహిత్ లేకపోవడంతో శుభ్మన్ గిల్కు జతగా ఇషాన్ కిషన్ ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జట్టులో రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు. తనకు ఇటీవలి కాలంలో పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్లు లేవు. తుది జట్టులో చోటు కల్పించాలంటే గిల్, ఇషాన్లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. ఇక సూర్యకుమార్ వన్డేల్లో పెద్దగా రాణించలేకపోతున్నా అతగాడి శక్తిసామర్థ్యాలపై సెలెక్టర్లకు నమ్మకం ఉంది. ఈ సిరీస్ లో తను అంచనాలను అందుకుంటే వరల్డ్కప్ ముందు జట్టుకు అతిపెద్ద బలం కానుంది. గాయం కారణంగా శ్రేయాస్ ఆసియాకప్ లో పెద్దగా ఆడలేకపోయాడు. తన మ్యాచ్ ఫిట్నెస్ ఏపాటిదో ఈ సిరీస్ ద్వారా తెలియాల్సి ఉంది. బౌలింగ్ బాధ్యతలను బుమ్రా, సిరాజ్, షమి తీసుకుంటూన్నారు. ఒకవేళ సిరాజ్కు రెస్ట్ ఇస్తే శార్దూల్ ఠాకుర్ కు అవకాశం రానుంది. హార్దిక్ లేకపోవడంతో ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్లు అశ్విన్, జడేజా, సుందర్లకు చోటు దక్కవచ్చు. సుందర్ను ఆడిస్తే తిలక్ వర్మకు చోటు దొరకదు.
తొలివన్డేకు మిచెల్, గ్లెన్ దూరం (ODI)
భారత్తో జరిగే తొలి వన్డేకు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్తో పాటు పేసర్ మిచెల్ స్టార్క్ దూరం అయ్యరు. గాయంతో దక్షిణాఫ్రికా సిరీస్ కు కూడా దూరమైన మ్యాక్స్కు ముందు జాగ్రత్తగా విశ్రాంతి కల్పించారు. ఇక కెప్టెన్ కమిన్స్ గతేడాది నవంబరు నుంచి వన్డే మ్యాచ్ ఆడలేదు. తను ఈ మ్యాచ్కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. అలాగే స్టీవ్ స్మిత్ కూడా ఫిట్గా ఉన్నట్టు చెప్పాడు. మిడిలార్డర్లో లబుషేన్, క్యారీ కీలకం కానున్నారు. ట్రావిస్ హెడ్ దూరం కావడంతో ఓపెనర్లుగా వార్నర్, మిచెల్ మార్ష్ రానున్నారు. పేసర్ స్టార్క్ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ అరంగేట్రం చేయవచ్చు.
అది బ్యాటింగ్ పిచ్
మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. బ్యాట్పై బంతి చక్కగా వస్తుంది. ఐపీఎల్లో ఈ పిచ్పై హైస్కోరింగ్ మ్యాచ్లే ఎక్కువగా జరిగాయి. అయితే గత నాలుగేళ్లుగా ఇక్కడ వన్డే మ్యాచ్ జరగలేదు. పిచ్ స్పిన్నర్ల కంటే పేసర్లకు కాస్త ఎక్కువగా సహకరిస్తుంది. ఆరంభంలో పేసర్లకు సహకారం కాస్త తక్కువగా ఉంటుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక్కడ రెండో బ్యాటింగ్ చేసిన జట్టుకు మంచి రికార్డులు లేవు. ఈ వికెట్పై సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 320 పరుగులుగా ఉంది. వర్షం కురిసే అవకాశం లేదు.