స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో రిమాండు లో ఉన్న చంద్రబాబు నాయుడును సీఐడీ(CID) విచారిస్తోంది. మరోవైపు ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టింది టీడీపీ. మరోవైపు పది రోజులనుంచి ఢిల్లీలోనే మకాం వేసిన టీడీపీ ప్రధానకార్యదర్శి , యువనేత లోకేష్ ఇప్పుడు అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు. ఫైబర్ నెట్ స్కామ్ లో దూకు డు పెంచిన సీఐడి ఆయన అరెస్టుకు సంబంధించిన కీలక పత్రాలను రెడీ చేస్తోందని తెలుస్తోంది. నిజానికి చంద్రబాబుకు నైతిక మద్దతు కూడగట్టడం కోసం లోకేష్ ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నా, రాష్ట్రంలో ఉంటే తననూ అరెస్టు చేస్తారన్న భయంతోనే ఢిల్లీ వెళ్లారని సోషల్ మీడియా కామెంట్లు చెబుతున్నాయి. ఇప్పటికే తండ్రి జైల్లో ఉండటం, భవిష్య కార్యాచరణ కొలిక్కి రాకపోవడం, మరోవైపు తనను అరెస్టు చేస్తారన్న అనుమానాలు.. వీటన్నిటి నుంచి తాత్కాలికంగానైనా రిలీఫ్ ఉంటుందనే లోకేష్ ఢిల్లీలోనే మకాం వేసినట్లు సమాచారం. బాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో ఇక సుప్రీం కోర్టుకే వెళ్లాలని టీడీపీ నేతలు డిసైడ్ అయ్యారు. ఆ మేరకు పత్రాలు కూడా రెడీ చేశారు.మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ను ఫైబర్ నెట్ స్కామ్ లో ఏ-25నిందితునిగా చేర్చారు.
లోకేష్ ఆధారాలను సేకరించిన సీఐడి? (CID)
ఫైబర్ నెట్ స్కామ్ లో లోకేష్ పేరు ఇప్పటి వరకూ ఎక్కడా వినిపించనప్పటికీ సీఐడీ పోలీసులు ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే బలమైన సాక్ష్యాలను ఇప్పటికే సేకరించారు. ఆయన ఢిల్లీ నుంచి విజయవాడకు రాగానే అరెస్టు తధ్యమన్నవార్తలు మొదట్లో వినిపించాయి. కానీ ఇప్పుడు సీఐడీ టీమ్ ఏకంగా ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. లోకేష్ బస చేసిన హోటల్, ఆయన ఎవరెవరిని కలుస్తున్నారా? ఏం చేస్తున్నారు అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. ఆయనపై ఇప్పటికే నిఘా ఉంచారు. వైసీపీ సోషల్ మీడియా హ్యాడిల్ ఎక్స్ X చూస్తే ఏక్షణాన్నైనా లోకేష్ అరెస్టు తప్పదన్న సంకేతాలు కనిపస్తున్నాయి. కలుగులో దూరిన ఎలుకకి దొరికేది తాత్కాలిక రక్షణే. ఎప్పటికైనా ఎలుక బయటకు రాక తప్పదు పిల్లికి ఆహారంగా మారక తప్పదు.చట్టం ఎవరికీ చుట్టం కాదు.. నేరం చేసిన వాడు అంతరిక్షంలో ఉన్నా అరెస్టు కాకుండా ఆపలేం. స్కాములు చేసేసి ఇప్పుడు సింపతీ తో సురక్షితంగా బయట పడాలనుకోవడం మూర్ఖత్వం అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
న్యాయ నిపుణులతో క్షణం తీరిక లేకుండా లోకేష్
వైసీపీ ఇలా ట్వీట్ చేసిందో లేదో టీడీపీ శ్రేణులు అలెర్ట్ అయ్యాయి. ఢిల్లీలో లోకేష్ కూడా అరెస్టు తన దాకా వస్తే ఎలా బయటపడాలన్న అంశంపై న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఫైబర్ నెట్ స్కాం లో సీఐడీ(CID) తనపై నేరారోపణలు నమోదు చేసే అవకాశాలపైనా, ఆ ఆరోపణలకు చట్ట బద్ధత ఉంటుందా అనే అంశాలపైనా చర్చల్లో మునిగి తేలుతున్నారు. చంద్రబాబు కేసుల నుంచి బయటపడేందుకు ఉన్న అవకాశాలపైనా, జైలు నుంచి ఎప్పటిలోగా బయట పడతారన్న దానిపైనా లోకేష్ న్యాయపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నారు.
భయం ఏంటో రుచి చూపిస్తా అని… చివరికి..
మొత్తం మీద భయం అంటే ఏంటో చూపిస్తా.. వైసీపీకి భయాన్ని పరిచయం చేస్తా అంటూ యువగళం పాదయాత్రలో ప్రగల్భాలు పలికిన యువనేత అరెస్టు భయంతో ఢిల్లీలో దాక్కున్నాడన్న అపవాదును ఎదుర్కొంటున్నాడు. కొడాలినాని, వల్లభనేని వంశీ లాంటి వారిని తరిమి తరిమి కొడతాం.. రెడ్ బుక్ లో అన్నీ రాసుకుంటున్నా అంటూ ఓరేంజ్ లో పాదయాత్రలో ఫైర్ అయిన లోకేష్ ఇప్పుడు పిల్లిలా సైలెంట్ అయిపోవడం టీడీపీ శ్రేణులకే నచ్చడం లేదు. సీఐడీ(CID) పోలీసుల అరెస్టు, విచారణ అంటే మామూలుగా ఉండదని ట్రీట్ మెంట్ దారుణంగా ఉంటుందని విన్నాక ఏ యువనేతకైనా భయం కలగకుండా ఉంటుందా.
ఇప్పుడు తండ్రి జైలు నుంచి బయటపడటం కన్నా ముందు తనను తాను కాపాడుకోడం ఎలా అన్నదే లోకేష్ కు ప్రాధాన్యత ఉన్న అంశం. మామ బాలయ్య, భార్య బ్రహ్మిణి, తల్లి భువనేశ్వరిల సలహా మేరకు లోకేష్ ఢిల్లీలోనే ఉంటారని,ఇప్పట్లో ఏపీ రారనీ టీడీపీ నేతల మాటలు చెబుతున్నాయ్. యువనేతలోనే ఇంత భయం, అభద్రతా భావం ఉంటే పార్టీని నమ్మి ఒళ్లు కుళ్లబొడిపించుకుంటున్న కార్యకర్తల మాటేంటనే వాదనలూ టీడీపీ లో అంతర్గతంగా వినిపిస్తున్నాయ్.