ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ (CID) దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబును అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా… న్యాయమూర్తి రెండ్రోజుల విచారణకు అనుమతించారు. రాజమహేంద్రవరం జైలులోనే చంద్రబాబును విచారణ చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. కస్టడీ రిపోర్ట్ ను సీల్డ్ కవర్ లో ఇవ్వాలని ఆదేశించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణకు అనుమతించారు. విచారణ జరుపుతున్న వీడియో, ఫొటోలు విడుదల చేయరాదని షరతులు విధించారు. ఆదివారం సాయంత్రం కస్టడీ ముగిశాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశిచారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు అరెస్టు, ఆపై ఇప్పుడు సీఐడి కస్టడీ విషయంలో ఏపీ ప్రభుత్వం పాటించాల్సిన నిబంధనలు, షరతులను కఠినంగా పాటిస్తోంది. పొరపాటున ఏచిన్న తేడా జరిగినా ఆ తర్వాత మళ్లీ కోర్టు ముందు దోషిగా నిలబడటమే కాక, టీడీపీ అనుకూల మీడియా దాడిని, సోషల్ మీడియా ట్రోలింగులను భరించాల్సి వస్తుందన్న కారణంగా పకడ్బందీగా వ్యవహరిస్తోంది.
అంతకుముందు తనపై పెట్టిన కేసులు అక్రమమని చెల్లనేరవని హై కోర్టులో చంద్రబాబు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.
న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా, హరీష్ సాల్వే లాంటి ఉద్దండ న్యాయవాదులు వాదించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో టీడీపీ న్యాయవాదుల బృందంలో నిరాశా నిస్పృహలు అలముకున్నాయి.క్వాష్ పిటిషన్ కొట్టేసి సీఐడి కస్టడీకి అనుమతించడంతో టీడీపీ శ్రేణులు కూడా డీలాపడిపోయాయి. మొదట్లో అసలు అరెస్టే అక్రమమని వాదించిన న్యాయవాదులు ఇప్పుడు బెయిల్ కావాలంటూ ఏసీబీ కోర్టు తలుపు తట్టారు.
బెయిల్ పిటిషన్ ఆలస్యం (CID)
చంద్రబాబు కేసులను వాదించడంలో న్యాయవాదులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు?
ప్రతీసారి కోర్టులో చుక్కెదురు ఎందుకు ఎదురవుతోంది అంటే అసలు కేసులను మొదట్నుంచి టేకప్ చేయడంలోనే తేడా ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. రిమాండ్ లో ఉన్న రోజునే బెయిల్ కు అప్లయ్ చేసి ఉంటే ఈ పాటికి వచ్చేసి ఉండేదని, అరెస్టు అక్రమం అన్న ఒక్క పాయింట్ చుట్టే టీడీపీ న్యాయబృందాలు తిరగడం వృథా ప్రయాసగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేశారని ఒకసారి, నేరమే చేయలేదు కాబట్టి కేసు కొట్టేయాలని మరోసారి ప్రతిష్టకు పోయి కోర్టుల్లో వాదించి చెమటలు కక్కారని, కానీ మొదటే బెయిల్ కు అప్లయ్ చేసి ఉంటే ఈపాటికి బెయిల్ వచ్చేసేదని మరికొందరు అంటున్నారు.
బెయిల్ పై సోమవారం వాదనలు
ఇదిలా ఉండగా బెయిల్ పిటిషన్ పై రేపు వాదనలు వినిపిస్తామని చంద్రబాబు లాయర్లు కోరగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. కస్టడీలో ఉండగా బెయిల్ పిటిషన్ పై వాదనలు వినడం సరికాదని, అది పద్ధతి కాదని జడ్జి తెలిపారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు వింటామన్నారు. రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే సిఐడి (CID) మరోసారి కస్టడీ పొడిగింపుకు కోర్టు తలుపు తట్టొచ్చు. సీఐడీ న్యాయవాదుల వాదనలతో జడ్జి ఏకీభవిస్తే కస్టడీ గడువు పొడిగిస్తారు. లేదంటే బెయిల్ రావొచ్చు. అయితే చంద్రబాబుకు బెయిల్ వచ్చినా ఆ వెంటనే విచారణకు మరో ఏడు కేసులు సిద్ధంగా ఉన్నందున బెయిల్ వచ్చినా వృథానే..