ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును స్కిల్ స్కామ్ లో రిమాండ్ కు పంపిన విజయవాడ ఏసీబీ (ACB) కోర్ట్ జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, దూషణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పి.సి. మీనా లేఖ రాశారు. చంద్రబాబును స్కిల్ స్కామ్ పై అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా జడ్జి తీర్పు నివ్వడం జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు ఆమెపై సోషల్ మీడియాలో నీచమైన ప్రచారానికి ఒడిగట్టాయి. చంద్రబాబు రిమాండ్ కు వెళ్లినతర్వాత గత 16 రోజులుగా విజయవాడ ఏసిబి- సీబిఐ జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు తెలుగు దేశం వారు. ఆమె హోదాను, గౌరవాన్ని కించపరుస్తూ ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు.
ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త, హై కోర్టు న్యాయవాది ఇందుగుబల్లి రామానుజం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం వంటి కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఏపి సిఐడి, ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని కేసు వివరాలు తెలిపారు. చంద్రబాబు రాజ్యాంగానికి అతీతుడని తెలుగు దేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయని రామాంజనేయులు తెలిపారు. బాధ్యతాయుతమైన జడ్జి హిమబిందు చట్టపరమైన తన విధులను నిర్వర్తిస్తే వాటిని విమర్శిస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని కించ పరచడం ఎంత వరకూ సబబన్నారు. వీటిపై ఎ.పి.పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతిభవన్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ హయాంలోనే మొదలైన ట్రోలింగ్ (ACB)
ఏపీ విభజన తర్వాత కుల పరమైన విమర్శలు, విశ్లేషణలు, రాజకీయాలు, ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. చంద్రబాబు సీఎం పదవి చేపట్టాక రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ పతాక స్థాయికి చేరింది.. అభ్యంతరకర, అనుచిత కామెంట్లు చేస్తూ ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని దిగజార్చుతూ,అసభ్యకరంగా పోస్టింగులు, మీమ్ లు ఎక్కువయ్యాయి. ఇందులో ఏ పార్టీ తక్కువ తినలేదు. దాదాపు అన్ని పార్టీలూ దీనికోసం భారీ ఎత్తున సిబ్బందిని రిక్రూట్ చేసుకుని సోషల్ మీడియా వార్ చేస్తున్నాయి. అందులో భాగమే గతంలో టీడీపీ వైసీపీ సానుభూతి పరులను అరెస్టులు చేయడం. ఈరకమైన దుష్ర్పచారానికి ముందు శ్రీకారం చుట్టింది మాత్రం టీడీపీయే…అయితే నైతిక విలువలు కూడా వదిలి దాడులు చేస్తుండటంతో వైసీపీ కూడా గట్టిగా కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టింది. చంద్రబాబు హయాంలోనే సోషల్ మీడియా పోస్టింగులు పెట్టిన వారిపై అరెస్టులు మొదలయ్యాయి. టీడీపీ అధికారంలో ఉండగా హైదరాబాద్ కు వచ్చి మరీ ఏపీ సీఐడీ పోలీసులు కొందరిని అరెస్టు చేసి నెలల తరబడి నిర్బంధించారు. మొదట్లో రాజకీయ నాయకులకే పరిమితమైన ఈ ట్రోలింగ్ ఇరు పార్టీల కేసుల పైనా, వాటి తీర్పులపైనా కామెంట్లు చేయడం వరకూ వచ్చింది. తమకు నచ్చని తీర్పు వస్తే జడ్జిలను, న్యాయవాదులను దూషించడం వరకూ చేరిపోయింది.
టీడీపీ శ్రేణుల్లో అసహనం
చంద్రబాబు నాయుడుని మచ్చలేని నీతిమంతుడని టీడీపీ శ్రేణులు కీర్తిస్తాయి. చంద్రబాబు కూడా తరచుగా తాను నిప్పు అని చెబుతుంటారు. తీరా ఇప్పుడు స్కిల్ స్కామ్ లో రిమాండ్ కు వెళ్లడంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. అందుకే తీర్పు నిచ్చిన జడ్జి హిమబిందుపై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడటం.. ఆమె ఇంటి ముందు ధర్నాలు, నిరసనలకు పాల్పడటం చేస్తున్నాయి. బాబుకు బెయిల్ ఇవ్వాలని, జైలు నుంచి విడుదల చేయాలనీ అర్ధరహితమైన డిమాండ్లతో ఆమెపై సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నాయి. ఈనేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. అయినా ఆగని టీడీపీ శ్రేణులు ఆమెను పరుష పదజాలంతో కించపరచడం, ఎద్దేవా చేయడం, ఓ పార్టీకి ఆపాదించి విమర్శలు చేయడం కొనసాగిస్తున్నారు.ఈ వ్యవహారం ముదురుపాకాన పడటంతో ఓ సామాజిక కార్యకర్త రాష్ట్రపతికి ఫిర్యాదుచేశారు. ఫలితంగా రాష్ట్రపతి కార్యాలయం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.