భగవంతుణ్ణి చేరుకోవడానికి పెద్దలు చెప్పిన అనేక మార్గాలలో `పూజా
`(Puja) లేదా అర్చనా అనేది ఒక మార్గం. మన ఇంటికి వచ్చిన పెద్దవారిని ఏవిధంగా గౌరవించి అథిధి సత్కారం (రండి బాబాయ్ గారు. ఇంత ఎండ వేళ వచ్చారేంటి? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా..! ఈ మజ్జిగ తీసుకోండి… ఇలా ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేయడం) చేస్తామో.., అలాగే మన ప్రార్ధన మన్నించి మనం పిలవగానే మన ఇంటికి వచ్చే భగవంతుడికి మనం చేసే సేవనే `పూజా అంటాము. ఈ పూజలో 16 రకాలైన సేవలతో భగవంతుడిని తృప్తిపరచి ఆయన ఆశీర్వాదాన్ని పొందుతాడు భక్తుడు.
అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, చీకటి నుండి వెలుగులోకి, దానవత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దైవత్వం వైపు మన మనస్సును పురోగమింప చేయడానికి పూజను చేయాలి.
షోడశోపచార పూజ (Puja):
ఉత్సవాలు ఎన్నిచేసినా అన్నిటికీ పునాది వంటిది షోడశోపచార పూజ. ఇది అన్ని పూజలకు సమానంగా వుండే పునాది. మిగిలిన ఉత్సవాలు చేతనైనా కాకపోయినా ప్రతివారూ ఈ షోడశోపచార పూజా విధానం నేర్చుకోవాలి.
షోడశ అంటే 16; 16 రకాల సేవలు మనం దేవతలకు అర్పిస్తున్నాం గనుక, దీని పేరు షోడశోపచార పూజ. దేవత మన ఎదురుగుండా ప్రత్యక్షంగా వుండదు. మరి మనం ఉపచారాలు ఎలా చేస్తాము?
ఎదురుగా ప్రత్యక్షంగా దేవత కనిపించదు గాని, ఆ దేవత ప్రతినిధిగా విగ్రహం వుంటుంది. ఈ విగ్రహాన్ని చూసి, మన భావనలో ఆ దేవతను రూపుకట్టించుకోవటం నేర్చుకోవాలి. ఇలా రూపుకట్టిన దేవతకు భావనలోనే ప్రత్యక్షంగా సేవలు సమర్పించాలి. ఇది మానసిక ప్రక్రియ. ఈ ప్రక్రియకు సహకారం చేసేదే బహిరంగంగా మనం చేసే పూజ(Puja).
మనస్సును ఏకాగ్రంచేసే ప్రక్రియలో పూజకు ప్రముఖస్థానం వుంది. ఈ విధానంలో, ఒక అందమైన మంటపంలో సుందరమైన దేవతామూర్తిని వుంచి పూజ చేస్తాం. కనుక మనస్సు ప్రేమతోనూ, సంతోషంతోనూ ఏకాగ్రం అవుతుంది.
ఏ వస్తువు మీద ఏకాగ్రవౌతుందో దానియొక్క లక్షణాలను పొందటం మనస్సుయొక్క స్వభావం. మనస్సు భగవంతుడి మీద ఏకాగ్రమైతే అది భగవంతుడే ఐపోతుంది. అదే మన చివరి లక్ష్యం.
పెద్దపెద్ద ఆలయాలు, ఉత్సవాలు మొదలైనవన్నీ దీనికోసమే ఏర్పాటైనాయి. ఎన్నిచేసినా, చేసేవారు పూజ అంటే పూలు చల్లటం కాదని, మనస్సులో భావన చేయటమే పూజ అని అర్థం చేసుకోవాలి. పూజలో ఉపయోగపడే మంత్రాలు, శ్లోకాలు మొదలైనవన్నీ ఈ భావనాశక్తిని పెంచటంకోసం ఏర్పరచినవే.
కాని మనది పరిగెత్తే కాలం. ఎవరికీ విశ్రాంతి లేదు. మంత్రాలను అర్థం చేసుకోవటం కష్టం. అందువల్ల పూజే కష్టమని భావించి వదిలేస్తున్నాం. ఇది పొరపాటు. పూజ అన్నా, 16 ఉపచారాలన్నా రోజూ మనింట్లో మనం చేసుకునే పనులే గాని కొత్తవి కాదు.
పదహారు రకాల ఉపచారాలు/సేవలు షోడశోపచారాలు
1. ఆవాహనం,2. ధ్యానం, 3. ఆసనం, 4. పాద్యం, 5. అర్ఘ్యం,6. స్నానం – అభిషేకం
7. వస్త్రం, 8. యజ్ఞోపవీతం, 9. గంధం,10. అధాంగ పూజ,11. ధూపం,12. దీపం
13. నైవేద్యం, 14. తాంబూలం, 15. నీరాజనం, 16. మంత్ర పుష్పం
1. ఆవాహనం:
భగవంతుడిని పూజామండపానికి ఆహ్వానించడము.
2. ధ్యానం:
భగవంతుడిపై పూర్తిగా మనసు లగ్నం చేసి పూజామండపం లోకి ఆహ్వానించి పూజించడానికి శ్లోకంతో చేసే సేవను ధ్యానం అంటారు. భగవంతుడిని రాముడు, కృష్ణుడు, లక్ష్మి లేదా గౌరీ అంటూ ఏ రూపంలోనైనా పూజించవచ్చు. అది పూజ చేసే సందర్భాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా భగవంతుడు ఎప్పుడూ భక్తుల పక్షమే. శ్రద్ధాసక్తులు ముఖ్యమైనవి.
3. ఆసనం:
రత్నాలంకృతమైన బంగారు సింహాసనాన్ని అధిష్టించి పూజలందుకొమ్మని ఆసనం సమర్పించడం.
4. పాద్యం:
పాదాలు(కాళ్ళు) శుభ్రపరుచుకోవడానికి నీరందించడాన్ని పాద్యం అంటారు.
5. అర్ఘ్యం:
చేతులు శుభ్రపరుచుకోవడానికి నీరు అందించడాన్ని అర్ఘ్యం అంటారు.
6. అభిషేకం:
స్నానికి జలం సమర్పించడాన్ని అభిషేకం అంటారు. దేవునికి పంచామృతం (తేనె, ఆవు పాలు, ఆవు నెయ్య, పెరుగు, పంచదార) స్నానం అత్యంత ప్రీతికరమైనది. ఈ ఏడు పదార్ధాలతో స్నానం చేయించి తర్వాత మళ్ళీ శుద్ధమైన జలంతో స్నానం చేయించడాన్ని అభిషేకం అంటారు.
7. వస్త్రం:
అభిషేకం పూర్తి అయ్యాక దేవునికి సమర్పించే వస్త్రాలను వస్త్రం సమర్పయామి అని అందిస్తారు.
8. యజ్ఞోపవీతం:
భుజం పై నుంచి వేసుకోవడానికి యజ్ఞోపవీతం సమర్పించడం.
9. గంధం:
దేవునికి గంధం, అక్షతలు మరియు పుష్పాలు సమర్పించడం.
10. అధాంగ పూజ:
దేవునికి వారి అన్ని శరీర అవయవాలను కీర్తిస్తూ పూజ సమర్పించడాన్ని అధాంగ పూజ అంటారు.
11. ధూపం:
దేవునికి అగరవత్తులు మరియు ధూపం సమర్పించడం.
12. దీపం:
దీపాన్ని వెలిగించి దేవుని ముందుంచి ధ్యాన నిమగ్నులమై పూజించడం.
13. నైవేద్యం:
భక్తి ప్రపత్తులతో, శ్రద్ధాసక్తులతో భగవంతునికి ఆరగించడానికి సమర్పించే భక్ష్య భోజ్యాలను నైవేద్యం అంటారు. ఆ భగవానుడే మనకి ఇచ్చిన జీవితానికి, ఆనందాలకు, సుఖశాంతులకు, మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇదొక అవకాశం.
14. తాంబూలం:
మనం భక్తి తో సమర్పించిన భక్ష్య భోజ్యాలతో సంతుష్టుడైన దేవునికి, తాంబూలం సమర్పించడం. తాంబూలం జీర్ణశక్తిని పెంచుతుంది.
15. నీరాజనం:
దేవునికి కర్పూరంతో హారతి వెలిగించి, దిష్టి తీసి, మంగళం పాడి, మనం కళ్ళకి అద్దుకోవడం.
16. మంత్రపుష్పం:
మన మనస్సునే ఒక పుష్పంగా చేసి భగవంతునికి సమర్పించడానికి మంత్ర సహితంగా చేసే సేవనే మంత్రపుష్పం అంటారు.
ఇన్ని సేవలూ పూర్తి అయ్యాక, చేసిన పూజలో గాని, చదివిన మంత్రాలలో గాని తప్పులున్న మన్నించమని, ఉచ్చారణ దోషాలున్నా, భక్తి లో ఎటువంటి లోపము ఉండదని అపరాధ క్షమాపణ చెప్పుకుని దేవుని సాగనంపుతారు.
వెళ్లేముందు “పునరాగమనాయచ” అంటూ మళ్ళీ రమ్మని చెప్పి మరీ పంపుతారు.
ఇవి మనం నిత్యం దేవునికి సమర్పించే షోడశోపచారాలు(సేవలు)